Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దలు చదివితేనే పిల్లలు చదువుతారు. పెద్దలు రాస్తేనే పిల్లలూ రాస్తారు. కానీ చదవడం, రాయడం పెద్దలు మరిచారు. ఇప్పుడు పిల్లలూ పక్కనపెట్టారు. ఒక దశ వచ్చాక పెద్దలు చదవకున్నా, రాయకున్నా ఏమీ కాదేమో గానీ పిల్లలు రాయడం, చదవడం మరిస్తే వారి భవిష్యత్తుకు ప్రమాదం. ఈ ఏడాది మార్చిలో మొదలయిన కరోనా-లాక్డౌన్ కాలం నుంచి పిల్లలు రాయడం పక్కన పెట్టారు. చదవడమూ అంతంత మాత్రం. కోవిడ్-19 విపత్తు సామాజిక, ఆర్థిక రంగాలకు తెచ్చిన ముప్పు గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ తొమ్మిది నెలలుగా చదవడం, రాయడం మరిచిన పిల్లల సంగతి ఏమిటి? ఆన్లైన్ చదువులు పిల్లలకు రాయడం, చదవడం ఎంతవరకు నేర్పుతాయి? గ్రామీణ ప్రాంత పిల్లలే కాదు నగర, పట్టణ ప్రాంతాల పిల్లలు చదువుకీ, రాతకీ దూరమయ్యారు.
రెండు దశాబ్దాలుగా టెక్నాలజీ విస్తరించిన నేపథ్యంలో పుస్తకాలు చదవడం తగ్గింది. అంతేగాక రాయడమూ మందగించింది. జీవనశైలిలో వచ్చిన మార్పులు అంతటా వేగాన్ని పెంచాయి. సులువైన మార్గాల్ని ఎంచుకోడం అలవాటయింది. కనుకనే ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే పిల్లలకు రాతపని తగ్గింది. స్కూల్లో ఇచ్చే 'ఇంటిపని' తప్ప వేరే రాయాల్సిన అవసరమూ, అలవాటూ, అభిరుచీ అంతరించాయి. పాఠ్యపుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు చదవక్కర్లేదనే రీతిన బతుకురీతి పరిణమించింది. అందుకే ఇండ్లల్లో పిల్లల్ని ఆకర్షించే బొమ్మల పుస్తకాలు, బాలల పత్రికలు, కథల సంచికలు లేవు. వాటిని కొని పిల్లల చేత చదివించాలనే సోయి పెద్దలకీ లేదు. ఎందుకంటే వారికే స్వయంగా చదివే అలవాటు లేదు. ఇళ్ళల్లో టీవీ ఉండటమే కాదు, అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. 'పుస్తకం హస్తభూషణం' అంటే ఏమిటని పిల్లలే కాదు పెద్దలే ప్రశ్నించే పాడురోజులు దాపురించాయి.
కరోనా పరిణామాల నేపథ్యంలో బళ్ళు మూతబడ్డాయి. ఈమధ్యన ఆన్లైన్ చదువులు, టీవీపాఠాల గురించి వింటున్నాం. అయినప్పటికీ బడిలో రాసినంత, చదివినంత పని ఇంట్లో పిల్లలు చేస్తున్నారా? ఎంతమంది పిల్లలు రోజూ తెలుగు, ఇంగ్లీషు, హిందీ చూచిరాత కాపీలు రాస్తున్నారు? రోజుకు ఒక పేజీ అయినా రాసేవాళ్ళు అరుదు. కార్పొరేట్ స్కూళ్ళలో చదివిందే చదివి, రాసిందే రాసి అనే ధోరణి పిల్లల మెదళ్ళను మొద్బుబార్చింది. ఈ క్రమాన పాఠ్యపుస్తకాలు గాక వేరే చదువుకోవచ్చని, రాసుకోవచ్చని, బొమ్మలు వేసుకోవచ్చని తెలియకుండానే పిల్లల బాల్యం తెల్లారిపోతుంది. ఇదివరలో పిల్లలకు డైరీ రాయడం నేర్పించేవారు. అలాగే పిల్లల చేత ఉత్తరాలు రాయించేవారు. చిన్నచిన్న పద్యాలు బట్టి పట్టించేవారు. సొంతంగా కొన్ని పదాలు ఇచ్చి కథలు రాయడం అలవాటు చేసేవారు. ఇప్పుడు అవన్నీ అదృశ్యమయ్యాయి. కరోనా కాలంలో ఇంట్లో ఉండే పిల్లలు చదువుకు-రాతకు మరింతగా దూరమయ్యారు.
పిల్లలతో చదివించే, రాయించే తపన గల కొందరు ప్రత్యేక సంచికలు తీసుకొస్తున్నారు. కొత్తగూడెంలోని సఫాయి బస్తీ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఎస్.సుమిత్రాదేవి టీచర్ పదేండ్ల నుంచి పిల్లల రచనలతో ప్రత్యేక సంకలనాలు తీసుకొస్తున్నారు. అలాగే ఈ మధ్యన సిద్ధిపేట జిల్లాకు చెందిన బైతి దుర్గయ్య తీసుకొచ్చిన జక్కప్రోలు బడిపిల్లల కథలు, మధురపద్మాలు కవితా సంకలనం చెప్పుకోదగినవి. జక్కాపూర్ (సిద్ధిపేట జిల్లా) ఉన్నత పాఠశాల పిల్లల సృజనకు వేదికగా నిలిచిన విలక్షణ పుస్తకాలివి. ఈ రీతిగా ప్రతి స్కూల్లో పిల్లల చేత రాయించి పుస్తకాలు తీసుకురావడం అవసరం. దీనివల్ల పిల్లల్లో చదివే అలవాట్లు పెరుగుతాయి. వారి సృజనాత్మకత, ఊహాశాలిత ఇనుమడిస్తాయి. ఇందుకోసం ఉపాధ్యాయుల చొరవ ఎలా ఉండాలో గరిపెల్లి అశోక్ రచించిన 'ఎంకటి కథలు, మా బడి కతలు' చెబుతాయి. గత ఏడాది 'బాలచెలిమి' వెలువరించిన తెలంగాణలోని పది జిల్లాల బడిపిల్లల కథల పుస్తకాలు ఓ మంచి ప్రయత్నం. అయితే వ్యక్తుల, కొన్ని సంస్థల స్థాయిలో జరిగే ఈ ప్రయత్నాలు విద్యావ్యవస్థలో అంతర్భాగం కావాలి. ప్రతి పాఠశాలలో లైబ్రరీ పీరియడ్, స్టోరీ పీరియడ్ ఉండటం తప్పనిసరి. ఇది సర్కారు పాఠశాలలకే పరిమితం కాకూడదు. అన్నిరకాల ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్ళ కరిక్యులంలో భాగమైతే చిన్నతనానే చదవడం, రాయడం అలవడుతుంది.
చదువు, రాత అలవాటు లేని పిల్లల ఆలోచనలు, కలాపాలు ఏవిధంగా పరిణమించాయో కరోనా కాలంలో చూస్తున్నాం. నిష్క్రియాపరత్వం కారణంగా పిల్లల ఊహాశాలిత, ఆలోచనాశక్తి, ప్రయోగపరత్వం మందగిస్తాయి. చదవడం, రాయడమే కాదు వినడమూ తగ్గింది. యూట్యూబ్లో ఎం.హరికిషన్ చెప్పే పిల్లల కథలు, కూకట్ల తిరుపతి చెప్పే వ్యాకరణం పాఠాలు, తెలుగుబోధనాంశాలకు సంబంధించి సుల్తానా టీచర్ అప్లోడ్ చేసే వీడియోలు పిల్లలకు ఎంతో ఉపయుక్తం. వీరు తమంత తాముగా చొరవ తీసుకొని చేస్తున్న పని ఫలవంతం కావాలంటే ఇలాంటి వీడియోలకు ప్రాచుర్యం లభించాలి. పిల్లల కోసం తపించే సృజనశీలురు చేసే ఈ ప్రయత్నాలు టెక్నాలజీ సద్వినియోగానికి తోడ్పడతాయి. పిల్లల్లో ఉత్తమాభిరుచుల్ని ప్రోది చేస్తాయి. వ్యక్తుల చొరవ, సహకారం వ్యవస్థాగతమై పిల్లల్లో చదువు-రాత పెంపొందాలంటే బోధన, బోధనేతర ప్రణాళికల్లో తగిన మార్పులు రావాలి. ఈ మార్పుల రీతి ఎలా ఉండాలో చెప్పగల బాలసాహితీవేత్తలు తెలంగాణలో వందలమంది ఉన్నారు. పదేళ్ళుగా వారు చేస్తున్న కృషి ప్రభావం అమేయమైంది. వారి కృషి సమాజ స్రవంతిలో భాగం కావడం అవసరం. ముఖ్యంగా కరోనా కాలాన పిల్లల కోసం రాసేవారు, పిల్లల చేత రాయించాలని తపించేవారు ఒక వేదిక మీదకు రావాలి. వారి కృషి విద్యాప్రణాళికల్లో భాగం కావడం ద్వారా పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా రూపొందుతుంది. అయితే ఈ దిశగా చొరవ చూపే తీరిక, దృష్టి సర్కారు వారికి ఉందా అన్నదే అసలు ప్రశ్న.