Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్రంప్ కు కరోనా పాజిటీవ్. ఆయన భార్య మోలానియాకూ పాజిటీవ్ అని తేలింది. ట్రంప్ కరోనాను చాలా నిర్లక్ష్యంగా, తేలిగ్గా తీసుకున్నారు. మాస్క్ పెట్టుకునేవారు కాదు. భౌతిక దూరం పాటించడమూ ఆయనకు ఇష్టం ఉండదు. నాకేం కాదు అన్న ధీమాతో వ్యవహరించారు. తాను గొప్ప నాయకుడిని, ధైర్యవంతుడిని కాబట్టి కరోనా నన్ను ఏమీ చేయలేదని ఆయన నమ్మకం! ఇప్పటికే అమెరికాలో 2,10,000 మంది కరోనా వలన చనిపోయారు. కరోనాకు గొప్ప నాయకుడా, ఆయనకు ధైర్యం ఉన్నదా లేదా అనే దానితో సంబంధం లేదు.
వచ్చే నెల 3న ఎన్నికలు ఉండటంతో ఆయన వేల మంది ప్రజలు, మద్దతుదారులు హాజరైన ప్రచార సభలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా హాజరయ్యారు. రిపబ్లికన్ సమావేశాలు ఇన్డోర్ స్టేడియాల్లోనే జరిగేవి. వేల మంది గుమిగూడటం, ఎవరూ మాస్క్లు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా ఉండటం జరిగింది. ఒక నాయకుడిగా ఆయన తమ పార్టీవారికి, మద్దతుదారులకు మహమ్మారి సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి కచ్ఛితంగా చెప్పి ఆచరించేలా చేయాల్సింది చేయకుండా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు.
అమెరికాలో జనవరి 21న మొదటి కేసు నమోదు అయింది. ట్రంప్కు వైద్య నిపుణులు దాని ప్రమాదాన్ని తెలియచేసినా నిర్లక్ష్యంగా ఉండిపోయారు. మాస్క్లు ధరించాల్సిన అవసరం లేదని, లాక్డౌన్ విధించాల్సిన పనిలేదని బహిరంగంగా ప్రకటించారు. కరోనా ఫ్లూ జ్వరంతో సమానమనీ అందుకు జాతీయ ఎమర్జెన్సీ అవసరం లేదనీ భావించారు. డిసిన్ఫెక్షన్ ఇంజెక్షన్ తీసుకుంటే చాలా తొందరగా కోలుకుంటారని సుద్దులు చెప్పారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తే వారిని లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారని పదే పదే వేధించారు. క్లోరోక్విన్ అనేది మలేరియా మందు. దాన్ని భారతదేశం నుంచి పెద్ద ఎత్తున తెప్పించుకుని ప్రజలను వాడమన్నారు. దానివల్ల ఫలితం ఉండదని వైద్య నిపుణులు చెప్పినా పట్టించుకోలేదు.
వెంటిలేటర్స్ తగినన్ని లేకపోయినా వాటిని తయారు చేయించడం, లేదా ఇతర దేశాల నుంచి దిగుమతి చేయించడంలో కూడా శ్రద్ద పెట్టలేదు. ఆయనకు ప్రజల ప్రాణాలను కాపాడాలనే స్పృహ ఉన్నట్టు ఏకోశానా కనపడలేదు. కంపెనీలు ఎప్పుడు తెరుద్దామా, ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభిద్దామా అనే ధ్యాసే తప్ప, కార్మికులు వారి కుటుంబాల క్షేమం గురించి ట్రంప్ పట్టించుకోలేదు. కంపెనీలు తెరవకపోతే పెట్టుబడిదారులకు లాభాలు రావని, మార్కెట్ శక్తులకు నష్టం జరుగుతుందని, అందుకని కార్మికులకు నష్టం జరిగినా లాభాలే ముఖ్యమనేది, మార్కెట్ శక్తులు లాభాలతో సంతోషంగా ఉండటమనేది ట్రంప్ సిద్ధాంతం. దానికి అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారు.
ట్రంప్ తనకు నచ్చినట్టు ప్రవర్తించడానికి ఏమాత్రం వీలులేదు. నేనూ నా ఇష్టం అనటానికి ఆస్కారమే లేదు. ఆయన ఒక దేశానికి అధ్యక్షుడు. ఆయనకు నిర్ణయాత్మక పాత్ర ఉంటుంది. ఆయన పాలన బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, నిజాయితీతో ప్రజల ధృక్కోణం నుంచి సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరీ మహమ్మారి సమయంలో ప్రజల ప్రాణాలు పిట్టాల్లా రాలిపోతుంటే... ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఆయన ముందుండి మార్గరద్శకత్వం వహించాలి. సైన్స్ ఆధారంగా వైద్య నిపుణులు ఇస్తున్న సలహాలను అమలు జరపడానికి తన యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. కానీ ట్రంప్ తన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమైనారు.
స్వయంకృతాపరాధంతో ఆయనకే కరోనా పాజిటీవ్ అని తేలింది. ఆయన నిర్లక్ష్యంగా ఉండటం కారణంగా ఆయన భార్య మెలానియాకూ కరోనా వచ్చింది. శ్వేతసౌధంలో ముగ్గురు విలేకర్లకు, ఇద్దరు సెనేటర్లకు, ఆయన ప్రచార మేనేజర్కూ పాజిటీవ్ వచ్చింది. అటు పిమ్మట ఆయన వాల్టర్ రాడ్ జాతీయ సైనిక వైద్య కేంద్రంలో చేరారు. అక్కడ కూడా ఆయన హడావిడి చేశారు. హాస్పిటల్లో బెడ్ మీద ఉండాల్సిన ఆయన కారులో షికారుకు వెళ్ళి ప్రజలకు అభివాదం చేశారు. తన కారులో విలేకర్లను, సెక్యూరిటీ సిబ్బందిని వెంటపెట్టుకుని వెళ్ళారు. వారికీ కరోనా సోకింది. మూడు రాత్రులు హాస్పిటల్లో గడిపి శ్వేత సౌధంకు తిరిగి వచ్చారు. వైద్యుల సలహాలను, అవసరమైన క్వారెంటైన్ కాలపరిమితిని కూడా పాటించలేదు. దానితో ఇప్పుడు శ్వేతసౌధం కరోనా హాట్స్పాట్గా మారిపోయింది. ప్రతి ఒక్కరూ సెక్యురిటీ, సిబ్బంది, విలేకర్లు అందరూ హడలిపోతున్నారు.
ట్రంప్ వ్యవహారశైలి చూస్తే నాకు భయంలేదు, నేను కరోనాతో పోరాడుతున్నాను, జయిస్తాను అని మొండి వ్యవహారంలా ఉన్నది. కరోనాకు భయపడి దేశాన్ని మూసివేసుకుంటామా అని ఆయన చెపుతున్నారు. చైనా లాంటి దేశాలు సకాలంలో స్పందించి, పూర్తి లాక్డౌన్ కఠినంగా పాటించినందుకు కరోనా పుట్టిన చోటనే దానిని అరికట్ట కలిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా కృషిని మెచ్చుకున్నది. తన కండ్ల ముందే చైనా అరికట్ట కలిగినప్పుడు అమెరికాకు ప్రజల ప్రాణాలను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే చైనా మార్గాన్ని గుణపాఠంగా తీసుకుని ఆచరించి ఉండేది. కానీ అలా జరగలేదు. ట్రంప్ కరోనాను 'చైనా వైరస్' అని చైనాను తిడుతుంటే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరగా కోలుకోవాలని సందేశం పంపారు. ఇద్దరిలో ఎంత తేడాయో..!