Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంపై అమెరికాకు ఇంత శ్రద్ధ ఎందుకు? ఆదేశ అధికారులు కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో పర్యటనలు ఎందుకు చేస్తున్నారు? భారతదేశం మీద, ఈ ప్రాంతం మీద అమెరికాకు ఎందుకు ఇంత ప్రేమ? అందుకు అమెరికా రూపొందించిన కొన్ని డాక్యుమెంట్లు పరిశీలిస్తే అందులో 2017లో రూపొందించిన జాతీయ భద్రతా వ్యూహం, 2020లో చైనా పట్ల అమెరికా వ్యూహం అనే డాక్యుమెంటు అగ్రస్థానంలో ఉంటాయి. వీటికి తల్లిలాంటిది 1992లో రూపొందించిన ''రక్షణ ప్రణాళిక మార్గదర్శకాలు'' అనే వ్యూహపత్రం. 1991లో రష్యాలో సోషలిస్టు ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి వరకు అమెరికాకు ధీటుగా ఉన్న సోషలిస్టు రష్యా కూలిపోవడంతో బహుళ దృవ ప్రపంచం స్థానే ఏకదృవ ప్రపంచం వైపు అమెరికా ప్రయత్నాలు సాగాయి. ఈ పత్రంలో సోవియట్ యూనియన్ కూలిపోవడంతో ఏర్పడిననూతన పరిస్థితిలో ప్రపంచంలో కమ్యూనిజం యొక్క భావాజాలం, పరపతి సన్నగిల్లుతుందని ఈ నేపథ్యంలో అమెరికా ఎటువంటి పాత్ర పోషించాలని ఆపత్రం వ్యూహరచన చేసింది. అందులో ఇక ముందు అప్పటి వరకు సోవియట్ ఇచ్చిన గట్టి పోటీ ఏ దేశం ఇవ్వకుండా చూసుకోవడం, దానితో పాటు ఏ ప్రాంతీయ కూటమీ ఒక ప్రపంచ శక్తిగా ఎదగకుండా జాగ్రత్త పడటం అనే రెండు లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంది. ఈ లక్ష్యాల సాధనకోసమే అమెరికా ప్రపంచం మీద పెత్తనం చెలాయించేందుకు పూనుకుంటున్నది.
ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు అమెరికా నాయకుడిగా వ్యవహరిస్తున్నది. ఏదేశం అయినా అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే దానిపైకి విరుచుకుపడటం, ఆ దేశాల అంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం, అధికార మార్పిడికి పూనుకోవడం, దానికి తన ఆర్థిక సైనిక శక్తిని చూపుతూ ఒక ఆధిపత్య శక్తిగా వ్యవహరిస్తున్నది. దీనికి గట్టిపోటీ లాటిన్ అమెరికాలో ప్రగతిశీల, వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడటంతో మొదలై చైనా సోషలిస్టు ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఒక ప్రపంచ శక్తిగా ఏర్పడటంతో అమెరికాకు అది ఒక సవాలుగా మారింది. ఈ రెండు పరిణామాలతో ప్రపంచ పరిస్థితి ఏకధృవ ప్రపంచం నుంచి బహుళ ధృవ ప్రపంచం వైపు మళ్ళింది. ఈ కొత్త పరిస్థితిని అమెరికా సామ్రాజ్యవాదం తట్టుకోలేక ఆగ్రహానికి గురవుతున్నది.
లాటిన్ అమెరికా దేశాలలో ప్రగతిశీల, వామపక్ష ప్రభుత్వాలున్న బొలీవియా, వెనెజులా లాంటి దేశాలలో సైనిక కుట్రతో ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేసి అమెరికా భంగపాటుకు గురి అయింది. వీటన్నింటికంటే అమెరికా చైనాను పెద్ద సవాలుగా నిర్ధారించుకుంది. ఎందుకంటే చైనా కేవలం ఒక ఆర్థిక శక్తిగా మాత్రమే పోటీదారు కాదు, అదిఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతం.. అంటే కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రతినిధిగా ఉన్నది. అందుకే అమెరికా రక్షణ మంత్రి పాంపియో పదేపదే చైనాను కమ్యూనిస్టు పార్టీ పరిపాలిస్తున్నదని ఎత్తిచూపుతుంటారు. ఎందుకంటే చైనా కమ్యూనిస్టుపార్టీ ఆ దేశాన్ని సోషలిస్టు ఆర్థిక పంథాలో నిర్మిస్తున్నందుకు అది పెట్టుబడిదారీ పంథాకు వ్యతిరేకమని ఎత్తిచూపుతుంటారు. అందుకని దాన్ని కొనసాగనివ్వకూడదని ప్రకటిస్తుంటారు. దీనికి ఒక కారణం ఏమిటంటే రష్యా పతనంతో సోషలిజం, కమ్యూనిజం సిద్ధాంతాలు ప్రపంచంలో అంతమైపోయినట్లు ప్రకటించిన అమెరికాకు చైనా సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ సోషలిజం పతనం కాలేదని నిరూపించి తన విశిష్టతను చాటుకుంటున్నది.
అమెరికా చైనాతో వాణిజ్యం నడిపింది. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టింది. కాలక్రమంలో చైనా ప్రభుత్వ ఆలోచనలో మార్పు వస్తుందని ఆశించింది. అది జరగకపోగా, ప్రపంచీకరణలో భాగమైన నయా ఉదారవాద ఆర్థిక విధానాన్ని చైనా తన షరతులలో స్వీకరించింది. చైనాను అంతర్గతంగా దెబ్బకొట్టాలనే పథకం విఫలమైంది. దానితో అమెరికా చైనాలో అంతర్గతంగా కల్లోలం సృష్టించడానికి టిబెట్, హంగ్కాంగ్లో నిరసనలను ప్రేరేపిస్తున్నది. హంగ్కాంగ్ నిరసన కారులను అమెరికాకు పిలిపించుకుని తమ పూర్తి మద్దతును ప్రకటించింది.
చైనాపై అమెరికా టారిఫ్లు విధించింది. వాణిజ్యంలో అనేక ఆటంకాలను సృష్టించింది. దక్షిణ చైనా సముద్రం విషయంలో వివాదం పుట్టించింది. అయినా చైనా రెచ్చిపోకుండా తన ఆర్థికశక్తిని దీక్షతో పెంచుకుంటున్నది. అమెరికా చైనా మధ్య వాణిజ్యంలో చైనాదే పైచేయిగా ఉన్నది. దీనితో అమెరికా తను ఒక్కటే చైనాను ఢకొీనడం కష్టమని గ్రహించి చైనా చుట్టూ సైనిక కూటములను ఏర్పాటు చేసుకుంటున్నది. అందులో కీలకమైన క్వాడ్ కూటమిలో భారత్ అంతర్భాగమైంది.
అమెరికా సామ్రాజ్యవాదుల లక్ష్యం చైనాను కట్టడిచేయడం మాత్రమే కాదు, చైనాను ఖతం చేయ్యాలనేదే దాని లక్ష్యం. ఒకమాటలో చెప్పాలంటే సోషలిజం, కమ్యూనిజంను అంతం చేయాలనీ, మళ్లీ ఏకదృవ ప్రపంచం ఏర్పాటుచేసి తన సామ్రాజ్యాన్ని నెలకొల్పాలనీ చూస్తున్నది. ప్రపంచంలో ప్రగతిశీల శక్తులు, వామపక్షాలు ఈ ప్రయత్నాన్ని ఓడించాలి. ఆనాడైనా, నేడైనా కమ్యూనిజాన్ని అంతం చేయాలనేది అమెరికన్ పాలకవర్గం లక్ష్యం. అమెరికన్ పాలకుల చేతిలో పావుగా మారేందుకు భారత ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. ఇదొక ప్రమాదకర సంకేతం.