Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దేశంలో చర్చకు, అసమ్మతికి చోటేది?'' అంటున్నారు ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్. ప్రపంచ సూచికలన్నీ భారత్లో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో ఉన్నదని వెల్లడిస్తున్న నేపథ్యానికి తోడు, దేశంలో చోటుచేసు కుంటున్న పరిణామాలన్నీ అమర్త్యసేన్ వ్యాఖ్యలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలియ జేస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చింది మొదలు తన ఏకరూప భావజాల విస్తృతికి ప్రజాస్వామ్యాన్ని ఫణంగా పెడుతున్న సంఘటలనేకం దేశం చూస్తూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దు మొదలు ప్రభుత్వాల కూల్చివేత వరకు, నిన్నటి పౌరచట్టాల నుంచి నేటి వ్యవసాయ చట్టాల వరకు ఎటు చూసినా అడుగడుగునా ప్రజాస్వామ్య హననమే దర్శనమిస్తోంది. రాష్ట్రాల సముదాయ మైన మన సమాఖ్య వ్యవస్థలో వ్యవసాయ రంగంపై అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండగా.. వాటిని హైజాక్ చేసి, లేని అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని చట్టాలు చేసింది మోడీ ప్రభుత్వం. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే కాదు, ప్రజాస్వామ్యానికే సవాలు. అందుకే ఇటు రైతులతోను, అటు పార్లమెంటులోను చర్చించకుండా రాష్ట్రాల హక్కులను హరిస్తూ అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను పునఃసమీక్షించాలంటున్నారు అమర్త్యసేన్. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు సర్వసాధారణ మైపోవడం పట్ల కూడా ఆయన ఆవేదన, ఆందోళన వర్తమానానికి అద్దం పడుతున్నాయి.
కాశ్మీరీల స్వయం ప్రతిపత్తికి రక్షణనిచ్చే ఆర్టికల్ 370, 35ఏ లను రద్దు చేయడంలోనూ.. సీఏఏ, ఎన్ఆర్సీలకు రూపకల్పన చేయడంలోనూ కనిపించేది రాజ్యాంగ ఉల్లంఘనే. జమ్మూ కాశ్మీర్లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసి ప్రజల హృదయాలను రెండు ముక్కలు చేశారు. మాజీ ముఖ్యమంత్రులతో సహా ప్రతిపక్ష నేతలందరినీ జైళ్ళలో పడేశారు. ప్రశ్నించే ప్రతివ్యక్తినీ నిర్బంధిస్తూ పౌరస్వేచ్ఛను కాలరాసారు. ఇంటర్నెట్తో సహా సమాచార వ్యవస్థలన్నిటినీ రద్దు చేసారు. మిలటరీ జోక్యంతో కాశ్మీరునే ఒక బహిరంగ చెరసాలగా మార్చారు. పౌరచట్టాలపై పెల్లుబుకిన నిరసనలపై కూడా అదే తీరున ఉక్కుపాదం మోపారు. నిరసనలో విద్యార్థుల సమరశీలతను భరించలేక విశ్వవిద్యాలయాలపై విరుచుకుపడ్డారు. షహీన్బాగ్కు సమాధానం చెప్పలేక దక్షిణ ఢిల్లీని దగ్ధం చేశారు. మత కలహాలతో మరణహౌమం సృష్టించారు. ఇవేవీ యాధృచ్ఛికమైన సంఘటనలు కావు. ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ చెప్పినట్టు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న చట్టాలు హిందూత్వ ఉద్యమానికున్న దీర్ఘకాలిక పథకానికి వ్యక్తీకరణలు మాత్రమే. ఈ క్రమంలో ప్రజాస్వామ్య విరుద్ధంగా అసమ్మతినీ, నిరసననూ అణచివేయడమే లక్ష్యంగా రూపొందుతున్న విధానాలు మాత్రమే.
ఒకవైపు జాతీయవాదం, మతోన్మాదం రెండు ఆయుధాలుగా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతూ, మరోవైపు మితిమీరిన ఆధికార కేంద్రీకరణకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని చెరబడుతున్నారు. ఇప్పటికే ఉనికిలో ఉన్న ఎన్ఐఏ, ఊపా వంటి పాశవిక చట్టాలను మరింత కఠినతరం చేశారు. తమకు కావాల్సినరీతిలో సవరణలు చేసుకుని అసమ్మతికి, విమర్శకు అవకాశమేలేకుండా ప్రశ్నించే వారందరినీ తీవ్రవాదులుగా పరిగణించే అధికారాన్ని సక్రమింపజేసుకున్నారు. ఫలితంగా పౌరహక్కులు ఎన్నడూ లేనంత ప్రమాదాన్నెదుర్కొంటున్నాయి. ప్రజల పట్ల నిబద్ధతను ప్రదర్శించినంతనే ప్రభుత్వాలను ప్రశ్నించినంతనే బీమా కొరెగావ్ కేసులో నేరస్థులుగా కారాగారాల్లో మగ్గుతున్న మేథావులే ఇందుకు సజీవ సాక్ష్యాలు. మానవ హక్కుల మనుగడే ప్రశ్నార్థకమైనప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది? ''ప్రభుత్వానికి ఎవరువ్యతిరేకంగా మాట్లాడినా వారిని ప్రభుత్వమే దేశద్రోహిగా ప్రకటిం చడంతో పాటు, శిక్షలూ వేస్తోంది. ప్రజలకు నిరసన తెలిపే అవకాశాలు, స్వేచ్ఛగా నిర్వహించుకునే చర్చావేదికలకు దారులు మూసుకు పోతున్నాయి'' అంటున్న అమర్త్యసేన్ వేదనలోని సారమిదే.
ఒక మనిషి తన హక్కులనూ, బాధ్యతలనూ గుర్తించి ప్రకటిస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్నా ఏ స్పందనలూ లేని సందర్భాలు దేనికి సూచికలు...? ఒక మనిషి అలవాటుగానో, ఆచారంగానో ఏదో తిన్నాడని ఇంటిమీద పడి నెత్తుటి మడుగులో ముంచినా నోరు మెదపని సందర్భాలు దేనికి సంకేతాలు..? ఏదో ఉదాసీనత ఇవాళ సమాజాన్ని కుమ్ముకుంటుంది. నాకెందుకులే అని భయపడిపోయే తత్వం అలుముకుంటోంది. ఇది మరీ ప్రమాదకరం. దుర్మార్గం కన్సాలిడేట్ కావడానికి, అదే జీవితమై నిలిచిపోవడానికి దోహదం చేసే ప్రమాదకర స్వభావం ఇది. ఇటువంటి సంక్షుభిత సమయంలో కారుచీకట్లో కాంతిరేఖల్లా దూసుకొచ్చారు రైతులు. దేశానికి దారి చూపుతున్నారు. గత నెల రోజులుగా గడ్డకట్టే చలిలోనూ వేడి పుట్టిస్తున్నారు. అసమ్మతికీ, నిరసనకూ కొత్త శక్తిని అందిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదుతున్నారు. అందుకే వారి ఉద్యమం సమర్థనీయం మాత్రమే కాదు, దేశం అనుసరిం చాల్సిన ఉద్యమం అంటున్నారు అమర్త్యసేన్. ఎందుకంటే ఇది కేవలం వ్యవసాయాన్నే కాదు, మన ప్రజాస్వామ్యాన్నీ కాపాడే ఉద్యమం గనుక...