Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భూతం వైద్యోగీతం,
వైద్యం భూతో ద్విగం
మంత్ర తంత్ర యోగం
సర్వం మానసిక రోగం' చీకటి యుగాల్లోకి, అంధ విశ్వాసాల్లోకి పోదాం పోదాం వెనక్కి వెనక్కి, దయ్యాల భూతాల స్థావరాల్లోకి పదండి పదండి.. ఇదీ నేటి మన విద్యాగమన తీరు. వైద్య విద్యలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో భూతవైద్యంపై సర్టిఫికెట్ కోర్సు(పారా నార్మల్)ను ప్రవేశపెట్టి భావి వైద్యులను ఆహ్వానించారు. ఇక వాళ్ళు ఆ సర్టిఫికెట్ చేతపట్టుకుని గ్రామాల్లోకి, పట్టణా ల్లోకి వచ్చి ఎముకలు, నిమ్మకాయలు, రక్తచందనాలు, కత్తులు కటార్లతో ధూపదీపాలతో ప్రజలకు పట్టిన రోగాలను తరిమికొట్టబోతున్నారు.
మన విద్యారంగం ఇప్పటికే పరిశోధనారంగంలో వెనుకబడి, నూతన వైజ్ఞానిక సవాళ్ళును ఎదుర్కోలేని అవస్థలో ఉండగా, ఇప్పుడీ కాషాయకరణతో మరింత తిరోగమనం ఆరంభమైంది. కొత్తగా ఎదురయ్యే సవాళ్ళను గత కాలపు విశ్వాసాలలోకి, నమ్మకాలలోకి వెళ్ళి పరిష్కరించుకోవాలనే ఆలోచనలు 21వ శతాబ్దంలో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. భారతదేశం విజ్ఞానరంగంలో ఎంతో ముందుకు పోవాల్సి ఉండగా, భావి భారతాన్ని నిర్మించే విద్యా వ్యవస్థలోకి జ్యోతిష్యం, మంత్ర తంత్ర అభ్యసనాలను ప్రవేశపెట్టడం, తిరోగమన ఆలోచనలతో చీకటి యుగాల్లోకి దేశాన్ని నెట్టడం అత్యంత విచారించాల్సిన అంశం.
మన రాజ్యాంగం ఈ దేశపౌరుని ప్రాథమిక బాధ్యతలను స్పష్టంగానే వివరించింది. ఆర్టికల్ 51-ఏ(హెచ్) ప్రకారం ప్రతి భారతీయ పౌరుడు శాస్త్రీయ భావాల అభివృద్ధికి మానవీయమైన హేతుబద్ధమైన చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పేర్కొంది. ఇంత వివరమైన రాజ్యాంగపు ఆదేశాన్ని కూడా లెక్కచేయకుండా, ఆ రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చి పరిపాలన చేస్తున్న ప్రభుత్వం పారాసైకాలజీ పేరుతో భూతవైద్యాన్ని అధికారికంగా ప్రోత్సహించడం ఎంతటి దారుణమైన విషయం. ఇది పూర్తిగా రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి విరుద్ధమైన విషయం. ఆధునిక భారత ప్రయాణం ఎటుపోతున్నది? భావితరాలకు మనం అందించే వారసత్వం ఇంత అజ్ఞానదాయకమైనదా? ఈ దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, తిరోగమన ఆర్థిక వృద్ధి, పేదరికం, ఆకలి, అనారోగ్యం, కనీస మానవ హక్కులలేమి మొదలైన విషయాలపైన ఏ చర్యా లేకుండా గుళ్ళు గోపురాల మీద, దేవుళ్ళు దయ్యాల మీద, మతాలు కులాల మీద చర్చ పెరిగింది. అంటే ప్రజల వాస్తవిక సమస్యలను పరిష్కరించే సత్తాలేని ప్రభుత్వాలు ప్రజల ఉద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాయి అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు.
తంత్ర విద్య, మంత్రాలు, భూతం, దెయ్యం సైతాన్ ఇవన్నీ క్రీస్తుపూర్వపు సమాజంలోని నమ్మకాలు. విజ్ఞానశాస్త్రం, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాలు అభివృద్ధి చెందని కాలాలలోని ఈ నమ్మకాలను నేడు తోడితీసి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆధ్యాత్మికత, దేవుడిపైన నమ్మకం పూర్తిగా వ్యక్తిగతమైనవి. దాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. అదే సందర్భంలో ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాపాలన మతానికి అతీతంగా కొనసాగించాలి. ప్రపంచంలో రాజ్యానికి మన రాజ్యాంగం ఒక మచ్చుతునక. ఇలాంటి ఆధునిక ప్రజాస్వామిక యుగంలో మతాన్ని రాజకీయాలతో కలిపి మనుషుల్ని విభజించడం, మనసుల్లో మూఢత్వాన్ని నింపడం అత్యంత దారుణమైన విషయం. కాగా, భూతవైద్యులను అధికారికంగానే తయారుచేసే విధంగా మన విద్యా వ్యవస్థను దిగజార్చడం మరీ బాధాకరం.
భూత వైద్యులను ఇప్పటికీ గ్రామాలలో అక్కడకక్కడ చూస్తుంటాం. మానసిక స్థితి బాగోలేనప్పుడు, సమస్యలు ముంచెత్తి ఆందోళన చెందుతూ భయానికి లోనయినప్పుడు, పరిష్కారాలు చేయలేని స్థితిలో భూతవైద్యుల దగ్గరికి పోతారు. అంటే వాస్తవ పరిష్కారాలు సాధ్యంకాని వేళ మంత్రానికో, తంత్రానికో సాంత్వన చేకూరుతుందనే మానసిక సంతృప్తిని పొందుతారు. దీన్ని ఆసరా చేసుకుని అనేక నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి పేదలు, శ్రామికులు బలవుతూనే ఉన్నారు.
ప్రభుత్వాలు కూడా తమ బాధ్యతలలోంచి వైదొలుగుతూ ప్రజలకు పూర్తి ఆరోగ్యాన్ని, దానికి కావలసిన సౌకర్యాలను కల్పించలేని స్థితిలో, అనారోగ్యానికి వైద్యం అందించలేని దౌర్భాగ్యంలోంచి ఈ మానసిక సంతృప్తి చిట్కాలను ప్రయోగిస్తున్నారు. అంతేకాదు, మూఢ విశ్వాసాలలో ప్రజలు మగ్గుతూ ఉంటే, మతం మత్తులో ఊగిపోతూ ఉంటే వారు దోపిడీ శక్తులకు యధేచ్ఛగా సేవ చేయొచ్చనేది ఇందులోని సారాంశం. అసలు భూతం దోపిడీ. అసలు దయ్యం దోచుకునే వర్గం. దీని ఫలితాలే సామాన్య ప్రజల భౌతిక, మానసిక దుర్భలత్వం.
అశేష ప్రజానీకం అనేక అనారోగ్యాలతో బాధలు పడుతూ ప్రాణాలు సైతం కోల్పోతున్న సందర్భంలో ప్రభుత్వం అందరికీ కావల్సిన వైద్యాన్ని, ఔషధాలను అందించే ప్రయత్నం చేయకుండా ఇలాంటి ఆలోచనలు చేయడం అశాస్త్రీయం. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్లేక అనేక మంది పిల్లలు చనిపోయిన సంఘటన ప్రభుత్వ ఆచరణలోని డొల్లతనాన్ని, నిర్లక్ష్యాన్ని తెలుపుతుంది. వీటిని ఎదుర్కొలేని పాలకులు భూతవైద్య సేవలనే ఇవ్వజూపుతారు. కాబట్టి ప్రజలు చైతన్యంతో ఇలాంటి చర్యలను వ్యతిరేకించాలి.