Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రయాణారంభాన్ని మర్చిపోతే గమ్యం శిథిలమవుతుంద''న్నాడు ఒక కవి. భారతదేశ కార్మికవర్గం నవంబర్ను ఎలా మర్చి పోగలదు? మనదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలపై కొట్టిన తొలిదెబ్బ 1991 నవంబర్ 29న. అప్పటికింకా ఆ విధానాల కోరలు సాధారణ కార్మికులకు కనపడలేదు. వచ్చే ఉపద్రవాన్ని మొదట అర్థం చేసుకుంది వామపక్షం. ఆ విధానాలకు మొట్టమొదటి ఎర్రజెండా చూపింది కార్మికవర్గం. ''ఒకటి.. నాలుగు.. తొమ్మిది.. పన్నెండు... కాలాన్ని వారికోసం లెక్కపెట్టే వాళ్ళులేని'' జనం కోసం నవంబర్ నెలను మరోసారి గుర్తు చేసుకోవాలి. 19వ సారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే విధానాలు శరవేగంతో పరిపూర్తి కావచ్చాయి. తోటి కష్టజీవిలో శత్రువును వెతుకుతున్నారు కొందరు. ఏదోపోయిందని దేనికోసమో వెతక్కుంటున్నారు మరికొందరు. ఆదమరిచిన జనం 'ఫ్లైట్ మోడ్లో ఉంటే ప్రజల ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై దాడి ఎక్కుపెట్టింది మోడీ సర్కార్.
అందుకే సామాన్యుడా! హౌషియార్ రహౌ!
జీడీపీ అంకెలకు, సెన్సెక్స్ సంఖ్యలకు నూతన శతాబ్ది కొత్త వరవడి దిద్దింది. చిటారు కొమ్మన మిఠాయిపొట్లం చూపిస్తూ, అది ఏ రంగు జెండాల పాలకులైనా సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టడం పరిపాటిగా మారింది. మొదట వాజ్పారుకి, తర్వాత మన్మోహన్సింగ్కు వారిద్దరి మాటల్లో 'సంకీర్ణ ధర్మం' పరిమితులు విధించింది. సంక్షోభం నుంచి బయట పడటానికి గుత్తపెట్టుబడికి ఈ సంకీర్ణ పరిమితులు అసహనం సృష్టించాయి. 'కారణజన్ముడి' కోసం దాదాపు ఆరున్నర దశాబ్దాలకు పైగా చేసిన తపస్సు సంపన్నమై ఎటువంటి శషభిషలూ లేకుండా నిర్దాక్షిణ్యంగా కార్పొరేట్లకవసరమైన విధానాలను అమలు చేయగల పాలకుడు మోడీ రూపంలో ప్రసన్నమయ్యాడు.
ఆ తరువాతది నడుస్తున్న చరిత్రే! కేంద్రం, కేరళ మినహా, దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సులభతర వ్యాపారంలో ర్యాంకుల కోసమే పాకులాడుతున్నాయి. 'కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన' (మినిమమ్ గవర్నమంట్ మాగ్జిమమ్ గవర్నెన్స్) పాలకపార్టీల నేతల నాలుకలపై తారక మంత్రమైంది. అంటే ప్రభుత్వరంగాన్ని వదిలించుకోవడం, ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల భారం తగ్గించుకోవడం కీలకం. మోడీ సర్కార్ బీపీసీఎల్ వంటి బంగారు బాతులను తెగనమ్ముతున్నది. వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి వరదగేట్లెత్తేసింది. దీనికి రైల్వేలైన్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే ఉత్పత్తి యూనిట్లు, ఎయిర్పోర్టులు, పోర్టులు, బొగ్గు గనులు, 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, కేంద్ర ప్రభుత్వాల విధానాలవల్లే నష్టాల పాలైన బీఎస్ఎన్ఎల్, ఎయిరిండియా సర్వం విశ్వ విపణి కబేళాలో గొర్రెపిల్లలా నిలబడి ఉన్నాయి. ఈ సంస్థల రక్షణ కోసం పోరాడుతున్న కార్మికులను, ఉద్యోగులను, అధికార్లను దేశద్రోహుల జాబితాలో కెక్కించారు 'మోడీ భక్తులు'.
ఇన్ని చేస్తున్నా, ఇంత చేస్తున్నా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతూనే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 24శాతానికి పడిపోయింది. అసలీ ఆర్థిక సంవత్సరమే మైనస్ 9.6 శాతం పడిపోతుందని ప్రపంచబ్యాంకు ఏజెన్సీ చెప్తే, ఆర్బీఐ మైనస్ 9.5 శాతం క్షీణిస్తుందని పేర్కొన్నది. సెంటర్ ఫర్ మోనటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం నిన్నటి సెప్టెంబర్ నెల్లో 2.1కోట్ల ఉద్యోగాలు ఆవిరైనాయి. కోవిడ్కి ముందే, అంటే 2020 మార్చి 31కి దేశంలో నిరుద్యోగం గత 45ఏండ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. దీనికి కోవిడ్ అనంతర పరిస్థితి అదనం.
మన దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికుందని భ్రమపడేవారికి మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలు కనువిప్పు చేశాయి. ప్రతిపక్షం లేకుండా అటు రైతాంగానికి, మన దేశ వ్యవసాయానికి ఉరితాళ్ళ లాంటి మూడు బిల్లులను, మన దేశ కార్మికోద్యమాన్ని వందేండ్లు వెనక్కి నెట్టడానికి, కార్మికులను బానిసలుగా మార్చే మూడు కోడ్లను 'పాస్' చేసుకుని వికటాట్టహాసం చేసింది పాలక బీజేపీ.
ఇప్పటికే చేతివృత్తులు నాశనమవుతున్నాయి. అతి పెద్ద ఉపాధి కల్పనా కేంద్రం వ్యవసాయం కార్పొరేట్ శక్తుల వీరభోజ్యమవుతోంది. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎమ్.ఎస్.ఎమ్.ఈలు 2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్టీల దెబ్బ నుంచి కోలుకోక ముందే కోవిడ్ లాక్డౌన్ నీలినీడలతో సర్వనాశనమైనాయి.
ఈ దశలో నవంబర్ 26న జరిగే దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె సందర్భంగా భారతదేశ శ్రామిక లోకం ప్రభుత్వ తప్పుడు విధానాలపై పోరాడుతూనే ప్రత్యామ్నామ విధానాల్ని ప్రజలముందుంచాలి. సరళీకృత ఆర్థిక విధానాలను వ్యతిరేకించే వామపక్షాలు, కార్మిక సంఘాలు మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మార్గాల దిశ చూపిస్తూనే ఉన్నాయి. ఈ విధానాలకు మరో ప్రత్యామ్నాయం లేదని 'వారు' విగ్రవీగే రోజుల నుంచే ఈ ప్రత్యామ్నాయ దిశానిర్దేశం జరుగుతూనే ఉంది. కార్పొరేట్లకు అంటకాగడానికి అలవాటు పడ్డ పార్టీలకు, నేతలకు ప్రజల కోసముండే ప్రత్యామ్నాయాలు కనపడవు.
ఇప్పుడు కాకుంటే ఎప్పటికీ కాదు (నౌ ఆర్ నెవ్వర్) అనే పద్ధతిలో మోడీ, శిష్యులు బరి తెంగించారు. మన దేశ శ్రామికులకూ నేడిదే పరిస్థితి. ఈ దశలో ప్రతిఘటించకపోతే ఎప్పటికీ బానిసల్లా బతుకుతాం! నవంబర్ 26 సమ్మె చివరిది కాకపోవచ్చు. అయితే అంతానికి ఆరంభంగా మిగలాలి.