Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవంబర్ 3న జరిగిన ప్రత్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో బైడెన్ 8కోట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. ఎలెక్టోరల్ కాలేజీలో 306ఓట్లు సాధించి పరోక్ష ఎన్నికలలో కూడా విజయం సాధించడంతో అధ్యక్షుడిగా ప్రకటించబడ్డారు. ప్రత్యక్ష ఎన్నికలలో అవకతవకలు జరిగాయన్న నెపంతో ట్రంప్ ఎదురుతిరిగి ఫలితాలను ఒప్పుకోనని, కోర్టుకు వెళ్ళడం అక్కడ కూడా ఓటమి పాలవడం తెల్సిందే. తనే అధ్యక్షుడుగా నిర్వహించబడిన ఎన్నికలలో అవకతవకలు జరిగాయనీ, తన విజయాన్ని దొంగిలించారనీ అభాండాలు వేయడం విడ్డూరమేమరి!
తెల్ల నల్ల జాతీయుల మధ్య చీలిపోయిన అమెరికాకు ట్రంప్ మరింత ఆజ్యం పోశాడు. ఉహాకు అందని అధ్యక్షుడి చర్యలతో అమెరికాలో అనిశ్చితి నెలకొన్నది. ప్రజలు ట్రంప్ పోవాలని కోరుకున్నారు. నల్లజాతీయులు, కార్మికులు బాగా స్పందించి ఓట్లు వేయడంతో అత్యధిక ఓట్లు పోలైన ఎన్నికలుగా గుర్తింపుపొందాయి. ఈ నేపథ్యంలో గెలిచిన బైడెన్ ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. ఆయన పాలన ఎలా ఉండబోతున్నదో ఇప్పటికే ఆయన తొలి అడుగులను చూస్తే కొంత అర్థం అవుతున్నది.
జనవరి 20న బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ లోపు ఆయన మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఆయన ప్రభుత్వంలో కీలక పదవులలో ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు అనే దాన్ని బట్టే ఆయన ప్రాధాన్యతలు అర్థమవుతున్నాయి. సైన్యంలో మాజీ యుద్ధ కమాండర్లు, యుద్ధ సామాగ్రి తయారు చేసే పరిశ్రమల ప్రతినిధులు, ఆయిల్ పరిశ్రమలోని ప్రముఖులకు పెద్దపీఠ వేస్తున్నారు. దానిని బట్టి ట్రంప్ ప్రభుత్వ విధానాలే కొనసాగుతాయి తప్ప పెద్దమార్పులు ఏవీ జరగవని అర్థం అవుతున్నది. రిపబ్లికన్స్, డెమాక్రాట్స్ ఇద్దరూ రెండు దెయ్యాల లాంటివారనీ. ఒక్కటి పెద్ద దెయ్యం, రెండోది చిన్నదెయ్యం అనీ.. పెద్దదాని కంటే చిన్నది (డెమోక్రాటిక్ దెయ్యం) మంచిదని భావించాల్సి ఉంటుంది.
రక్షణ కార్యదర్శిగా లాయడ్ ఆస్టిన్ని బైడెన్ ఎంపిక చేశారు. ఆయన ఆఫ్రికన్ అమెరికన్. ఆయన ఇరాక్పై యుద్ధంలో కీలక సైనిక అధికారి. ఇరాక్లోకి అమెరికా సైన్యాన్ని ఆయనే నడిపించారు. ఒబామా ప్రభుత్వం ఇరాక్ నుంచి 50,000మంది సైన్యాన్ని వెనక్కి రప్పించడాన్ని వ్యతిరేకించి తన యుద్ధ పిపాసను చాటుకున్నారు. అక్కడితో ఆగకుండా మరింత మంది సైన్యాన్ని ఇరాక్కు రప్పించుకున్నారు. తరువాత ఆయన ఇరాక్లోని కేంద్ర కమాండ్ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేశారు. దాని తరువాత మిలటరీ పారిశ్రామిక సముదాయం (రేతియెన్ టెక్నాలజీ)లో డైరెక్టర్ బోర్డులో పనిచేశారు. కాబట్టి ఆయనను ఎంపిక చేయడం అంటే ఇప్పుడు ఉన్న యుద్ధ కార్యక్రమాలు కొనసాగుతాయని సంకేతమివ్వడమే.
రెండవ ప్రాధాన్యం ఆంతోని బ్లిన్కెన్. బైడెన్ ఇరాక్ యుద్ధాన్ని బలపర్చడంలో ఈ బ్లిన్కెన్ కీలక పాత్ర వహించారు. క్లింటన్, ఒబామా ప్రభుత్వాల విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఇరాక్లో జాతుల మధ్య చిచ్చుపెట్టడం, ఏకపక్ష నిర్ణయాలు చేసి యుద్ధాన్ని మరింత హింసాయుతంగా మార్చడంలో బ్లిన్కెన్ పాత్ర ముఖ్యమైనది. లిబియా, సిరియాలలో ఉగ్రవాద సంస్థలకు ఆయుధాల సరఫరాలో కీలక భూమిక పోషించారు. ఈ రెండు ప్రాధాన్య ఎంపికలూ ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యవాద యుద్ధాన్ని కొనసాగించాలనే విధానాన్నే సూచిస్తున్నాయి. అమెరికాలో ఆర్థికశాఖ బాధ్యురాలిగా నీరా ట్యాన్డన్ను నియమిస్తున్నారు. ఆమె డెమాక్రాటిక్ పార్టీలో సాండర్స్ ప్రతిపాదించిన వామపక్ష విధానాలను గట్టిగా వ్యతిరేకించే వ్యక్తి. కరోనా మహమ్మారి కాలంలో ఆమె ప్రజా అనుకూల విధానాలు తేకపోవచ్చు. కానీ ఆమె సార్వత్రిక వైద్య సేవలకు వ్యతిరేకం, గంటకు 15 డాలర్ల కనీస వేతనానికి కూడా ఆమె వ్యతిరేకం.
ఎన్నికల నిధుల సమీకరణకు కార్పొరేట్ సంస్థలతో బైడెన్ సమావేశం అయినప్పుడు, మౌలికమైన విధానాల్లో ఏమీ మార్పులు ఉండవని హామీ ఇచ్చారు. సాండర్స్ ముందుకు తెచ్చిన ప్రగతిశీల అంశాలకు తాను దూరంగా ఉన్నట్టు ఆయన చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ఎన్నికల నిధులు ఆయన స్వీకరించారు. అనేక మంది నివారించినా ఆయన అంగీకరించలేదు. అందరికీ ఆరోగ్యసేవలు అందించే విధానాన్ని తాను వీటో చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రభుత్వరంగంలోనే ఇన్సూరెన్స్ ఉండాలని 71శాతం మంది కోరుతున్నా ఆయన దానిని అంగీకరించడం లేదు. ఇవి బైడెన్ ఎంత కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిపాదిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
1912లో అమెరికా ఎన్నికల గురించి లెనిన్ చెపుతూ.. రెండు పార్టీల మధ్య ఎవరు పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి కావడానికి వేగంగా కృషి చేస్తారనే దానిలోనే పోటీ జరుగుతుందని స్పష్టంగా చెప్పారు. పెట్టుబడిదారీ విధానాన్ని బూర్జువా సంస్కరణలతో కాపాడేందుకు కృషి జరుగుతున్నది. రెండు పార్టీలలో ఏదీ ప్రజల దైనందిన సమస్యల పరిష్కారం కోసం పాటుపడదు. ఉపాధి, ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు, వైద్యం, అసమానతల తొలగింపుకు, వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పనిచేయడం లేదు. తీవ్రమైన నయా ఉదారవాద విధానాలతో, సైనిక ఆధిపత్యాన్ని పరిష్టపరిచే విధంగా అడుగులు వేస్తున్నారు. కానీ, ఇందుకు భిన్నంగా బైడెన్ మనం సాధారణస్థితికి తిరిగి వచ్చాం అంటున్నారు. ఏ సమస్యను పరిష్కరించకుండా ఎలా సాధారణ స్థితి వస్తుంది అనేదే ప్రశ్న.