Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సామాజిక విపత్తులే పాఠాలయి నిలిచాయి
జ్ఞానం, తెరవని పొత్తాలై గుణపాఠం నేర్పాయి
ప్రభుత చూపు నింగిలోన ప్రజల బతుకు నేలపైన
భవితకు దిక్కెవరనే ప్రశ్నను కప్పేసాయి!'' అంటాడు ఓ కవి. నిజమే, అనుభవాల నుంచి ఆచరణ నుంచి వచ్చిందే నిజమైన జ్ఞానం. పాఠాల్లో, తరగతుల్లో బోధించేది కూడా ఇదే. భావితరాలకు అందించాల్సిన బోధన ఈ యేడాది కొనసాగనేలేదు. కరోనా విలయతాండవంతో ఈ సంవత్సరపు ఎకడమిక్ బడిబాట కుంటుపడింది. ప్రకృతి విలయానికి తోడు పాలకుల పరిపాలనా విలయాలూ తోడయి విద్యారంగ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
ఈ నేపథ్యంలోనే ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటి నుంచి బడులను ప్రారంభించాలని నిర్ణయించింది. విద్యాశాఖ కూడా దానికి సంబంధించిన వివరాలను ప్రకటించింది. తొమ్మిదవ తరగతి నుంచి మొదట ప్రారంభించి, తర్వా తర్వాత అంచెలంచెలుగా ఎనిమిది, ఏడు తరగతులకు అనుమతులివ్వాలని నిశ్చయించారు. ఇంటర్, డిగ్రీ తరగతులు కూడా మొదలువుతాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలననుసరించి బడులను ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. ఇది ఒక రకంగా సంతోషించే విషయమే.
అయితే ఇప్పటికీ కరోనా కేసులు నమోదువుతూనే ఉన్నాయి. ఒకవైపు టీకాల ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీకాలు వేయించుకున్నా జాగ్రత్తలు అవసరమని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. పద్దెనిమిది యేండ్లలోపు పిల్లలకు టీకాలు వేయరాదనే సూచనలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి విద్యాశాఖ చర్చించి, ప్రణాళిక తయారుచేసిందా! సరైన కసరత్తు చేయకుండా బడులు ప్రారంభిస్తే ఎదురయ్యే విపత్తులను ఎదుర్కోవడం చాలా కష్టమైన విషయంగా పరిణమిస్తుంది. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల లేమి, మరుగుదొడ్ల సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి. పరిశుభ్రతతో మెలగవలసిన ప్రస్తుత తరుణంలో వీటిపైన ప్రభుత్వం శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. మరుగుదొడ్ల పరిశుభ్రతకు, పాఠశాల పరిసరాల శుభ్రతకోసం ప్రతి పాఠశాలకు ఒక స్వచ్ఛ కార్మికున్ని నియమించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యానికీ, సాఫీగా బడులు సాగడానికీ ఈమాత్రం ఆలోచించవలసి ఉంది. ప్రతి పాఠశాలకు సానిటైజర్లు, విద్యార్థులకు మాస్క్లు అందించడమూ అవసరమే. విద్యార్థులు దూరాన్ని పాటించే విధంగా తగు జాగ్త్రతలను నిర్దేశించవలసి ఉంది. ఇకపోతే ఈ విద్యా సంవత్సరం యాభైరోజులు మాత్రమే జరుగనున్నది. అదీ సక్రమంగా కొనసాగినట్లయితేనే. మరి సిలబస్, పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయులతో చర్చించారో లేదో ఇప్పటికేమీ తెలియదు. విద్యా సంవత్సరాన్ని ఎలా ముగించనున్నారో కూడా స్పష్టంగా తెలుపలేదు. సిలబస్ భారాన్ని తొలగించడం, మూల్యాంకన విధానాన్ని సరళీకరించడం చాలా అవసరం. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా సక్రమంగా నిర్వహించాలి. వీటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముందుగానే చేయవలసి ఉంది.
విద్యారంగాన్ని సాఫీగా కొనసాగించడమేంటే ఈ వ్యవస్థతో ముడిపడి ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించవలసి ఉంటుంది. ముఖ్యంగా బోధనలో ముఖ్యపాత్ర నిర్వహించే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతోంది. కొన్ని సంవత్సరాలుగా బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. వేలాదిమంది పదోన్నతుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అంతర్జిల్లా బదిలీలు, ఖాళీల భర్తీలు, పర్యవేక్షణాధికారుల ఖాళీలు మొదలైన సమస్యలెన్నో పేరుకుపోయి ఉన్నాయి. ఇక ఉపాధ్యాయులకు వేతనాల పెంపు విషయం (పీఆర్సీ) ఇంకా తేలనేలేదు. మూడునెలల్లో తేల్చేస్తానన్న ముఖ్యమంత్రి మూడు సంవత్సరాలుగా మూలనపెట్టే ఉంచారు. 475 పాఠశాలలున్న కేజీబీవి పాఠశాలల్లోని పన్నెండువేల మంది ఉపాధ్యాయుల సమస్యలూ పరిష్కారం కాక పెండింగ్లోనే ఉన్నాయి. ఇంకా మోడల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ కళాశాలలు, పాఠశాలలు, సీఆర్డీల వేతనాలు మొదలయిన అనేక సమస్యలున్నాయి. ఈ సమస్యలు చర్చించి కార్యక్రమాన్ని రూపొందిస్తేనే విద్యారంగం ముందుకు పోతుంది. కానీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సరిగా పట్టించుకోవడం లేదు.
ఒకవైపు కరోనా విపత్తు సాగుతుండగానే కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ అనేక ఏకపక్ష నిర్ణయాలు చేస్తూ ఉన్నది. విద్యరంగంలో కూడా కేంద్రీకరణకు పూనుకున్నది. విద్యలో ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానించే, విద్యను కార్పొరేటీకరించే విధానాలతో నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చింది. విద్యలో మతాన్ని చేర్చి, మూఢత్వాలను, చరిత్ర వక్రీకరణలను బోధించే పనిచేస్తున్నది. ఈ విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం చర్చ చేయవలసి ఉండగా, ఆ రకమైన కార్యక్రమాలేవీ ఇప్పటివరకూ చేపట్టలేదు.
ఇవన్నీ విద్యారంగం ఎడల మన శ్రద్ధను, ఆసక్తిని తెలియచేసే అంశాలు. ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన, పరిష్కరించాల్సిన అంశాలు. మన దక్షిణాదినే ఉన్న కేరళ ప్రభుత్వం, ఈ సంక్షోభ కాలంలోనూ విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధించింది. బడులు నడపడంలో, వాటికి కావలసిన వసతులు, ఏర్పాట్లు చేయడంలో బహుశా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. మన ప్రభుత్వం కూడా అక్కడ ఎలా జరుగు తున్నదో పరిశీలించాలి. ఆ రకంగా మన విద్యారంగాన్ని ముందుకు తీసుకు పోయేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తేనే ఫలితాలను పొందగలుగుతాం.