Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ సామ్రాజ్యవాద నిజ స్వరూపాన్ని మరోసారి రుజువు చేసింది. తన లాభం తప్ప ప్రాణాల్ని కూడా లెక్క చెయ్యని స్వభావం దానిది.
కరోనా వైరస్ ఖండాలను, సముద్రాలను దాటుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ స్వైర విహారం చేస్తున్నది. చివరికి ఇది ఎంతమందిని బలిగొంటుందన్నది ఇప్పటికీ ఒక ప్రశ్నే. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేతులు శుభ్రంగా కడుక్కుంటు న్నారు, మాస్కులు ధరిస్తున్నారు, భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో అన్ని దేశాలు కలిసి ఈ మహమ్మారిని ఓడించాలని ప్రతిఒక్కరూ కోరుకోవడం సహజం. ఇది ఒక మానవ సంక్షోభ స్థాయికి చేరుకుంటున్నది. ఈ దశలో అమెరికా వికృత రూపం, విపరీత చేష్టలు ప్రపంచ మానవాళి ముందు నగుబాటు అవుతున్నాయి.
సామ్రాజ్యవాద అమెరికా గతం నుంచీ క్యూబా, వెనిజులా, ఇరాన్ లాంటి అనేక దేశాలపై ఆంక్షలు విధించి అక్కడికి నిత్యజీవితావసర మందులు, ఆహార పదార్థాలు చేరకుండా రవాణాకు అడ్డుకట్ట వేసింది. ఈ సంక్షోభ సమయంలో ఈ దేశాల ప్రజలు తమ ప్రాణాలను రక్షించు ోవడానికి అమెరికా తన ఆంక్షలు, దిగ్బంధాన్ని సడలిస్తుందని కోరుకుంటారు. కానీ సామ్రాజ్యవాద అమెరికా గుండె కరగలేదు. ఆంక్షలను మరింత కఠినంగా అమలు జరుపుతున్నది. ఈ చట్ట విరుద్ధ , ఏకపక్ష దిగ్బంధనం అనేది వెనిజులా, క్యూబా, ఇరాన్ ప్రజలకు విధించిన సామూహిక శిక్షలాంటిది.
1949 జెనీవా ఒప్పందం ప్రకారం దేశ ప్రజలందరికి నష్టం కలిగించే ఒక విధానాన్ని అమలు జరిపితే అది యుద్ధ నేరం కిందకు వస్తుంది. అమెరికా అమలు జరుపుతున్న ఆంక్షల వలన సమయానికి మందులు తెప్పించుకునే అవకాశం లేదు. కాగితాలపై ఆంక్షలు మందులకు వర్తించవని ఉన్నా, వాటిని రవాణా చేయలేదు. అదే దేశంలోకి తీసుకుపోయినా వాటిని ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థలో వాడటానికి వీలు లేదు. ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ లా కమిషన్ 1947 ప్రకారం ఇది మానవ జీవనంపై నేరం చేసినట్టు. ఏ చట్టాలు అమెరికా చేస్తున్న నేరాన్ని అడ్డుకోలేకపోతున్నాయి.
ఇవి చాలదన్నట్టు 2017లో ట్రంప్ ప్రభుత్వం వెనిజులా సెంట్రల్ బ్యాంక్ను బ్లాక్లిస్ట్ చేసింది. దానితో పాటు వెనిజులా, ఇరాన్ లాంటి దేశాలలోని ప్రభుత్వ రంగ సంస్థలతో వ్యాపారం చేస్తున్నట్టు తెలిస్తే వాటిపై రెండో తరహా ఆంక్షలు అమలులోకి వస్తాయి. 2017లో మరో చట్టం కూడా ట్రంప్ తెచ్చాడు. అమెరికాతో విబేధించే దేశాలపై ఆంక్షల చట్టం అని దాని పేరు పెట్టారు. దీనితో ఇరాన్, రష్యా, ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థలకు ప్రతి అంశంలో ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఆ దేశాలు ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలో లావాదేవీలు జరపడానికి వీలులేదు. ఇరాన్, వెనిజులాలలో వైద్య వ్యవస్థ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో ఆంక్షల వలన ఎవ్వరు వారితో వ్యాపారం చేయడానికి ముందుకు రావడం లేదు. దానిలో మందులు, పరీక్షలు చేసే కిట్స్, వైద్య పరికరాలకు తీవ్ర కొరత ఏర్పడింది.
వెనిజులా ఈ దిగ్భందనాన్ని బద్దలు కొట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో పని చేస్తున్నది. దానికి కూడా అమెరికా అడ్డుపడుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చే మందులను విమానాలు రవాణా చెయ్యడానికి ముందుకు రావడం లేదు. విమాన సర్వీసులను నిలిపివేశారు. ఓడలలో తీసుకుపోదామంటే ఓడల యజమానులు అమెరికాతో ఘర్షణ పడి రవాణా చేయడానికి సిద్ధం కావడం లేదు. ఇరాన్కు చిట్టచివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన మందులను సైనిక రవాణా విమానంలో పంపవలసి వచ్చింది.
ఇటువంటి గడ్డు పరిస్థితులలో క్యూబా, చైనా ముందుకు వచ్చి తమ స్నేహ హస్తాన్ని అందించాయి. ఇది ఒక కీలకమైన విషయం. ఆ దేశాలు సోషలిస్టు దేశాలు. వాటికి లాభాలు కాదు, ప్రజల ప్రాణాలు ముఖ్యం. చైనా తానే కష్టాలలో ఉన్నా ఈ దేశాలకు పరీక్షల కిట్స్, మందులు, వైద్య పరికరాలను పంపిస్తున్నది. చైనా నుంచి నిపుణులైన డాక్టర్లు తెహరాన్ చేరుకుని అక్కడ వైద్యులకు తమ అనుభవాలను పంచుతున్నారు. ఇది సరైన మానవ స్నేహం. ఇది సోషలిస్టు దేశాలకే సాధ్యం.. మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో తాము ఏ ఆంక్షలను లెక్కచేయమని చైనా, క్యూబా దిక్కరిస్తున్నాయి.
ఇరాన్ కరోనా వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడే ఒక యాప్ను ఆవిష్కరిస్తే అమెరికా ఒత్తిడితో గూగుల్ దాన్ని తొలగించింది. మార్చి 2020లో ఇరాన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో అమెరికా విధించిన ఆంక్షలపై దావా వేస్తే, ఆ కోర్టు అమెరికా ఆంక్షలను తొలగించాలని తీర్పు ఇచ్చింది. అయినా ఖాతరు చేయని అమెరికా రక్షణ మంత్రి ఎదురు తిరిగి ఈ అంశం కోర్టు పరిధిలోకి రాదని బరితెగించి మాట్లాడుతున్నారు. ఇది ట్రంప్ కాలంలోనిది. ఇప్పుడు బైడెన్ తను ఏర్పాటు చేయబోతున్న మంత్రి వర్గంలో కూడా యుద్ధోన్మోదులనే భర్తీ చేసుకోవాలని కసరత్తు చేస్తున్నట్టు అమెరికా నుంచి వార్తలు వస్తున్నాయి. ఆంక్షల తొలగింపు గురించి ఈ మహమ్మారి కాలంలో బైడెన్ పల్లెత్తి మాట మాట్లాడకపోవడం ఆయన లక్షణం ఏమిటో స్పష్టం చేస్తున్నది. మనవ సమాజం ఎదుర్కొంటున్న మహమ్మారిని అరికట్టడానికి ఆంక్షలు అమెరికా తొలగించాలి. ట్రంపా లేక బైడెనా అనేది సమస్య కాకూడదు.