Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రజా పోరాటాలు తమ రాజ్యాధికారాన్ని ప్రశ్నిస్తున్నాయన్న విషయం తప్ప పాలకులకు ఆ కారణాలతో నిమిత్తం లేదు..'' - కింగ్ ఎంపరర్ వర్సెస్ రంపపితూరీగా పిలువబడే మన్యం తిరుగుబాటు దార్లపై 1923లో బ్రిటిష్ ప్రభుత్వం నడిపిన కుట్ర కేసులో వాల్తేర్ డివిజన్ అదనపు జిల్లా జడ్జి తీర్పు నుంచి)
రైతు ఉద్యమం శతదినోత్సవానికి పరుగులు పెడ్తోంది. మధ్యలో రిపబ్లిక్ డే పెరేడ్ ఉంది. రైతుల ట్రాక్టర్ పేరేడూ ఉంటానంటోంది. రిపబ్లిక్ డే పెరేడ్కు ఆటంకాలొస్తే దేశం పరువు పోతుందని సన్నాయినొక్కులు నొక్కుతోంది మోడీ సర్కార్. ఆ సన్నాయి నొక్కుల్ని మీడియాలో ప్రతిధ్వనించే పని కిరాయి రాతగాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి అన్ని పార్లమెంటరీ సాంప్రదాయాల్ని, పద్ధతుల్ని తుంగలో తొక్కి మూడు వ్యవసాయ చట్టాల్నీ రాజ్యసభలో బుల్డోజ్ చేసుకున్నప్పుడే పోవాల్సిన పరువంతా పోయింది. ప్రజాస్వామ్య సూచిలో మన దేశ స్థానం క్రమంగా దిగజారి ప్రస్తుతం 51వ స్థానంలో ఉంది. దీనికి ప్రధాన కారణం మానవ హక్కుల ఉల్లంఘనే! గణతంత్ర దినోత్సవం నాడు ఇంతకంటే పరువుతక్కువ విషయం ఏమైనా ఉంటుందా? రైతులపై మోడీ సర్కార్ దండోపాయంతో దాడి ప్రారంభించింది. అయినా 'మట్టి మనుషుల' ఉద్యమం నిలదొక్కుకుంది. నిలిచింది. రగిలింది. భేదోపాయం పారలేదు. వందల సంఘాలు ఏకశిలా సదృశంగా నిలిచాయి. ప్రకృతితో చదరంగ మాడే రైతులముందు ''రాజు, మంత్రిగార్ల మంత్రాంగం వెలవెల బోయింది. వందలతో ప్రారంభమై, వేలు, లక్షలకు చేరిన రైతు 'సిపాయిలు' ప్రభుత్వానికే 'చెక్' పెట్టారు. దేశరాజధానిలో కొచ్చే ఏడు జాతీయ రహదారులనూ మేక్ షిఫ్ట్ గుడారాల బిడారాలతో అష్టదిగ్బంధనం చేశారు. కాళీపట్నం రామారావుగారన్నట్టు ''వీరంతా కుర్రపీర్లే!'' ''ఏపార్టీనో అంటిపెట్టుకున్న వారు కాదు. బంటుకాపు శకటులా, గొంతులో పుండులా, ఒంటిని పట్టిన పీడలా (ఈ ప్రభుత్వాన్ని) వేధిస్తున్నారు.''
మన దేశ వ్యవసాయంలో అంతర్జాతీయ అగ్రి బిజినెస్ కంపెనీల పాత్ర ఎంతుందో అర్థం కావాలంటే నేటి ఐఎంఎఫ్ ప్రకటన చూస్తే అర్థమవుతుంది. మన వ్యవసాయ సంస్కరణలను ''గొప్ప ముందడుగుగా'' ఐఎంఎఫ్ ఆకాశానికెత్తింది. అందుకే రాజ్యం రెచ్చిపోయి నోరు తెరుస్తోంది. బుసలు కొట్టే పెట్టుబడి, తన ''పుత్రిక''ల ద్వారా రంగంలోకి దిగింది. ఆ రందిలో ఇప్పటిదాకా మోడీ అండ్ కంపెనీ దంచుతున్న పేలి పిండంతా గాలికి కృష్ణార్పణమైపోయిందనే వాస్తవాన్ని కూడ గమనించలేదు. ఆ విధంగా పాలకులు నాలుకలకు నరముండదని మరోసారి రూఢ అయ్యింది. ఒక ఫైనాన్స్ పత్రిక మొన్న జనవరి 12న చేసిన సంపాదకీయ వ్యాఖ్య చూస్తే ఈ వ్యవసాయ చట్టాలపై పెట్టుబడిదారులెన్ని ఆశలు పెట్టుకున్నారో స్పష్టమవుతుంది. ''కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని రైతులు చేస్తున్న డిమాండ్ను అంగీకరిస్తే ఇక ప్రయివేటువారు కొన(లే)రు. ఎందుకంటే మార్కెట్ ధర కంటే కనీస మద్దతుధర 15-20 శాతం ఎక్కువ ఉంటుంది!'' ఇక రైతులను దోచుకునే అవకాశమెక్కడిదని ఆపత్రిక వాపోతోంది.
పార్లమెంటు చేసిన చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయొచ్చా? అసలు రద్దు చేయగలదా? అనే ప్రశ్నని కూడ కొందరు వ్యాఖ్యాతలు లేవనెత్తుతున్నారు. ఆ చర్చలోకి వెళ్ళడం కంటే ఈ రైతు చట్టాలు కార్పొరేట్లకు ఉపయోగపడతాయని భారతదేశ రైతుల భయాలు సకారణమే గాక సహేతుకం కూడ! మోడీ చెపుతున్నట్టు ఈ చట్టాలు హడావుడిగా కాక, రెండు దశాబ్దాల చర్చ తర్వాతనే తెచ్చారా? అయితే అంగీకరించిన రైతు సంఘాలేవి? ఈ చట్టాలకు ఓటేసిన పార్టీలేవి? ''కొందరు అసంతృప్తి జీవులు మినహా దేశంలోని రైతులంతా ఈ చట్టాల యెడల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూంటే'' బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యతిరేకించేవారిని ఎందుకు వేటాడుతున్నారు? కేసులు పెట్టి ఎందుకు వేధిస్తున్నారు?
'ఆ నల్గురి' నిష్పాక్షికత మీద కూడ చర్చ అర్థం లేనిది. (నేడు జరిగిన 9వ రౌండ్ తర్వాత ఒక వికెట్ పడిపోయింది. భూహేందర్సింగ్ మాన్ ఈ కమిటీలో ఉండనని తప్పుకున్నారు.) వర్గ సమాజంలో, అదీ ఒక వర్గ సమస్యమీద నిష్పక్షపాతంతో వ్యవహరించడం దుర్లభం. కార్పొరేట్ల కోసం సభా మర్యాదనే పాటించని మోడీ సర్కార్ రైతు ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఎంతకైనా దిగజారుతుందనే' దానికి నిదర్శనమే సుప్రీంకోర్టునూ ఈ రొచ్చులోకి లాగడం. తాను రైతునేతలతో చర్చలు చేస్తూనే ఉన్నానని చెప్పడానికి నిన్న మరో రౌండ్ చర్చల ప్రహసనం సాగింది. ఇదంతా తుఫాను ముందర ప్రశాంతతేనా? పూర్తిస్థాయిలో నోరు తెరిచిన రాజ్యాంగ యంత్రం రకరకాల అంగాల ద్వారా, ఉపాంగాల ద్వారా రైతు ఉద్యమంపై పట్టుసాధించే పనిలో ఉంది. అన్నీ విఫలమైతే విరుచుకుపడవచ్చు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కడ్జూ అన్నట్టు మరో జలియన్ వాలాబాగ్కు తెగబడ్డా ఆశ్చర్యం లేదు.