Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరి చరిత్ర వారు రాసుకోకపోతే ఆధిపత్యవర్గాల చరిత్రనే చరిత్రగా చెలామణయ్యే ప్రమాదం ఉంది. శతాబ్దాల మానవ ఇతిహాసం చెబుతున్న సత్యమిది. ఇరవయ్యోకటో శతాబ్దంలోనూ వివేచనాపరులు మేల్కొనకపోతే పెత్తందార్ల చరిత్రనే మానవాళి చరిత్రగా రుద్దబడుతుంది. మన సమీపగతాన్ని కూడా మనం రికార్డు చేసుకోకపోవడం కారణంగా దుర్మార్గులు దేశభక్తులుగా, దేశభక్తులు ఉగ్రవాదులుగా, హింసావాదులుగా ముద్రవేయబడుతున్నారు. ఇది వర్తమానానికే కాదు రానున్న కాలానికి అతి పెద్ద ద్రోహం. మన చరిత్ర నుంచి మనం వెలివేయబడటం.
ఝాన్సీలక్ష్మీబాయి గురించి గొప్పగా చదువుకున్నాం. కత్తి చేతపట్టి యుద్ధరంగంలో కాకలు తీరిన యోధురాలిగా శత్రుమూకల్ని చీల్చి చెండాడిన ఝల్కారీబాయిని మాత్రం చరిత్ర విస్మరించింది. పరిణతి చెందిన రాజనీతివేత్తగా, జన శ్రేయస్సుని కోరిన మంత్రాంగంతో ముందు నిలిచిన నాయకురాలు నాగమ్మ కుట్రదారుగా చరిత్రలో నమోదయింది. అసలు కుట్రదారుడయిన బ్రహ్మనాయుడు వీరోచిత పురుషునిగా చరిత్రకెక్కాడు. పరాజితుల ఉనికినే కాదు, వారి చరిత్రని రూపుమాపడానికి ఆధిపత్యవర్గాలు ప్రయత్నిస్తాయనడానికి ఇదొక దాఖలా.
బ్రిటిషు సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ దేశభక్తినీ చరిత్ర విస్మరించింది. లొంగిపోవడానికి, సాగిలపడటానికి అంగీకరించని టిప్పు తిరుగుబాటు తత్వం స్ఫూర్తిదాయకం. చివరిశ్వాస వరకు ధిషణ ధిక్కారాన్ని ప్రదర్శించిన టిప్పు ఓ ఆత్మగౌరవ పతాక, దోపిడీని ప్రతిఘటించే శక్తులకు ప్రతీక. కానీ భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రరచనలో అతనికి తగిన అధ్యాయం సమకూరలేదు. ఇది చారిత్రక ద్రోహం. ఈ ద్రోహం కాషాయ పాలకుల హయాంలో నిర్లజ్జగా కొనసాగుతున్నది.
ప్రజల విప్లవాలను, వారి చారిత్రక పోరాటాలను స్మరించడం అధికారంలో ఉన్న పెత్తందారీ వర్గాలకు నచ్చదు. కనుకనే సిలబస్ని కూడా మార్పుచేర్పుల పేరిట ఏమారుస్తున్నారు. చరిత్ర రచనాక్రమానికి పెనుముప్పుగా పరిణమించే ఈ వైనాన్ని గురించి రొమిల్లా థాపర్ వంటి చరిత్రకారులు హెచ్చరిస్తున్నారు. చరిత్ర నిర్మాణంలో జనపక్షం నిలిచిన వ్యక్తుల, శక్తుల చరిత్రని మాయం చేసే కుట్రలపై అప్రమత్తం చేస్తున్నారు. ఆర్థిక, సామాజిక రంగాల్లోనే కాదు చరిత్రరచనా రంగంలోనూ ప్రతీపశక్తుల కుట్రలు పెట్రేగుతున్న కాలమిది.
నిశ్శబ్దంగా మన కాళ్ళ కింద నేలనే కాదు, మన చరిత్రను కూడా ఛిద్రం చేస్తున్న తీరుని అవలోకించాలి. ఎవరి అనుభవాలు వాళ్ళు రాసుకోడమే కాదు, ఎవరి చరిత్రని వాళ్ళు రాసుకోవాలి. తమ ఉనికిని కాపాడుకోవటం కోసం తాపత్రయపడిన ఆదివాసీలను రాక్షసులుగా, కిరాతకులుగా ముద్ర వేసిన చరిత్ర ఎంత అమానుషమైనదో గుర్తించాలి. కొందరు ఊరవతల ఉండటమే సమంజసం అన్న రీతిన సూత్రాల్ని, సూక్తుల్ని సృజించిన పండితుల ద్రోహాన్ని గురించి ప్రశ్నించడంతోనే సరిపోదు. ఇవాళ ఎవరి చరిత్రని వారు రాసుకోవాలి. తమ మూలాల గురించీ, తాతముత్తాతల శ్రమైక జీవనం గురించి ఆత్మకథాత్మక రచనల ద్వారా తెలియజెప్పాలి. తద్వారా అసలుసిసలు సామాజిక చరిత్ర రచనకు తగిన వనరులు సమకూరుతాయి. శతాబ్దాలుగా అక్షరాలకు దూరమైన వారు అక్షరంపై అధికారం సంపాదించడంతోనే సరిపెట్టుకోకూడదు. తమ అక్షరాల్ని పదునెక్కిన ఆయుధాలుగా మలిచేందుకు తమ చరిత్రని తాము లిఖించాలి. ఇక్కడ ఎవరూ సామాన్యులు కాదు, జీవన పోరాటంలో ఢక్కామొక్కీలు తిన్న అసామాన్యులే. ఎవరి బతుకు పోరాటం వారికి ప్రత్యేకం. ఒక్కొక్కరి జీవనయానం ఒక్కో చారిత్రక గ్రంథం.
మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు తమ జీవితాల గురించి తాము రాయడానికి పూనుకుంటే చరిత్రకెక్కని గాథలెన్నో గ్రంథస్థమవుతాయి. 'మనకు తెలియని మన చరిత్ర' వంటి పుస్తకాలే ఇందుకు ఉదాహరణ. మన సమీపగతం మనకు తెలియాలంటే ఆత్మకథలు, ఆత్మకథాత్మక రచనలు, జీవితచరిత్రలు, మన పల్లెల్లో మనవాళ్ళు చేసిన పోరాటాలు కాగితాల మీద కెక్కాలి. తెలుగునాట గత వందేళ్ళకాలంలో వెల్లువెత్తిన పోరాటాలు, విప్లవాలు అనేకం. వాటిని ఒక పద్ధతిగా నమోదు చేసిన దాఖలాలు లేవు. కొందరు వ్యక్తుల, నేతల అనుభవాలు మాత్రమే సరిపోవు. సమగ్రమైన చరిత్ర పుస్తకాలకు ఎక్కాలి. కమ్యూనిస్టు ఉద్యమానికి వందేండ్లు పూర్తయిన సందర్భమిది. ఈ శతాబ్ది ప్రస్థానం మీద గ్రంథాలెన్నో వెలువడాలి. అలాగే ఈ దేశంలో అనేకానేక విప్లవాలకు గ్రామాలు, రైతులే ఇరుసుగా ఉన్నారు. ఇవాళ కాషాయ పాలకుల మెడలు వంచే రీతిన యాభై రోజులుగా ఆందోళన చేస్తున్నదీ రైతులే. మరి ఆ రైతుల పోరాటాలకు హారతి పట్టిన చరిత్ర కనిపించదు.
చరిత్ర నిర్మాణానికి చోదకశక్తులు ప్రజలే. ఆ ప్రజల చరిత్ర మాత్రం సక్రమంగా, సరయినవిధంగా రికార్డు కావడం లేదు. ఈ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత సృజనశీలురది. నాలుగు శతాబ్దాల పైబడిన హైదరాబాద్ చరిత్ర గురించి కూడా మనకు తెలిసింది స్వల్పం. ఈ నగరం అడుగడుగునా అనేక చారిత్రక గాథలున్నాయి. తిరుగుబాటు స్వరాల గర్జనలున్నాయి. తుర్రెబాజ్ఖాన్ ప్రతిఘటనా పర్వాలున్నాయి. వాటిని స్మరించుకోవడం, రికార్డు చేయడమంటే చరిత్రకు దివిటీలు పట్టడం. తద్వారా వర్తమానాన్ని మరింత జాగృతం చేయడం. లొంగని తరానికి రూపుదిద్దడం. వెరపు నెరుగని యువచైతన్యాన్ని ప్రోది చేయడం. కనుకనే చరిత్ర రచన ఒక బాధ్యతగా స్వీకరించడం ఈ కాలపు సృజనశీలుర కర్తవ్యం.