Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కల్లోలపు కాలంలోనూ ప్రభుత్వం ప్రయివేటు పెట్టుబడి సేవలు మానడం లేదు. ఆర్థికరంగంలో సంస్కరణల పేరిట అంతా ప్రయివేటు పెట్టుబడికి అప్పగించేందుకు సాగుతున్న ప్రయత్నాలు వ్యవసాయరంగాన్నీ వదిలిపెట్టడం లేదు. సోమవారం ప్రభుత్వం పార్లమెంట్లో వ్యవసాయరంగానికి సంబంధించి ప్రవేశపెట్టిన మూడు బిల్లులూ ఈ కోవలోనివే అని ప్రతిపక్షాలు, వ్యవసాయరంగ నిపుణులూ విశ్లేషిస్తున్నారు. తమ పంటలకు తగిన గిట్టుబాటు ధర పొందేందుకూ, ప్రయివేటు పెట్టుబడులు సమకూర్చు కునేందుకూ, తగిన సాంకేతికతను అందిపుచ్చుకునేందుకే ఈ బిల్లులని ప్రభుత్వం చెబుతున్నది. ఏది నిజం? ఏది అబద్ధం? అబద్ధానికి అందమైన వేషం వేసి నిజమే అన్నంతగా భ్రమింపజేసే ఏలికల చాణక్యం ముందు నిజమేదో అబద్ధమేదో తేల్చుకోవడం అతికష్టమైన పనిగా మారిపోయింది. అసలు నిజం జనం తెలుసుకునేసరికి అబద్ధం తనపని తాను పూర్తిచేసుకుపోతున్నది.
ఈ కొత్తబిల్లులు ప్రవేశపెడుతూ ఏలినవారు చెప్ని మాటలు ఎంత తీయిగా ఉన్నాయో చూడండి. రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా తమకు ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకోవచ్చట! ఆన్లైన్లోనూ అమ్ముకోవచ్చట!! ఇందుకోసం వారు మార్కెట్ రుసుము చెల్లించాల్సిన అవసరమే లేదట!!! రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనలను తొలగిస్తూ తీసుకొచ్చిన ''ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు'' సారాంశమిది. వినడానికీ, చూడటానికీ ఎంతో బావుంది కదా..! గత 60ఏండ్లుగా ఉన్న నియంత్రణను ఎత్తివేస్తున్నాం. ఇక 'ఒకే దేశం.. ఒకే మార్కెట్'' ఏ రైతు ఎక్కడికైనా వెళ్లి అమ్ముకోవచ్చు అంటోంది ప్రభుత్వం. కానీ అసలు నిజం ఏమిటి? నిజానికి ఇక్కడ ఎత్తివేసింది నియంత్రణను కాదు, రైతులకూ వినియోగదారులకూ 60ఏండ్లుగా ఉన్న రక్షణను. తెలంగాణలోని ఓ సాధారణ రైతు ధర బాగా వస్తుందని తన పంటను ఏ కలకత్తాలోనో, ఏ చెన్నైలోనో అమ్ముకోగలడా? తన పంటకు తను ధర నిర్ణయించగలడా? కానీ వ్యాపారి మాత్రం తెలంగాణలో తక్కువ ధరకు కొని కలకత్తాలోనో, కాశ్మీరులోనో కాదు, అవసరమైతే అమెరికాలో కూడా అధిక ధరకు అమ్ముకోగలడు. ఏనుగుకీ ఎలుకకూ ఒకే నియమం పెడితే ఎలుకకు న్యాయం జరుగుతుందా..? ఈ బిల్లు వ్యాపారులకే తప్ప రైతులకు ఉపయోగపడేది కాదనడానికి ఇంతకన్నా ఉదాహరణేం కావాలి. వ్యవసాయ మార్కెట్ వ్యవస్థనే ఎత్తేసి, రైతుకు కనీస మద్దతు ధర కల్పించే బాధ్యతల నుంచి కూడా ప్రభుత్వం తప్పుకోజూస్తోంది. వ్యవసాయ మార్కెట్ వ్యవస్థను నీరుగార్చడం వల్ల సమస్త రైతాంగమూ మార్కెట్ శక్తుల కోరల్లో చిక్కుకోవడమే కాదు, దీనిపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు వీధినపడతారు.
ఇక రెండవ బిల్లు ''ద ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ బిల్లు''. దీని ప్రకారం పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విషయమై వ్యాపారులతో రైతులు ఒప్పందాలు చేసుకోవచ్చు. అంటే రైతులు వ్యాపారులతో, వాణిజ్య కంపెనీలతో నేరుగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది, ఆ ఒప్పందం ప్రకారం తమ పంటలను కూడా నేరుగా ఆ కంపెనీలకే అమ్ముకోవాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రైతు తన పొలంలో తనే కూలీగా మారాలి. ఏ పంట వేయాలో, ఏ ధరకు అమ్మాలో కంపెనీయే నిర్ణయిస్తుంది. ఇది రైతులను కంపెనీలకు కట్టుబానిసలను చేయడమే తప్ప రైతుకు ప్రయోజనం చేకూర్చడం ఎలా అవుతుంది? రైతుకూ, కంపెనీకి ఈ ఒప్పందంలో ఏ తేడా వచ్చినా పరిష్కారానికి బోర్డు అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అక్కడా పరిష్కారం కాకపోతే కోర్టులను ఆశ్రయించాలి. ఫీజులు చెల్లించి లాయర్లను పెట్టుకోగల స్థితి, అధికారులనూ న్యాయస్థానాలనూ ఒప్పించగలిగే స్థితి రైతులకుంటుందా? అందుకే నూటికో కోటికో తప్ప అన్ని కేసులూ కంపెనీలే గెలుస్తాయనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ బిల్లు కార్పొరేటు కంపెనీలకే తప్ప కర్షకులకు ఉపయోగపడేది కానేకాదు.
''రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా''కు సహకార బ్యాంకులపై సర్వాధికారాలనూ కట్టబెడుతూ తీసుకొచ్చిన ''ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ (అమెండ్మెంట్) బిల్లు'' మూడవది. ఇది ఇప్పటికే సమాఖ్య వ్యవస్థను క్రమంగా తన గుప్పిట్లోకి తీసుకుంటున్న కేంద్రం చర్యల్లో మరో అడుగనే చెప్పాలి. సహకార బ్యాంకులన్నీ రాష్ట్రాల అజమాయిషీలో ఉంటాయి. వాటిని ఆర్బీఐ చేతుల్లో పెట్టడమంటే కేంద్రం పెత్తనం చేయడమే అవుతుంది. పైగా ఈ బిల్లు నిబంధనల ప్రకారం రైతులు కానివారు కూడా సహకార బ్యాంకుల్లో చేరవచ్చని చెప్పడం సహకార వ్యవస్థను రైతుల నుంచి కబ్జా చేయడమే..! కాబట్టి ఈబిల్లులు వ్యవసాయోద్ధరణకేనని ప్రభుత్వం చెప్పే మాటలు ఓ అందమైన అబద్ధం మాత్రమే. వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ల చేతుల్లో పెట్టాలనేది అసలు నిజం. ఆత్మనిర్భర భారతమంటూ పేదల్ని మరింత పేదలుగా, దిక్కులేని వాళ్ళగా చేసే వాణిజ్య కుట్రలు యధేచ్ఛగా సాగుతున్న కాలంలో, వ్యవసాయాన్ని కూడా వదలని కుతంత్రాల్లో భాగమిది. ఈ నిజానిజాలను ప్రజలు గ్రహించనంతకాలం ఇవిలా సాగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా అన్నీ తెలిసిన మన పార్టీలూ వాటి ప్రతినిధులూ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి...