Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకున్నట్టే, కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రవర్తన, తీరు కూడా అలాగే ఉంది. ఊసరవెల్లిని మించింది. కోవిడ్ కష్టాల నుంచి నేటికీ తేరుకోని దేశ ప్రజలకు ఆపన్నహస్తం అందించాల్సిన కీలకతరుణంలో అదిప్పుడు చర్చనీయాంశమైంది. అసలే ఉపాధి పోయి పేద, మద్యతరగతి ప్రజలు ఇంకా కష్టాలు, కడగండ్ల నుంచి తేరుకోనేలేదు. కోవిడ్ వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన తరుణంలో, ప్రయివేటులో దానిరేటు రూ. 250గా కేంద్రం నిర్ణయించడం ఆశ్యర్యం, ఆందోళనకు కారణమైంది. ప్రభుత్వ, ప్రయివేటు అనే తేడా లేకుండా అన్నీ ఆస్పత్రుల్లోనూ పేద ప్రజలకు వ్యాక్సినేషన్ ఉచితంగా చేసేలా కేంద్రం ఆదేశాలివ్వకపోవడం గమనార్హం. ఆవైపుకు ఆలోచనే చేయకపోవడం దారుణం. గతంలో కార్పొరేట్లకు లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చినట్టుగా, వ్యాక్సిన్ను అడ్డంపెట్టుకుని మళ్లీ ప్రయివేటుకే పెద్దపీట వేసింది. వ్యాక్సిన్ వేసినందుకు రూ.100 సర్వీస్ ఛార్జీల కింద వసూలు చేసుకునే అవకాశాన్ని అధికారికంగా కల్పించింది. కరోనా కాలంలో కోట్లు దండుకున్న కార్పొరేట్ల ఆస్పత్రుల్లో తప్పనిసరిగా ఉచితంగా టీకా వేసేలా రూల్ పెట్టకపోవడం అన్యాయం. తాజాగా బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం 'తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి' అన్నట్టుగా ఆఘోరించింది. ఫ్రంట్లైన్ వారియర్లు, 60ఏండ్లపైబడిన వృద్ధులు, 45ఏండ్లుదాటిన దీర్ఘకాలిక రోగులు దేశంలో 30కోట్ల మంది ఉన్నారని కేంద్రం అంచనా. వీరందరికి ఈ ఏడాది జులై చివరినాటికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యం. ప్రస్తుత దేశ జనాభా 138 కోట్లు. ప్రపంచంలోనే రెండో స్థానం. రాష్ట్రానిది 3.99 కోట్లు. టీకాని దేశ ప్రజలందరికి ఉచితంగా ఇచ్చే ఉద్దేశ్యం గానీ, ఆ మేరకు సరైన ప్రణాళికగానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి లేదు. టీఆర్ఎస్ సర్కారూ అంతే. కొద్దిమందికే ఇచ్చి చేతులు దులుపేసుకునే ఆలోచనతో ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా గాల్లో దీపం చేసింది. ఈనెల 21తో లాక్డౌన్కు ఏడాది కాగా, రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదై గత మంగళవారానికి సంవత్సరం. వైరస్ జాడ్యం సమసిందని అనుకుంటున్న దశలో, మళ్లీ కేసులు ఉబికిరావడం ఆందోళనకు తావిస్తున్నది. రాష్ట్రంలో గత జనవరిలో 4079 పాజిటివ్ కేసులు రాగా, ఫిబ్రవరిలో 8029తో రెండింతలైంది. దీనికి కేంద్ర ప్రభుత్వాల దివాళాకోరు రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలే కారణం. ప్రజల ఆర్థిక కష్టాలు, నష్టాలను మరిచి, పేదలకు అందించాల్సిన పౌరసరఫరాలను నిరాకరించడం, పరిమితం చేయడమే వీరి ఘనత. లాక్డౌన్తో ఉపాధి పనులు పోయి డొక్కలన్నీ ఖాళీ అయిన క్రమంలో పొట్టకూటి కోసం మళ్లీ రొడ్డెక్కాల్సిన అగత్యం ప్రజలది. అదే కేంద్రం తన గౌడౌన్లల్లోని 8. 5 లక్షల కోట్ల టన్నుల ఆహారధాన్యాలను పంచితే ఈ అస్తవ్యస్థ పరిస్థితి ఉండేది కాదు. టీకాను ప్రభుత్వాసత్రిలో ఉచితంగా ఇచ్చి, ప్రయివేటు దవాఖానాల్లో వెల ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రయివేటు ఆస్పత్రుల్లో సర్వీసు ఛార్జీలు ఎందుకు అదనంగా తీసుకుంటున్నారు? కార్పొరేట్ రెస్పాన్సిబిలిటి(బాధ్యత) ఎటు పాయే? పేదలకు ఒక ఇంజెక్షన్ ఇవ్వలేని ధైన్యస్థితిలో ప్రయివేటు, కార్పొరేట్లు ఉన్నారా? ఇదే(నా)మీ బీజేపీ సుపరిపాలన? మొత్తం జనాభాలో 30 కోట్ల మందికే కోవిడ్ టీకా వేయాలని బీజేపీ భావిస్తున్నది. మిగతా 100 కోట్ల మంది మాటేమిటీ? కొందరికి ఉచితం, మరికొందరికి రేటు. ఇదేమీ నీతి, రీతి!. అదే కేరళ రాష్ట్రంలో ప్రజలందరికీ టీకాను ఉచితంగా ఇస్తామని ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. తిండికి తిప్పలే లేకుంటే, జనం రోడ్లమీదకు ఎందుకొస్తారు? అప్పుడు ఈ మహమ్మారి మళ్లీ పెరిగే సవాలే లేదే. రోజుకు 200 మందికే టీకా ఇస్తూ జనాభా మొత్తానికి ఎప్పటికి ఇస్తారు? అసలు ఇస్తారో లేదోనన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. వైరస్ దేశంలోకి ప్రవేశించి 15నెలలు అవుతుండగా, తెలుగు రాష్రాల్లో తిష్టవేసి ఏడాది. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలను అడ్డంపెట్టుకుని రాజకీయ కుతంత్రం నడుపుతున్న బీజేపీ మెడలు వంచాల్సిన టీఆర్ఎస్, ఆ దిశగా నికరంగా నిలబడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా 103 దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ చేపట్టారు. అమెరికా, ఇజ్రాయేల్, ఇంగ్లండ్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఎక్కడా మోడీలా సర్టిఫికేట్లు, కార్డుల మీద ఫోటోలు పెట్టుకోకపోవడం గమనార్హం. గుజరాత్ స్థానిక ఎన్నికల్లో టీకా సర్టిఫికెట్ల పట్ల ఆ ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసినా, జాతీయస్థాయిలో అలాగే కొనసాగించడం మోడీ రాజకీయ ఖండూతికి పరాకాష్ట. కోవిడ్ కాలంలో వలసకూలీల దారుణ యాతన, మరణ మృదంగం, ఉపాధి కోల్పోయి పడ్డ వ్యథలు, ఇతర దృశ్యాలు 70ఎంఎం సినిమా రీళ్లలా కండ్లేదుట ఇంకా గిర్రున తిరుగుతూనే ఉన్నాయి. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనంటున్న పాలకులు, ఆ మేరకు ప్రజలను సన్నద్ధం చేయడం లేదు. వారి బతుకు తెరువుకు భరోసానివ్వడం లేదు. బాధ్యతలను తీసుకోవడం లేదు. రాజకీయ కక్కుర్తి లేకుండా కోవిడ్ వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా ఇవ్వాలి.