Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఘటనా ఘటన సమర్థుడు మనదేశ ప్రధాని. ఎటువంటి సమస్య వచ్చినా, అసలు అది ఏ సమస్య అయినా అటుతిప్పి, ఇటు తిప్పి ''ప్రయివేటు'' మిత్రుల 'మేపుదల' కోసమే బదలాయించగల 'ఒడుపు' ఆయన స్వంతం! అటువంటి ''ఆవుకథే. మొన్న నిటి ఆయోగ్ పాలక మండలి (గవర్నింగ్ కౌన్సిల్) సమావేశం. దానిలో ప్రధాని పలుకుల అంతరార్థం దాకా వెళ్లక్కల్లేదు. అర్థం చూసినా ఒక విషయం సుస్పష్టం. ఈ విడత తన పాలన ముగిసేలోపు భారతదేశ గడ్డపై నుంచి ప్రభుత్వ రంగమనే మాటే వినపడకుండా, దాని ఆనవాళ్ళే కనపడకుండా పునాదులతో సహా పెకలించి వేయాలనేది ఆయన కోరిక. అప్పుడే తన జన్మసార్థకమై, ''అవతార ప్రయోజనం'' సిద్ధిస్తుందన్నది ఆ పెద్ద మనిషి ఆకాంక్ష!
బీజేపీ సైద్ధాంతికంగానే ప్రభుత్వరంగానికి వ్యతిరేకం. స్వేచ్ఛా వాణిజ్యమనే ఎడారిలో దప్పికగొన్నకోటాను కోట్ల సామాన్యులను ఎండమావుల వెంట ఉరికించే రాజకీయ పార్టీ అది. ఒకటా, రెండా! 50, 60 యేండ్లు చూసిన ఎదురు చూపులవి. పెట్టుబడిదార్ల అవసరాల కోసమేనైనా నాటి నెహ్రూ సర్కార్ ప్రభుత్వరంగానికి పునాదులు వేసింది. అయినా ఆ ప్రభుత్వరంగం భారత ప్రజల ఉపాధి అవసరాలను తీర్చింది. సామాజిక న్యాయానికి దారులు పరిచింది. ఆర్థిక స్వావలంబనను పటిష్టం చేసింది. అన్నిటికంటే మించి, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమున్నతంగా నిలిపింది. ఆ విధంగా సామ్రాజ్యవాదం మోచేతినీళ్లు తాగే పరిస్థితి అంతమైంది. ప్రపంచంలో ఏ చిన్న దేశంపై సామ్రాజ్యవాదం బుసకొట్టినా మనదేశం ఆ అర్భక దేశాల కండగా నిలిచింది.
దీనంతటిని నాటి జనసంఘం వ్యతిరేకించింది. 1969లో ఇందిరాగాంధీ 14 ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేస్తే పార్లమెంట్లో దాన్ని వ్యతిరేకించిన పార్టీ జనసంఘం. ఆనాటి చిన్న లార్వా నేడు వేయి పడగల విషనాగై,రంగులద్దుకుని నిలబడ్డది. మోడీ సర్కార్ మోసుకొస్తున్న, నేడు మనదేశంలో విచ్చుకుంటున్న విధానాల విహంగ వీక్షణం చేసినా జరుగుతున్న విధ్వంసం కండ్లకు కడుతుంది. 2014 ఆగస్టు 15 ఎర్రకోట బురుజులపై నుంచి మోడీ సాబ్ తన బ్లూప్రింట్ విప్పాడు. ప్లానింగ్ కమిషన్ 'హత్య' చేయబడింది. నిటి ఆయోగ్ (నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా) ఆవిర్భావమే ప్రభుత్వరంగ ధ్వంస రచనకు సాధనమైంది. నేడు ఆ మేలిముసుగూ తొలగించేసి ప్రభుత్వమే స్వయంగా నడుం బిగించింది. నిటిఆయోగ్ మీటింగ్లో మోడీ మహాశయుడు దిశానిర్దేశం చేశాడు.ఒకే 'కిస్తీ'లో రెండువందలకు పైగా కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలను ''కృష్ణార్పణం'' చేయడానికి మొన్నటి బడ్జెట్ సన్నద్ధమైంది. వారుచేసే ఉత్పత్తి పరిమాణాన్ని బట్టి ప్రయివేటు పెట్టుబడిదార్లకు రాయితీలిచ్చే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్ను ఉపయోగించుకుని లాభాలు దండుకోండని ప్రధాని వాక్రుచ్చారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత సంవత్సరం తయారీరంగం కోసం 13 పీ.ఎల్.ఐ. స్కీమ్లను ప్రకటించింది మోడీ ప్రభుత్వం. ఆ విధంగా వాళ్ళు ఎగుమతులు చేసి లాభపడవచ్చని, తయారీరంగం పచ్చబడితే, ఉపాధి అవకాశాలు మెరుగుబడతాయని, అవి ఓట్లుగా రాలతాయని ఆశల సౌధాలు నిర్మించుకుంటోంది. గతంలోనే ''కార్పొరేట్లు ఈ దేశ సంపద సృష్టికర్త''లని కితాబిచ్చిన ప్రధాని నిటి ఆయోగ్ మీటింగ్లో ''వారి ఉత్సాహానికి, శక్తికి తగ్గస్థాయిలో ఆత్మనిర్భర భారత్'' ఉంటుందని శెలవిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు 'మైనస్'లో అఘోరించి అవస్థలు పడుతూంటే ఉత్పత్తి చేసేదెవరు? ఎగుమతులు పోయేదెక్కడికి?
ఒకటి స్పష్టం. 1970, 80 దశకాల్లో ఆత్మనిర్భర్ అంటే దేశం తన కాళ్లపై తాను నిలబడగలగడం. మోడీసాబ్ ఇప్పుడు చెప్పే 'ఆత్మనిర్భర్' పెట్టుబడిదారుల 'కాళ్లపై నిలబడటం'. వాళ్లెపుడైనా సదరు సపోర్టు లాగిపడేస్తే మనదేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. 'మేక్ ఇన్ ఇండియా' అంటే ప్రభుత్వరంగ పరిశ్రమల్లో తయారీ బదులు ప్రయివేటు కార్పొరేట్ సంస్థల్లో తయారీ అనే అర్థాన్ని ఆచరణలో అమల్లోకి తెచ్చాడు మోడీసాబ్. అంటే 2014 (మేక్ ఇన్ ఇండియా) నుంచి 2020 (ఆత్మనిర్భర్) వరకు దేశ ఆర్థిక వ్యవస్థ తరాజు కార్పొరేట్ల వైపు పూర్తిగా మొగ్గిన స్థితి చూడగలం.
ఆకలి తీరని సర్వభక్షక స్వాములు కార్పొరేట్లు. అంతకు మించిన బానకడుపులు వీరి విదేశీ అగ్రజులవి. నదీ, నదాలు, గనులు, అడవులు, కొండలు, సముద్రాలు ఒకటేమిటి.. సర్వం ఆ బకాసుర భోజనానికి సరిపోవు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోడీ తన ''వంద రోజుల'' ప్రణాళిక ముగింపు ఉత్సవంలో ''ఈ వందరోజులు ఒక ట్రైలర్ మాత్రమే! అసలు సినిమా ముందుంది!'' అన్నప్పుడైనా అర్థంకాని వారికి 2021-22 బడ్జెట్, మొన్న నిటి ఆయోగ్లో మోడీ ఉపన్యాసం చూసిన తర్వాతనైనా కనువిప్పు కావాలి. హిందూస్థాన్ జింక్ని, బాల్కోని, ఎన్డీఏ-1 ప్రయివేటీకరించినప్పుడు ఆలోచించని వారు విశాఖ స్టీల్ ప్లాంట్ని, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ని అంతర్జాతీయ విపణిలో వేలానికి పెట్టినప్పుడైనాఈసర్కార్ ప్రయాణమెటో అర్థంచేసుకుంటున్నారు. కార్పొరేట్ల సేవకు తెగబడిన మోడీ సర్కార్ బొడ్లోవేలేసి నిలేస్తున్న రైతాంగ ఉద్యమం, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ను మృత్యువు నోట్లో నుంచి లాగి నిలబెట్టుకున్న కార్మికోద్యమం, ప్రస్తుతం విశాఖ ఉక్కు రక్షణకై సాగుతున్న ప్రజా ఉద్యమమే మనకు స్ఫూర్తి!