Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''యదహ్నాత్ కురుతే పాపం..
తదహ్నాత్ ప్రతిముత్యతే'' అనే మంత్రంతో పాటు ''సంధ్యా వందనం చేస్తే ఏ రోజు చేసిన పాపాలు ఆ రోజే పోతాయష'' అంటూ దాని అర్థం కూడా చెప్తాడు అగ్నిహోత్రావధాన్లు కన్యాశుల్కంలో! వీడి పిలక వాడికి, వాడి పిలక వీడికి ముడేసి డబ్బులు గుంజి బతుకెళ్లదీసే రామప్పపంతులు ''అవునవును, నేనూ రోజూ సంధ్యావందనం చేద్దామనే అనుకుంటున్నా'' నంటాడు. ఇది గురజాడ అప్పారావు గారు వేసిన గూగ్లీల్లో ముఖ్యమైనది. అంటే రోజూ పాపాలు చేస్తూ సంధ్యావందనం చేసి కడిగేసుకోవచ్చ నేది రామప్పపంతులు ఆలోచన!
తప్పులు చేసిన వారు బీజేపీలో చేరితే గంగలో మునిగినంత పుణ్యమొస్తుందనీ, వారు స్వచ్ఛంగా, పరిశుద్ధులై బయటికొస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులవారు చెప్పడం చూస్తే పై సంభాషణ గుర్తుకురాకమానదు. మళ్లీ 'కన్యాశుల్కం' రోజులొచ్చినాయేమో! 19వ శతాబ్దం చివరికి (1892), 21వ శతాబ్దం రెండవ దశకానికి 'తప్పు', 'పాపం' అనే మాటలకు మస్తు తేడా ఉందని మనకు తెల్సు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ నాయకులెవరైనా, ఆ మాటకొస్తే ఏ పార్టీ నాయకుడైనా, నాయకురాలైనా ఎన్ని తప్పులు చేసినవారైనా బీజేపీలో చేరితే అవన్నీ మాఫీ చేస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. తప్పొప్పులు ఫైనలైజ్ చేసే చిత్రగుప్తుడు తమ కొత్వాలేనని అన్యాపదేశంగా హింట్ కూడా ఇచ్చారు బీజేపీ పెద్దలు. నమ్మకంలేకుంటే బంగ అధినేత్రిని అడగండి. కాషాయం ధరించిన తర్వాత 'శారదాస్కాం'లో నుంచి ముకుల్రారుని ఎలా బయటికి లాగామో, ఏవిధంగా కాచుకున్నామో చూసుకోండన్నంత ధైర్యం కనపడటం లేదా ఆ ప్రకటన వెనక. వివిధ 'స్కాంస్టర్ల'ను పార్టీలో కలిపేసుకుని పునీతం చేయడమే తమ పార్టీ ''పంత''మని కమలనాథులు బల్లగుద్దిమరీ వాదిస్తున్నారు.
శంకర్దాదా ఎంబీబీఎస్లను సృష్టించిన 'వ్యాపం' స్కాంలో సుప్రీంకోర్టు 634 మంది డిగ్రీలైతే రద్దుచేసింది కానీ, దాని సృష్టికర్తలైన బీజేపీ నాయకులపై ఏ చర్యలూ లేవు కదా! కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి శివరాజ్సింగ్ చౌహాన్ను 2020 మార్చి 23న మళ్ళీ మధ్యప్రదేశ్లో పట్టాభిషిక్తుణ్ణి చేయడం కోసమే దేశంలో మార్చి 24 వరకు లాక్డౌన్ ప్రకటించలేదు మోడీ!
కాంగ్రెస్ పాలన అవినీతి గబ్బుకొడుతున్న నేపథ్యంలో 2014లో మోడీ సింహాసనాధీశుడైనాడు. 'న ఖావూంగా', 'న ఖానేదూంగా' అనేది మోడీగారి నినాదం ఆనాడు. ప్రజలు దాన్ని నమ్మారు. తాను దేశానికే 'చౌకీదార్'ని అన్నాడు. ప్రజలు దాన్నీ నమ్మారు. ఈ ఆరేండ్లలో జరిగిన స్కాంలన్నీ బీజేపీ నేతల చుట్టూ జరిగినవే. అంబానీ / అదానీల్లాంటివారికి ప్రయోజనం చేకూర్చినవే. వారు సుద్ధపూసలూ కారు, వీరు పరిశుద్ధాత్మలూ కారు! ''ఒక వ్యక్తి గుణగణాలపై నీకు స్పష్టతలేకపోతే అతని మిత్రులవైపు చూడు'' అన్న జపాన్వారి సూక్తి గీటురాయిగా పరిశీలిస్తే... 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తప్ప కనీసం 'లోక్పాల్'ని నియమించేందుకు మోడీగారి బీజేపీకి మనసొప్పలేదు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న తరుణంలో ఆ రాష్ట్రంలో 'లోకాయుక్త'ను ఎందుకు నియమించలేదని హత్యకు గురైన ఓ ఆర్టీఐ కార్యకర్త తండ్రి హైకోర్టులో పిల్ వేసినా అప్పటి రాష్ట్రంలోని మోడీ ప్రభుత్వం స్పందించకుంటే.. కేంద్ర (యూపీఏ) ప్రభుత్వం నియమించింది. నన్నడగకుండా.. నాతో సంప్రదించ కుండా లోకాయుక్త నియామకానికి కేంద్ర ప్రభుత్వానికేమి హక్కుందని ఆనాడు కోర్టులో దావా వేసిన పెద్దమనిషి నేటి భారత ప్రధాని.
జాతీయ భద్రతా సలహాదారుగా మోడీ ఏరికోరి నియమించుకున్న అజిత్ దోవల్ పుత్రరత్నం కేమెన్ ఐల్యాండ్లో హెడ్జ్ఫండ్ నిర్వహిస్తున్నాడని తెల్సినా చర్యలెందుకులేవో, నోట్లరద్దు ప్రకటించిన నాలుగు రోజుల్లో దేశంలో ఏ సహకార బ్యాంకులోకి రానన్ని నోట్ల కట్టలు అమిత్షా డైరెక్టర్గా వున్న బ్యాంకులోకి దేవుడి హుండీలోకొచ్చినట్టు ఎందుకొచ్చాయో పరిశీలిస్తే - మా ''గంగ'లో మునగండి.. మీ పాపాలన్నీ పుణ్యాలుగా మారుస్తామనే'' బీజేపీ నేతల అసలు స్వభావం అర్థమౌతుంది.
మన దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులను ముంచి మహరాజుల్లా విదేశాలకెళ్లి అక్కడ సర్వభోగాలు అనుభవిస్తున్న విజరుమాల్యాలు, నీరవ్మోడీలు, మెహుల్ చోక్సీలతో బీజేపీ నేతల సంబంధబాంధవ్యాలు చూస్తే కన్యాశుల్కం - రామప్పపంతులు గుర్తుకురాకమానరు.