Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత పదినెలలుగా దేశ ప్రజలను, వ్యవస్థను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్నది. దీని నుంచి రక్షణ పొందటానికి వైద్యరంగ పరిశోధకులు ఆనాటి నుంచీ ప్రయత్నాలు ప్రారంభించి ఒక దశకు చేరుకున్నారు. ఇక కొద్ది రోజుల్లో కరోనాకు వాక్సిన్ (టీకా) అందు బాటులోకి వస్తుందని ప్రభుత్వం, ప్రధానమంత్రి ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రష్యా, బ్రిటన్ వాక్సిన్ను ప్రారంభించారు. ఈ వాక్సిన్లకు సంబంధించిన విషయాలు పలు రకాలుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చర్చలూ జరుగు తున్నాయి. భిన్నమైన వాదనలూ వినిపిస్తున్నాయి. కానీ సామాన్యులు లక్షలాది కండ్లతో ఎదురు చూస్తున్నారు. మన ప్రభుత్వం కరోనా వాక్సిన్ను మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పారు జన్మదినం డిసెంబర్ 25 నుంచి ప్రారంభిస్తు న్నామని తెలిసింది. ముందుగా వైద్యరంగం, పోలీసు, పారిశుద్ధ్యరంగంలోని వాళ్ళకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
వాక్సిన్ అందుబాటులోకి రావడాన్ని అందరూ ఆహ్వానిస్తారు. ఆ టీకా సామాన్య జనులందరికీ చేరువ కావాలంటే ఇంకా చాలా నెలలే పట్టవచ్చు. ఇప్పుడీ మూడు రంగాలలోని వారే ఎనభై లక్షలమంది ఉన్నారు. వాక్సిన్ తయారు వేరు, ఉత్పత్తి, నిల్వ మొదలైన ఇతర అంశాలు వేరు. ఏది ఏమైనా ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంతోనే ఈ టీకా మార్కెట్లోకి వస్తుంది. వాక్సిన్ను త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలనే తహతహ ప్రభుత్వాల కంటే కంపెనీలకే ఎక్కువగా ఉంది. మన అందరికీ తెలుసు ప్రపంచంలో వైద్య, ఔషధరంగం లక్షల కోట్ల డాలర్ల వ్యాపారంతో ముడివడి, బహుళజాతి సంస్థల ఆదీనంలో నడుస్తున్నది. ఏవో కొన్ని దేశాలలో, సోషలిస్టు సమాజాలలో తప్ప మిగతాదంతా ప్రయివేటు వ్యాపారంగానే సాగుతున్నది. అందుకని ఇది ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత కంటే, వ్యాపార లాభాలపట్ల ఆసక్తులే ఎక్కువగా ఉంటాయనటంలో ఏరకమైన సందేహం లేదు. ఎందుకంటే రాజకీయాలను కూడా దీనిచుట్టు తిప్పే పరిస్థితులను మనం చూస్తున్నాం. రాజకీయ నాయకుల నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో వీటి యొక్క ఆర్థిక కార్యకలాపాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఫార్మసీ కంపెనీల మధ్య జరిగే ఒప్పందాలు, లావాదేవీలు మొదలైనవన్నీ ప్రపంచాధిపత్యపు పరిధిలోంచే జరుగుతుంటాయి. ఇవన్నీ అంత తొందరగా బోధపడవుగానీ, ప్రస్తుతం మన దేశ ప్రజల ఆరోగ్య సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందనేది ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
మొన్నీ మధ్య బీహార్లో ఎన్నికల సందర్భంగా అక్కడి బీజేపీ ఎన్డీఏ కూటమి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో వాక్సిన్ అంశాన్ని చేర్చి ప్రచారానికి వాడుకున్నది. మీరు ఓట్లేసి గెలిపిస్తే ప్రజలందరికీ ఉచితంగా టీకా వేయిస్తామని వాగ్దానం చేసింది. అప్పటికీ, ఇప్పటికీ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధాని హైదరాబాద్ బయోటెక్ ల్యాబ్ను సందర్శించి టీకా వివరాలను తెలుసుకోవటం పరోక్షంగా ఎన్నికలను ప్రభావితం చేయటానికే అనేది సుస్పష్టం. దేశంలో ప్రజలందరూ కరోనా వైరస్తో అనేకరకాల అనారోగ్యాలతో, ఆర్థిక సంక్షోభాలతో సతమతమవుతూ విలపిస్తున్న తరుణంలో ప్రభుత్వాలు ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించి ఆదుకోవటం కనీసధర్మం. కానీ ఈ సందర్భాన్ని కూడా తమ రాజకీయ లాభాలకు, ప్రయోజనాలకు వినియోగించుకునే ప్రయత్నం చేయటం అత్యంత విచారకరం.
ప్రపంచ ప్రజలు యావత్తు ఈ విపత్తును ఎదుర్కొంటున్నప్పుడు గతంలో పోలియో మొదలైన వైరస్ కారక వ్యాధుల నిరోధానికి వాక్సిన్ను పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ప్రచారం చేసి ఉచితంగా మందును అందించడం జరిగింది. ఈ కరోనాకు కూడా ప్రజలందరికీ ఉచితంగా మందును అందించి ప్రజలను కాపాడటం కనీస బాధ్యత. ఇందులో రాజకీయాలకు తావుండకూడదు.
అయితే ప్రజలు ఎదురుచూస్తున్నారని, త్వరపడి వాక్సిన్ను మార్కెట్లోకి తెచ్చి ప్రయోగాలు చేయటం కాకుండా అన్ని పరీక్షలు పూర్తిచేసి టీకా శక్తి సామర్థ్యాన్ని నిర్ధారించి తీసుకురావాలి. చాలా కంపెనీలు ఇప్పటికీ మూడో పరీక్షలోనే ఉన్నాయి. మూడో పరీక్షలో తేలిన ఫలితాలను విశ్లేషించాలి. ఆ మందువలన కలిగే పర్యవసానాలను అంటే ఇతర రకాల అనారోగ్యాలను అధ్యయనం చేయాలి. నాణ్యత మొదలైన అంశాలను నిర్ధారించే సంస్థలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు జాగ్రత్తలను పర్యవేక్షించాలి.
టీకా మూడు దశలలో తీసుకున్నా వందశాతం ఫలితాలుంటాయని అనుకోవడానికి లేదని వైద్యరంగ నిపుణులు చెబుతూనే ఉన్నారు. టీకానంతరమూ భౌతిక దూరం, మాస్క్ ధరించడం, చేతులు కడుకోవడం మానవద్దనీ చెబుతున్నారు. ఈ టీకా మందు కూడా తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల వరకు పనిచేయ గలుగుతుందని ప్రకటించారు. కరోనా మనదేశంలోకి వచ్చి ఏడాది కావస్తున్న కారణంగా ప్రజలు జాగ్రత్తలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వమూ ప్రత్యేక ప్రచారం కనిపించడం లేదు. కరోనా సెకండ్ వేవ్, థర్డ్వేవ్ వస్తే తట్టుకోవడానికి, వాటిని నివారించడానికి శ్రద్ధ వహించడం అవసరం. అంతేకాని ఈ పరిష్కారాల ఆలోచనలను వదిలేసి టీకాను కూడా రాజకీయ లబ్ధికి వాడుకోపూనటం అత్యంత విచారకరం. కాబట్టి టీకాల వెనకాల అనే టీకా తాత్సర్యాలున్నాయని గ్రహించి మసులుకోవాలి.