Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పాలకుడెవరో చెప్పండి, ఆ చట్టం ఎలా ఉంటుందో చెప్తా'' అంటాడు సెయింట్ అగస్తిన్. భారత పారిశ్రామిక, వాణిజ్యమండలి (ఫిక్కీ) వార్షిక సదస్సులో ప్రధాని ప్రసంగం వింటుంటే ఈ వ్యాఖ్యలు గుర్తుకు రాకమానవు. ప్రయివేటురంగం ఇంతవరకూ వ్యవసాయంపై దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరమని సెలవిచ్చారు ప్రధాని. ఈ వ్యవసాయచట్టాలు ఎవరి ప్రయోజనాల కోసమో అర్థం చేసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?
''గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారులకు ప్రధానమైన వనరు. అందువల్ల పారిశ్రామిక, వాణిజ్యవేత్తల లాభాలకు అడ్డుగోడలన్నింటినీ తొలగించడానికే ఈ వ్యవసాయ సంస్కరణల''నిఈ సదస్సులో ఒకవైపు కుండబద్దలు కొడుతూనే... మరోవైపు ఈ నూతన చట్టాలు రైతులకు కొత్త మార్కెట్లను, ఆదాయాల రెట్టింపునకు మరిన్ని అవకాశాలను కల్పిస్తాయని నమ్మింపజూసారు..! కానీ రైతులు నమ్మడంలేదు. ''చెరువు గట్టున కొంగ ఒంటికాలిపై తపస్సు చేసేది చేపల్ని తినడానికి కాదు, కాపాడటానికే'' అంటే ఎవరు మాత్రం నమ్ముతారు? నమ్మించి వంచించడంలో ఆయనది అందెవేసిన చెయ్యే కావొచ్చు గానీ, మోసపోవడానికి ప్రజలెప్పుడూ సిద్ధంగా ఉంటారనుకోవడం అవివేకమే అవుతుంది.
ఏటా రెండుకోట్ల ఉద్యోగాలన్నారు. ప్రజలు నమ్మారు. విదేశాల్లోని నల్లధనాన్నంతా వెలికితీసి ప్రతీ పౌరుని ఖాతాలో 15 లక్షలు జమచేస్తామన్నారు. ప్రజలు నమ్మారు. నోట్ల రద్దుతో నల్లధనాన్ని రూపుమాపుతామన్నారు, ఉగ్రవాదాన్ని అరికడతామన్నారు, దొంగనోట్లను నివారిస్తామన్నారు. ప్రజలు నమ్మారు. ఇలా ఒకటా రెండా ఈ ఆరున్నరేండ్లుగా అనేకం చెప్పారు, ప్రజలు నమ్మారు. కానీ ఏం జరిగింది? మిగిలింది వంచనే కదా!? చివరికి ఏలినవారే అదంతా ఒక ''జుమ్లా'' అని కొట్టిపారేశాక ఇక నమ్మకాలకు విలువేముంది. అంతెందుకు జీఎస్టీ పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలనే నమ్మించి వంచించిన వారికి ప్రజలను వంచించడం పెద్ద లెక్కలోనిది కాదు కదా! అందుకే ఇప్పుడు రైతులు నమ్మకాలూ, విశ్వాసాల మీద ఆధారపడి ఉద్యమించడం లేదు. ఇలాంటి అనేక అనుభవాల మీద ఆధారపడి ఉద్యమిస్తున్నారు. ఎముకల కొరకే చలిలో సైతం ఢిల్లీలో వేడి పుట్టిస్తున్నారు. 20 రోజులుగా మొక్కవోని దీక్షతో ఒక్కటిగా నినదిస్తూ తమ సత్యాగ్రహాన్ని ఉధృతం చేస్తున్నారు.
ఈ సందర్భంలో వెలువడుతున్న కొన్ని ప్రశ్నలూ, అభిప్రాయాలూ ఇక్కడ గమనార్హం! ఈ దేశంలో రైతులు అత్యధిక సంఖ్యాకులైన ప్రజలు అన్న మాట నిజమే గానీ, వారు ఓటర్లుగా ఒక సమూహంగా ఉన్నారా? ఉంటే, ప్రభుత్వాలు వ్యవసాయ సంక్షోభాన్ని ఇంతదూరం రానిచ్చేవా? అన్నది కొందరు విమర్శకుల ప్రశ్న. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు రోజు రోజుకూ కుదించుకుపోవడం, రక్షణలు తగ్గిపోవడం, ఇప్పుడు కార్పొరేట్ మార్కెట్ శక్తుల ముందు రైతును నిస్సహాయంగా నిలబెట్టడం - జరుగుతున్నాయంటే రైతులు ఓ ఓటు బ్యాంకుగా లేకపోవడమే కారణమని వారి అభిప్రాయం. వీటిని కాదని తోసిపుచ్చలేము కానీ, ఇవన్నీ ప్రపంచ బ్యాంకు ఆదేశాలు, డబ్ల్యూటీవో ఒప్పందాల్లో భాగమన్నది అసలు సత్యం. అయితే ఇవి కేవలం రైతులు, వ్యవసాయ కార్మికుల మౌలిక ప్రయోజనాలకు మాత్రమే విరుద్ధమైనవి కావు. మొత్తం దేశ ప్రయోజనాలకే విఘాతం కలిగించే చర్యలు.
కానీ ఈ చట్టాల వల్ల వ్యవసాయరంగంలోకి వచ్చే పెట్టుబడులూ, ఆధునిక టెక్నాలజీ రైతులకు ఎంతో ఉపయోగం చేకూరుస్తాయని ప్రధాని అంటున్నారు. అయితే.. సామ్రాజ్యవాద పెట్టుబడులకు వర్థమాన దేశాల మార్కెట్లను అప్పగించి, ఆ దేశాల స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేసి, ధనిక దేశాల ప్రయోజనాలను కాపాడటమే ఈ ప్రపంచ బ్యాంకు, గుత్త పెట్టుబడి వర్గాల టెక్నాలజీ సారాంశమని మరిచిపోరాదు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు కీలక బాధ్యతల్లో పనిచేసిన డేవిసన్ బుధూ, డాక్టర్ జోసెఫ్ స్టిగ్లిజ్లు ప్రపంచానికి ఓ పాఠంగా బోధించి హెచ్చరించిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. వరల్డ్ బ్యాంక్ తనకు వర్థమాన దేశాలలో అమలు జరుపమని చెప్పిన బాధ్యతల మూలంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ''నా చేతులు రక్తసిక్త మయ్యాయి. ఈ చేతుల్ని కడిగి శుభ్రం చేసుకోవడానికి ఏ నదీ జలాలు సరిపోవు'' అని బాహాటంగా ప్రకటించి డేవిసన్ బుధూ తన బ్యాంకు కొలువు చాలించుకున్నాడు. ఇక బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త జోసెఫ్ స్టిగ్లిజ్ పదవికి రాజీనామా చేసి తప్పుకున్నాడు.
ఇలాంటి దుర్మార్గమైన సంస్కరణలకు ప్రతిఘటన అనివార్యమైన వేల... కారు చీకట్లో కాంతిరేఖలా భారత రైతాంగం ప్రపంచానికి కొత్త వెలుగులు అందిస్తోంది. దుక్కి దున్నడం, కలుపు తీయడం తెలిసిన చేతులతోనే ఈ దుర్మార్గమైన సంస్కరణలనూ ఎదిరించే ధృడసంకల్పాన్ని ప్రదర్శిస్తోంది. వారికేమీ ఎదిరించడం కొత్తకాదు. ఏటికి ఎదురీదడం తెలిసినవాళ్ళు. వ్యవసాయం కోసం ప్రాణాన్నే పణంగా పెట్టేవాళ్ళు. చీడల నుంచి పంటను, గద్దల నుంచి కోడిపిల్లను కాపాడటం తెలిసినవాళ్ళు. ఇప్పుడు కార్పొరేట్ రాబందుల నుంచి దేశాన్ని కాపాడేందుకు నాగండ్లెత్తి పోరాడుతున్నారు. ఆ నాగేటి చాళ్ల వెంట నడిచి సంఘీభావం తెలుపడం ఇప్పుడు పౌరసమాజం బాధ్యత. ఎందుకంటే.. ఈ పోరాటం ఎంత విజయవంతమైతే ఈ దేశానికి అంత ప్రయోజనం కాబట్టి.