Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక జాతి ఉన్నతంగా నిర్మాణం జరగాలంటే, విద్యారంగం అందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని ఐదు దశాబ్దాల క్రితం కొఠారి కమిషన్ సెలవిచ్చింది. మన దేశంలోని మానవ వనరులను నైపుణ్య వంతంగా వాస్తవీకరించు కోగలిగితే ప్రపంచంలో దేశం ఉన్నతంగా ఎదగగలుగుతుంది అనడంలో ఏ సందేహమూ లేదు. అయితే అలాంటి విద్యా వ్యవస్థను అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్రం గానీ ప్రాధాన్యత గల విషయంగా పరిగణించి దానిపై శ్రద్ధ పెట్టకపోగా నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నవి. విద్యా వ్యవస్థను ప్రయివేటుపరం చేయటం కోసం ఉవ్విళ్ళూరుతూ దాని నిర్వహణను గాలికొదిలేస్తున్నవి. భావి పౌరుల జీవితాలతో ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయి.
ఇటీవల ఎంసెట్ రాసిన విద్యార్థుల ర్యాంకుల ప్రకటనలో గందరగోళం ఏర్పడి వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక వేదనకు గురయ్యారు. కరోనా సమయంలోనూ ఎంతో ఒత్తిడితో ఎంసెట్ పరీక్షకు హాజరయిన విద్యార్థులు, వారి ర్యాంకుల అవకతవకలను చూసి నివ్వెరపోతున్నారు. అర్హత మార్కులు సాధించిన వారికి ర్యాంకులు లేకపోవడం, అసలు పరీక్ష రాయని వారికి ర్యాంకులు రావడం, ఒక ప్రహసనంగా నిర్వహణ చేయడం బాధ్యతారాహిత్య చర్య. విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదు. ఈ రకమైన అవకతవకలను, గందరగోళాన్ని నివారించి సరైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను నిర్భంధించడం, లాఠీచార్జి చేసి గాయపరచడం ఘోరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే దారుణ కృత్యం.
ఇంతకు ముందు కూడా ఇంటర్ విద్యార్థుల మూల్యాంకనకు సంబంధించి ప్రయివేటు కంపెనీకి అప్పజెప్పి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులైనారు. కాబట్టి ఎన్నో ఆశలతో భవిష్యత్తుపై విశ్వాసంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు న్యాయం జరిగేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కేంద్రం కూడా నీట్ పరీక్షను అనేక అవకతవకలతో నిర్వహించింది. నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేక మోసాలకు, కుంభకోణానికి పాల్పడ్డాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓఎంఆర్ పత్రాల్లో, ప్రశ్నాపత్రాల్లో అనేక తప్పులున్నాయని విద్యార్థులు నిరూపిస్తున్నారు. సిలబస్లో లేని ప్రశ్నలను ఇచ్చి ఇన్విజిలేటర్ల సంతకాలు ఫోర్జరీ చేసి అనేక మోసాలకు పాల్పడి విద్యార్థులను నష్టపరిచారని విద్యార్థి సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. కాబట్టి వీటిపై విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాల్సి ఉంది.
ఇక వైద్యరంగాన్ని కూడా ప్రభుత్వాలు ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నాయి. కరోనా వచ్చి లక్షలాది మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంటే ప్రభుత్వాలు మాటలగారడీని ప్రదర్శిస్తున్నాయి. ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా బాధితులు పెరుగుతున్నారు. వందల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళకు కావాల్సిన వైద్య సదుపాయాలను, మందులను, కనీస వసతి సదుపాయాలను కల్పించేందుకు కొత్తగా పెద్ద ప్రయత్నాలేవీ చేయటం లేదు. జన్ ఆందోళన్ పేర ప్రచార కార్యక్రమాన్ని మాత్రం చేపట్టి కేంద్రం చేతులు దులుపుకుంటున్నది. నూటముప్పయి కోట్ల మంది ప్రజలున్న దేశంలో కేవలం ఎనిమిది కోట్ల మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించింది.
కరోనాపట్ల ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం, అతి తక్కువ కరోనా కేసులు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజలను నిర్బంధానికి గురిచేసిన కేంద్రం, ఇప్పుడు సామాన్యుల జీవితాలను వాళ్ళకే వొదిలేసి, కనీసం సమీక్ష, తీసుకునే చర్యలపై చర్చ కూడా పెట్టని స్థితిలోకి వచ్చాయి. ప్రయివేటులో ఉన్న వైద్యరంగాన్ని అదుపు చేసే పరిస్థితి కూడా ప్రభుత్వాలకు లేదు. ప్రయివేటు వైద్యరంగం దోపిడీని కండ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాయి. పెద్దసంఖ్యలో టెస్టులు చేయడం, వైద్య సదుపాయాలను పెంచడం, వ్యాధిగ్రస్తులకోసం కేంద్రాలను ఏర్పాటుచేయడం, సౌకర్యాలకల్పన మొదలైన ప్రణాళికలేమీ ప్రకటించడం లేదు. అంటే ప్రజల ఆరోగ్యంపట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారో అర్థమౌతున్నది.
ప్రజలకు అత్యంత అవసరమైన వైద్య రంగాన్ని, భావి భారత నిర్మాణానికి కీలకమైన విద్యారంగాన్ని, ప్రజల కోసం పనిచేస్తాయనుకున్న ప్రభుత్వాలు దారుణంగా నిర్లక్ష్యం చేస్తూ ప్రజలను వంచించడం క్షమించరాని నేరం