Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో వర్షం మహాప్రళయాన్ని సృష్టించింది. జనజీవనాన్ని స్థంభింపజేసింది. గత 20ఏండ్లల్లో ఎప్పుడూలేని విధంగా వానలు పడ్డాయి. వాగులు, వంకలతోపాటు ఈసారి కొత్తగా ఊర్లు, కాలనీలు, రహదారులు పొంగిపొర్లాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. ఎటొచ్చి సామాన్యులే మళ్లీ ఇబ్బంది పడ్డారు. మళ్లీ ప్రభుత్వ వైఫల్యమే బయటపడింది. సర్కారు సన్నద్దత సరిగ్గా లేకపోవడంతో వరదల్లో జనం బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ప్రాణ, ఆస్థి, పంట నష్టాలూ చోటుచేసు కున్నాయి. దాదాపు 25 మంది వరకూ మరణించారనేది తాత్కాలిక సమాచారం. ఇంకా ఎక్కువే ఉండే అవకాశం లేకపోలేదు. గత మూడు రోజులుగా వర్షం పడుతున్నా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించలేదని చెప్పడానికి జరిగిన ప్రాణ, ఆస్థి నష్టం, మునిగిన కాలనీలే సాక్ష్యం. హఠాత్తుగా ప్రమాదం ముంచుకొస్తే సర్కారు ఏం చేయడానికి అవకాశం లేకుండా పోయిందని అనుకోవచ్చు. కానీ, ఇటు 48 గంటలుగా కాస్త హెచ్చుతగ్గులు ఉన్నా వర్షం పడుతూనే ఉంది. అటు వాతావరణ శాఖ భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని పదే పదే హెచ్చరికలు పంపుతున్నది. ప్రగతిభవన్ మాత్రం ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఆదేశాలిచ్చి చేతులు దులుపేసుకుంది. అసెంబ్లీ బిజినెస్ను పూర్తిచేసుకోవడానికి ఆఘమేఘాల మీద ఒకరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టిన గులాబీ సర్కారు, వరదలపై ఒక ప్రకటన చేసి ఊరుకుంది. అసలు సమస్య ఎందుకు ఉత్పన్నమైంది, వాటికి పరిష్కారాలను సభ సాక్షిగా వెతకకుండా నాన్చుడు ధోరణిని అవలంభిస్తున్నది. అద్భుతంగా పనిచేస్తున్నాయంటూ హైదరాబాద్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు గతంలో ఇచ్చిన మంత్రి కేటీఆర్ ఇచ్చిన కితాబు గాలి కబురేనని తేలిపోయింది. చాంద్రాయణ గుట్టలో రెస్క్యూ చేయలేమంటూ వెనుతిరిగిన వైనమే ఇందుకు నిదర్శనం. ముందస్తుగా తగిన ప్రణాళికతో నష్టనివారణా చర్యలు తీసుకోవచ్చు. ప్రాణ, ఆస్థి నష్టాలను సాధ్యమైనంత మేర తగ్గించుకోవచ్చు. ఆ ప్రయత్నం సర్కారు నుంచి చిత్తశుద్ధితో జరగలేదు. వానల నేపథ్యంలో విశ్వనగరం హైదరాబాద్ బండారం బట్టబయలైంది. గడిచిన రెండు రోజుల్లో వానలకు రాష్ట్ర వ్యాప్తంగా అపార ఆస్థి, ప్రాణనష్టంతోపాటు లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ వరదల్లో ఇప్పటిదాకా సుమారు 3లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు అంటున్నాయి. ఆగస్టు నుంచి మరో 4లక్షల ఎకరాల్లె నష్టం జరిగింది. వందలాది ఇండ్లు వరదలకు నేలకూలాయి. వర్షం వరదలో కొట్టుకుపోయినవారి సంఖ్య ఇప్పటికీ లెక్కతేలలేదు. లక్షలాది మంది సామాన్యులు నిరాశ్రయులయ్యారు. క్యాంపులు పెట్టి భోజనం పెట్టడమేగాక వారి జీవితాలను సుస్థిరం చేయాల్సిన బాధ్యత సర్కారుదే. ఇటీవల కాలంలో ప్రజలపై దెబ్బమీద దెబ్బ పడుతున్నది. కరోనా లాక్డౌన్ నుంచి మొదలెడితే వరదల దాకా అష్టకష్టాలు తప్పడం లేదు. వారికి ఊపిరి మెసలడం లేదు. మధ్యలో ఎల్ఆర్ఎస్, ధరణి అంటూ పరిపాలనా పరమైన ఇబ్బందులకు గురయ్యారు. అసలు ఉపాధి పనులు కోల్పోయి అల్లాడుతున్న పేదలకు వరదలు కన్నీటి కడగండ్లనే మిగిల్చాయి. మరిన్నీ కష్టాల్లోకి నెట్టాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళిక లేమీతో ప్రజలు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. కరెంటు లేక దాదాపు 24గంటలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు అంధకారమే మిగిలింది. వర్షం గతంలో ఎన్నడూలేనివిధంగా రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో 21 సెంటీమీటర్ల నుంచి 31.90 సెంటీమీటర్ల దాకా పడింది. ఎన్డీఆర్ఎప్ బృందాలు చేతులేత్తేయడంతో ఆర్మీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ముసురుగా ప్రారంభమై సాయంత్రానికి జోరువానగా రూపాంతరం చెందింది. రాత్రి ఏడు గంటల తర్వాత కుండపోతగా పడింది. అర్థరాత్రి దాటేవరకూ వర్షం భీభత్సం కొనసాగింది. పల్లెలు, పట్టణాలు, నగరాలు జల విలయాన్ని ఎదుర్కొన్నాయి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలివాన రాగా, పట్టపగలే రాజధాని చీకిటిని చూసింది. రోడ్లపై జనం కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇండ్లకు చేరుకోవడానికి మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ యాతన పడాల్సి వచ్చింది. మరో 48 గంటలూ వానల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పలు విశ్వవిద్యాలయాలూ పరీక్షలను వాయిదా వేశాయి. 400ఏండ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ.67 వేల కోట్లు ఖర్చు చేశామని జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రి కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. త్వరలో ప్రగతి నివేదికను విడుదలచేస్తామన్నారు కూడా. 2050 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ను తీర్చిదిద్దుతామంటున్నారు. వరదలు వారి మాటల్లోని డొల్లతనాన్ని బయటపెట్టాయి. ప్రజల సాధరణ జీవనానికి ఇబ్బంది కాకుండా మహానగర ప్రణాళికను కూర్చాల్సి ఉంది. ప్రకృతి విపత్తుల నిర్వహణ మరింత సమర్థవంతంగా చేసేలా ప్రత్యేక అధ్యయనం, ఆచరణా అవసరం. ప్రధానంగా డ్రైయినేజీ వ్యవస్థను గాడీలో పెట్టాల్సిన పరిస్థితిని తాజా భారీ వర్షాలూ స్పష్టం చేస్తున్నాయి. అభివృద్ధి ప్రణాళికలను ఎన్నికలు, ఓట్లను దృష్టిలో పెట్టుకుని కాకుండా సాధారణ ప్రజల జీవన గమనంతో ముడిపెట్టి చేస్తేనే సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.