Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మయన్మార్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వకుండా తిరుగుబాటు చేసి సైన్యం మళ్లీ సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. సైన్యం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే మయన్మార్ ప్రజలు ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రాణాలు ఇస్తూ వీరోచితంగా పోరాడుతున్నారు. ఇప్పటికే సైన్యం కాల్పులలో 50మంది చనిపోయారు. మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పేందుకు అనేక సంవత్సరాల నుంచి శాంతియుతంగా పోరాటం జరుగుతున్నది. ఆ పోరాటం ఆటు పోటుల మధ్య సాగుతున్నది. అయినా వీరోచితమైన మయన్మార్ ప్రజలు పట్టుదలతో పోరాటం కొనసాగిస్తున్నారు. వందలాది మంది సైనిక కాల్పుల్లో మరణించారు. నాయకులు గృహనిర్బంధంలో మగ్గిపోతున్నారు. వేలాదిమంది నిర్బంధంలో ఉన్నారు.
2020 నవంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆంగసాన్సూకీ పార్టీ ''నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ)'' 83శాతం ఓట్లు సాధించి 476లో 396 సీట్లు గెలుచుకున్నది. సైన్యం ప్రోద్బలంతో నడుస్తున్న యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ కేవలం 33సీట్లు గెలిచింది. సైన్యం ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి సిద్ధపడక, అవకతవకలు జరిగాయనే కారణం చూపి, అత్యవసర పరిస్థితిని దేశంపై రుద్ది ఒక సంవత్సరంలోపు ఎన్నికలు జరిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. జాతీయ ఎన్నికల సంఘం, అంతర్జాతీయ సంస్థలు ఎన్నికలు సజావుగా జరిగినట్టు ప్రకటించాయి. అసలు విషయం గమనిస్తే...
రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత సైనిక కమాండర్ పదవీకాలం ఈ సంవత్సరంలో అయిపోతుంది. ఆయన పదవి వదులుకోవాలి. ఆయన్ని సూకీ అధ్యక్షుడిగా నియమించడానికి సిద్ధంగాలేరు. ఆయన ఇప్పటి వరకూ అపార అధికారాలు కలిగి ఉన్నారు. వజ్రాల వ్యాపారం, అనేక లాభసాటి పరిశ్రమలలో వాటాలు కలిగి విపరీతంగా సంపద పోగుచేసుకున్నారు. ఆయనతో పాటు అనేక మంది ప్రస్తుత, మాజీసైనిక అధికారుల పరిస్థితి అదే. వారికి అధికారాన్ని, సంపదను వదులుకోవడం ఇష్టం లేదు. దానికి రాజ్యాంగాన్ని సవరించాలని ప్రయత్నించారు. ఎన్నికలలో తమ ప్రతినిధులు గెలవనందున వారికి అవకాశం చేజారిపోయింది.
సూకీ అధికారం చేపడితే రాజ్యాంగాన్ని సవరించి ప్రస్తుతం సైన్యానికి కేటాయించిన మంత్రి పదవులు పోతాయనీ, జాతీయ అసెంబ్లీలో కేటాయించిన 25శాతం సీట్లూ పోతాయనీ, పూర్తిగా పౌరులు ప్రాతినిధ్యం వహించేలా సవరణ జరగవచ్చనీ గమనించి ముందస్తు తిరుగుబాటు చేశారు.
కానీ సైన్యం ఊహించని విధంగా పట్టణాల నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతాల వరకు నిరసనలు, సమ్మెల్లో వేలాదిమంది ప్రజలు పాల్గొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికులు, వైద్యులు, యువకులు, విద్యార్థులు ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలలో సైనికులు కూడా ఈ పోరాటంలో ఉన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి నిరసనకారులపై జరిగిన కాల్పుల్లో ఇప్పటికే 50మంది ప్రాణాలు పోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, ఆస్పత్రులు నడవడం లేదు. ఆర్థికపరంగా చూసినా ఇప్పటికే బాగా నష్టం జరిగిపోయింది.
అంతర్జాతీయంగా అనేక దేశాలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ సైనిక పాలకుడికి ఆంక్షలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేసినా స్పందించడం లేదు. మయన్మార్ ప్రజలు పట్టుదలతో పోరాటం చేస్తున్నారు.
మయన్మార్ చరిత్రను గమనిస్తే 1962లో కూడా అక్కడ ప్రజాస్వామ్యం కోసం పోరాటం జరిగినప్పుడు మూడువేల మంది చంపబడ్డారు. 1998లోనూ పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. సూకీ రంగప్రవేశం చేసినప్పటి నుంచి ఆమె 16సంవత్సరాలు సుదీర్ఘకాలం గృహనిర్బంధంలో ఉంచబడ్డారు. ప్రజాస్వామ్యం గెలిచి 2008లో అక్కడ రాజ్యాంగం ఏర్పడింది. అక్కడ ఎన్నికలు జరిగితే సూకీకి 80శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆమె పదిసంవత్సరాలు పాలించారు. అయితే ఆమె విదేశీ వ్యక్తిని పెండ్లి చేసుకున్నందున ఆమె నేరుగా ప్రధానికాలేకపోయారు. మయన్మార్ చట్టం ప్రకారం భార్యభర్తలు ఇద్దరూ మయన్మార్ పౌరులైతేనే అత్యునత స్థానంలో ఉండవచ్చు. అయినా సూకీ పార్టీకే ప్రజలు పట్టం కడుతున్నారు. ఆమె పార్టీవారే అక్కడ పాలకులుగా ఉంటున్నారు.
ఇప్పుడు అక్కడ సైన్యం ప్రజల నుంచి పూర్తిగా వేరుపడిపోయింది. ప్రజాపోరాటాన్ని అణిచివేయడానికి సైన్యం ఎంత పాశవికంగా దాడులు చేస్తున్నా ప్రజలు ఐక్యతతో వీరోచితంగా ఎదుర్కొంటున్నారు. మయన్మార్ ప్రజలకు భారత ప్రజల పూర్తి సంఘీభావం అవసరం ఉన్నది. మన రెండు దేశాల గత చరిత్ర ఒక్కటే. రెండూ బ్రిటిష్ వలస దేశాలే. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అప్పుడు బహదూర్ షా జఫర్ను రంగూన్కు ప్రవాసానికి పంపి, రాజు దెబాను మయన్మార్కు ప్రవాసం పంపితే ఆయన ప్రస్తుత మహారాష్ట్రలోని రత్నగిరిలో తలదాచుకున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ అక్కడ ప్రజలు సైనిక నియంతల ఉక్కు పాదాల కింద నలుగుతున్నారు. వారు ఇప్పుడు ఇది కొనసాగరాదని కోరుకుంటున్నారు. అందుకని సైన్యం అధికారం వదులుకుని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటుకు వీలుకల్పించాలి. మయన్మార్లో ప్రజాస్వామ్య పునఃప్రతిష్ట జరుగాలని కోరుకుందాం.