Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నువ్వు ఒంటిపైని, వస్త్రాలన్నీ వొలిచేయ్
రాత్రి గదిని వెలుతురుతో తెరపైకెక్కించేయ్
కొంచెం కొంచెం మెదళ్ళపై మత్తును చల్లుతూపో...
నీ స్వేచ్ఛకు హారతి పడతాం, కాపాడతాం' కానీ...
ఒక ప్రశ్నను నాపైకి విసురుతావా! నిన్ను నిలువునా పాతేస్తా
లేదంటే నియంత్రణల సుడిలోకి తోసేస్తా!'' ఇదీ ఇప్పుడు మన ప్రభుత్వాధినేతల తీరు. ఇలాంటి నియంతల నియంత్రణలు విన్నప్పుడు తప్పకుండా ఈ వ్యాక్యాలు గుర్తుకు వాస్తాయి. ఎందుకంటే ఎదుటివారిని నియంత్రించడంలోనే నియంతల బలం ఆధారపడి ఉంటుంది. ప్రశ్నల్ని పాతేసిన చోటనే నిరంకుశత్వం వెర్రితలలేస్తుంది.
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న వారిని, విద్వేష ప్రసంగాలను నివారిం చేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించామని కేంద్రం చేసిన ప్రకటన చాలా మంది సామాన్య ప్రజలకు సాధారణ, సౌమ్యమైన ప్రకటనగానే కనిపించవచ్చు. కానీ ఆ నియంత్రణల వెనకాల ప్రజల, పౌరుల ప్రజాతంత్ర హక్కులు కాలరాయబడతాయనే చేదు నిజాలు పకడ్పందీగా దాగి ఉన్నాయన్నది రేపు తెలియబోయే సత్యం. సోషల్ మీడియా, ఆన్లైన్ వార్తలు, ఓటీటీలను నియంత్రిస్తూ కొత్త నిబంధనలు తీసుకువచ్చిన ప్రభుత్వం వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటివి కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. వీటి ప్రకారంచట్ట విరుద్ధమైన విషయాలు మొదటగా ఎక్కడి నుంచి ఎవరి నుంచి వస్తున్నాయన్న సమాచారం తెలుసుకుని ముప్పయి ఆరుగంటల్లోనే ఆయా సంస్థలు తొలగించాలని నిర్దేశించింది.
సుప్రీంకోర్టు సూచనల మేరకే ఈ నిబంధనలను రూపొందించినట్టు మంత్రి పేర్కొన్నప్పటికీ కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో గత మూడు నెలలుగా ఢిల్లీలో రైతులు, పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఉద్యమానికి అంతర్జాతీయ సంఘీభావమూ వెల్లువెత్తుతోంది. రైతులకు సంబంధించిన కంటెంట్ను తొలగించాలని అప్పుడే ట్విట్టర్ను కేంద్రం ఆదేశించింది. కొందరి ఖాతాలనూ తొలగించాలంది. కొందరి ఖాతాలను తొలగించినప్పటికీ పౌరుల భావస్వేచ్ఛను అడ్డుకోలేమని ట్విట్టర్ నిర్వాహకులు తెలపడంతో వివాదం మొదలైంది. దాని పర్యవసానంగానే నియంత్రణల కొరడా ఝుళిపిస్తోన్నది కేంద్రం.
సాధారణ ప్రింట్ మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియాను తొంభైశాతం తన గొంతుగా మార్చుకున్న ప్రభుత్వం, తనకు వ్యతిరేకంగా ఒక్కమాట వినిపించినా అనేక దారుల్లో, దాడులతో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. నిర్బంధిస్తోంది కూడా. ఇప్పుడు జైళ్ళలో ప్రశ్నలు లేవనెత్తిన జర్నలిస్టులు, గొంతులెత్తిన విద్యార్థులు, ఉద్యమించిన రైతులు, దళితులు, మైనారిటీలు, పర్యావరణ కార్యకర్తలు, హక్కులకై పోరాడే వారే ఉన్నారు. వీరిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, అబద్ధాలను నిజం చేయాలనుకుంటున్నారు. ఈ విషయాలన్నింటికీ వేదికగా ఈ రోజు సోషల్ మీడియా గొప్ప పాత్రను పోషిస్తున్నది. అందుకనే అలాంటి సోషల్ మీడియాను కూడా నియంత్రించగలిగితే నిరంకుశ విధానం నింపాదిగా నడిచిపోగలుగు తుంది. ప్రజాస్వామ్య హక్కులను రక్తం చిందకుండా హత్యచేయ గలుగుతారు. ఇప్పుడు కార్పొరేట్ల కోసం ప్రభుత్వరంగాన్ని కారుచౌకగా ప్రయివేటుకు కట్టబెడుతున్నారు. ప్రజల సొమ్మును అమ్ముకుంటున్నారు. ఇకముందు వీటికి వ్యతిరేకంగా వచ్చే వార్తల్ని, వ్యాఖ్యల్ని నియంత్రిస్తారు.
విద్వేష ప్రసంగాలను, సోషల్ మీడియాలో అబద్ధాల్ని విరివిగా ప్రచారం చేస్తున్నది సంఘపరివార్ శక్తులే. ప్రభుత్వ అనుకూల వ్యక్తులే. ఇదెలా ఉందంటే దొంగే 'దొంగ దొంగ' అన్న చందంగా ఉంది. జనవరి 26న కిసాన్ పెరేడ్లో జరిగిన హింసకు ఎలాంటి సంబంధం లేని దిశారవికి ఉగ్రవాదాన్ని అంటగట్టే ప్రయత్నం చేసింది వారు. దిశా రవి, ఉగ్రవాది కసబ్ లాంటిదేనని బీజేపీ ఎమ్మెల్యే సి.పి. మోహన్ విద్వేష ప్రకటన చేస్తాడు. దిశారవి లాంటివారిని ఖతం చేయాల్సిందేనని హర్యానా హౌమ్మంత్రి ప్రకటిస్తాడు. గాంధీ, నెహ్రూల ఫొటోలను మార్ఫింగ్ చేసి అబద్ధాలను కుమ్మరిస్తోందీ వారే. సంఘ్ పరివార్ లక్ష్యమేమిటో చాలా స్పష్టంగా వివరించి చెబుతున్న సీపీఐ(ఎం) అగ్రనాయకులు సీతారాం ఏచూరిపై అసత్యప్రచారం నిర్లజ్జగా చేస్తున్నదీ వారే. కానీ వారికి భిన్నమైన అభిప్రాయాలు, నిజాలు, వాస్తవాలు వినపడగానే గంగవెర్రులెత్తి నియంత్రించేందుకు ఎదుటివారిపై దాడికి పూనుకొంటున్నారు.
సోషల్ మీడియాపై కొత్త నిబంధనలపేరుతో నియంత్రణ మోపి తమకు, తమ నియంత విధానాలకు వ్యతిరేకంగా పెరుగుతున్న భావాలపై, గొంతులపై నిషేధాలకు తెరలేపటమే ఈ లక్ష్మణరేఖల సారంగా అర్థం చేసుకోవాలి.