Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్వేషాల హౌరులో విధానాలు చిన్నబుచ్చుకుంటున్నాయి. భావోద్వేగాల మాయలో బతుకులు భరోసా కోల్పోతున్నాయి. ఎన్నిక ఏదైనా సరే జరుగుతున్నది మాత్రం ఇదే..! ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ మనం చూస్తున్నది ఇదే..!! ప్రజలను చీల్చి ఫలితాలను పొందేందుకు అటు బీజేపీ ఇటు ఎంఐఎం రెండూ విద్వేషాలను రెచ్చగొట్టడమే వ్యూహంగా ఎంచుకోవడంతో ఎన్నికల ప్రచార సరళి జుగుప్సాకరంగా మారింది. ఎన్నికలన్నాక ప్రచారం అవసరమే. విమర్శలూ ప్రతివిమర్శలూ సహజమే. కానీ వ్యక్తీకరణలో సంయమనమూ, సంబద్ధతా అంతకంటే అవసరం. పామరుల అజ్ఞానాన్నీ, పండితుల అతిశయాన్నీ భరించడం మనకు అలవాటేగానీ నాయకుల అహంకారమూ, అధికార దాహమూ, అనుచిత వ్యాఖ్యలే మరీ దుర్భరంగా ఉంటున్నాయి. మనకు ప్రాతినిధ్యం వహించే నేతల మేథోస్థాయి ఇదా అని కించిత్తు కలవరపాటు కూడా కలుగుతున్నది.
ఈ విద్వేష ప్రచార పర్వంలో ప్రజల మౌలిక సమస్యలూ, వారి నిజమైన అవసరాలూ, అభివృద్ధీ మరుగునపడిపోతుండగా.. ప్రజల మధ్య సౌహార్ధత, సామరస్యం ఛిద్రమైపోతున్నాయి. బీజేపీ అగ్రనేతలు మైనారిటీలనూ పాతబస్తీనీ లక్ష్యంగా చేసుకుని చెలరేగుతోంటే, అందుకు ప్రతిగా మజ్లీస్ నాయకులు మరింత రెచ్చిపోతున్నారు. ఇరువురూ కలిసి నగరంలోని సామరస్యాన్ని చెదరగొడుతున్నారు. విధానాల ప్రాతిపదికన కాక, మతాల ప్రాతిపదికన ఓట్ల సమీకరణకు పూనుకుంటున్నారు. ఫలితంగా విద్వేషమే ఓ విధానంగా ఎన్నికల వ్యూహాలు సాగుతున్నాయి. ముందు ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం.
నిత్యం అనేకరకాల అపసవ్యతలు, అక్రమాలు, అఘాయిత్యాలు ఇప్పటికే ప్రజా జీవితాన్ని దుర్భరంగా విస్తున్నాయి. నీరూ, గాలీ సైతం కలుషితమైపోతున్నాయి. వీటన్నిటికంటే తీవ్రమైన కాలుష్యం మాటల రూపంలో భయపెడుతుండటాన్ని నగర ఎన్నికలు అనుభవంలోకి తెస్తున్నాయి. పాతబస్తీలో పాకిస్థానీయులు, రోహింగ్యాలు ఉన్నారనీ, తాము గెలిస్తే ఆ ప్రాంతంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామనీ స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే విద్వేష వ్యాఖ్యలకు పూనుకుంటారు! ఆ వ్యాఖ్యలను బలపరుస్తూ రోహింగ్యాలకూ, అక్రమ చొరబాటుదార్లకు పాతబస్తీలో ఓట్లున్నాయంటూ ఆ పార్టీ కేంద్ర మంత్రి ప్రచారం చేస్తారు!! సర్జికల్ స్ట్రైక్ చేసేది శత్రు భూభాగాలపైన అన్నసంగతి ఆ పార్టీ అధ్యక్షుడికి తెలియదా..? రోహింగ్యాలు, పాకిస్తానీయులు దేశంలోకి అక్రమంగా చొరబడితే ఆ వైఫల్యం తమ ప్రభుత్వానిదేనని ఆ కేంద్రమంత్రికి తెలియదా..? కేవలం ఓట్ల కోసం, రాజకీయాల కోసం ఇంత వైషమ్యాన్ని రెచ్చడొట్టడం వారికి తగునా..?
మరోవైపున ఎంఐఎం పార్టీదీ ఇదే దురాగతం. మూసీదాటి రాలేరని రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంలోని ఔచిత్యమేమిటి? విద్వేషమే కదా..! ఇద్దరి వ్యూహమూ విద్వేష రాజకీయాలే. ఇద్దరి లక్ష్యమూ ప్రజలను ఏమార్చి బల్దియా పీఠాన్ని సాధించడమే. ప్రజల కనీస అవసరాల గురించిన చర్చ కాగితాలకే పరిమితం చేసి, సంస్కారహీనంగా, బాధ్యతారహితంగా నోటికి పని చెపుతున్నారు. ''నోరా, వీపుకు తేకే'' అని సామాన్యులు తమను తాము హెచ్చరించుకుంటారు. ఇప్పుడు ''మాటా, సీటుకు తేకే'' అని ఈ నేతలు తమను తాము హెచ్చరించుకునేలా పాఠం నేర్పాల్సిన బాధ్యత ప్రజలదే. ప్రజలకు మేలు చేసే విధానాలు తమ వద్ద లేనివారు, విధానాలతో ప్రజల హృదయాలను గెలవలేనివారు మాత్రమే విద్వేషాలకు తెగిస్తారు. ఇక మైనారిటీలపై ద్వేషాగ్నులు రగిలించే యోగి ఆదిత్యనాథ్, అమిత్షాతో సహా ఇంకా అనేక మంది కేంద్ర మంత్రులూ, ఈ విద్వేష ప్రయోగాలలో అత్యంత నిపుణులైన అగ్రనేతలందరూ భాగ్యనగరానికి తరలి వస్తున్నారట. నేడు ప్రధాని మోడీ కూడా వేంచేస్తున్నారు. ఆయన కరోనా వ్యాక్సిన్పై సమీక్ష కోసం భారత్ బయోటెక్స్ సందర్శించడానికి వస్తున్నారని చెపుతున్నా.. అదొక సాకు మాత్రమేననీ, ఇది పరోక్షంగా ఈ ఎన్నికలను ప్రభావితం చేయడానికేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణాలేమైనప్పటికీ నగరంపైకి దండెత్తనున్న ఈ నాయకగణాన్ని చూస్తే ముందు ముందు ఏం వినాల్సి వస్తుందో, ఏం చూడాల్సి వస్తుందో.. అన్న ఆందోళన పెరుగుతోంది.
ఈ ఆందోళన ఇలా ఉండగా... ఎన్నికలు వాయిదా వేయించడమే లక్ష్యంగా నగరంలో మతకలహాలకు కుట్రలు జరుగుతున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోలిసు అధికారుల సమావేశంలో పేర్కొనడం మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. అదే నిజమైతే ఆ కుట్రను ఛేదించి, దోషుల్ని శిక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. లేదంటే మత ఉన్మాదం మహాప్రమాదం. కేవలం ఒక నగర ఎన్నికల కోసం సాధారణ ఎన్నికలను మించి వ్యూహ ప్రతివ్యూహాలు సాగుతుండటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందిగానీ, కొంచెం ఆలోచిస్తే తత్వం బోధపడుతుంది. ''సందర్భమేదయినా కానియ్యి.. చర్చ మాత్రం భావోద్వేగాల చుట్టే తిరగాలి. అసలు సమస్యలు, ప్రజల నిజమైన అవసరాలు మట్టిగొట్టుకుపోవాలి.'' ఇదే అభివృద్ధి నిరోధకుల వ్యూహం. వీరు అసత్యాల్ని ప్రచారం చేయడం, భావోద్వేగాల్ని రగిలించడం, విద్వేషాల్ని రెచ్చగొట్టడమే తమ విజయాలకు సోపానాలుగా ముందుకు సాగుతున్నారు. నగర భవిష్యతైనా, రాష్ట్ర భవిష్యతైనా, దేశ భవిష్యతైనా ప్రజలు ఇది గుర్తెరిగి నడుచుకోవడం మీదే ఆధారపడి ఉంది.