Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్దల సభకు పట్టభద్రుల చేత ఎంపిక జరుగనుంది. శాసనమండలి అంటేనే వివిధ వర్గాల ప్రజలు తమ మనోభావాలకు అనుగుణమైన మేథావులను, ఆయా సమూహాల ప్రాతినిధ్యంగా ఎంపిక చేసుకుని తమ గొంతును ప్రతిఫలింపజేస్తారు. తెలంగాణలో రెండు నియోజకవర్గాలలో పోటీ అయినప్పటికీ ఉత్తర తెలంగణ మినహా రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో ఈ ఎన్నిక ప్రభావం కలిగించనుంది. అందుకే రాజకీయ పక్షాలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయితే సాధారణ ప్రజలకు ఈ ఎన్నిక విధానం పెద్దగా తెలియదు. చదువుకున్న వాళ్ళలోనూ ఫ్రిఫరెన్షియల్ ఎన్నిక గురించి అవగాహన పూర్తిగా ఉండదు. తమపేర్లను నమోదుచేసుకుని ఓటర్లుగా ఎన్నికల్లో పాల్గొనాలనే ఉత్సాహమూ చదువుకున్న పట్టణ ప్రజలకు తక్కువే. అలా ఉత్సాహరహితంగా మారడానికి కారణాలూ ఉన్నాయి. దైనందిన బతుకుదెరువు వొత్తిడి ఒక కారణమైతే పెద్దగా ప్రభుత్వాలను, రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నికలు కానందున కూడా నిరాసక్తత ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలు వీటిని ముఖ్యమైనవిగానే భావించి ఓటర్ల నమోదు నుండి, ఇంటింటికీ తిరిగి ఓట్లు కొనే వరకూ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి.
యాభైయేండ్ల క్రితం పెద్దల సభకు, అది ఏ పార్టీ అయినా నిజంగా పెద్దలు మాత్రమే ఎంపికయి వెళ్ళేవారు. ఇప్పుడా తీరు మారింది. పార్టీలలో నిరుద్యోగులకు పదవీకల్పన విభాగంగా మండలి ప్రాతినిధ్యం మారిపోయింది. అందువల్ల పెద్దలు, మేథావులు, ఆయా సమూహాల ఆలోచనలకు అద్దం పట్టే వారు కావాలనే విషయాలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇప్పుడు డబ్బున్న వాళ్ళే పెద్దలు. డబ్బుతో కొనగలిగినవాళ్ళే ఘనమైనవారుగా మారిపోయింది.
పట్టభద్రులు అంటే ఎక్కువగా నిరనుద్యోగులు, ఉద్యోగులు ఉంటారు. వివిధ వృత్తుల్లో పనిచేసేవారు, వ్యాపారులు, సాధారణంగా జీవించే వాళ్ళూ ఉంటారు. ముఖ్యంగా మధ్య తరగతి అభిప్రాయానికి ప్రతిబింబంగా ఎన్నిక సరళి ఉంటుంది. మరి నిజంగా ఈ మధ్యతరగతి ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి, వినిపించి, మీకందరికీ నేనుంటానని చెప్పగలిగిన గుండెధైర్యం గల అభ్యర్థులెవరనేదే అసలు ప్రశ్న.
ఈ రోజు చట్టసభలలో మనకు కావాల్సింది నిరుద్యోగుల ఆకాంక్షలను పలికించే గొంతుక. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారానికి పట్టుబట్టే నాయకుడు కావాలి. కేవలం ప్రభుత్వాలను వ్యతిరేకించడం, అనవసర విషయాలు చర్చలోకి తేవడంకాక నిజమైన ప్రజల, యువకుల సమస్యలను నేడున్న పరిస్థితులలో ఏవిధంగా పరిష్కరించవచ్చో లోతుగా విశ్లేషించి వివరించి చెప్పగల స్వరం కావాలి. పెద్దరికంగా మాట్లాడగలిగిన పెద్దలు సభకు వెళ్ళాలి. నేటి అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ఉద్యోగాల్లో ఏర్పడిన ఖాళీలను కూడా నింపలేని స్థితి ప్రభుత్వాలకుంది. ఇక కొత్తగా ఉద్యోగాలను సృష్టించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యం కాకపోగా అనేక పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరిగింది. కాంట్రాక్టు కార్మికుల, ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్న యువకుల వేతనాలు, వారి ఇబ్బందులను ఆలకించి అర్థం చేసుకుని ప్రభుత్వాలను నిలదీయగల వాళ్ళు ఎన్నిక కావలసి ఉంది. అంతేకాదు మధ్యతరగతి ప్రజల్లో పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని అంటి, ఎండలకన్నా ఎక్కువగా మండిపోవటం తీవ్ర ఇబ్బందుల్ని పెంచింది. వీటి గురించిన ప్రస్తావనలుసైతం ప్రధాన రాజకీయ పక్షాలు చేయటం లేదు. ఉద్యోగులకు పెంచాల్సిన జీతాలు (పీఆర్సీ) పెంచకుండా మూడేండ్లుగా తాత్సారం చేసి, ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పట్టించుకోకపోగా, ఏవో కొన్ని జిమ్మిక్కులకు తెరదీయటం పట్టభద్రులు పసిగట్టలేని విషయం కాదు.
ఈ సమస్యలన్నిటినీ పక్కనపెట్టి ప్రమాదకరమయిన ప్రచారం ఈ సందర్భంగానే తీసుకు వచ్చారు కొందరు. అదేమిటంటే మత ప్రాతిపదికన ప్రజల్ని ఓట్లడగటం. ఇది ఈ దేశ రాజ్యాంగస్ఫూర్తికి, ప్రజాస్వామిక విలువలకు పూర్తి వ్యతిరేకం. భారతీయ సాంస్కృతిక జీవనాన్ని విచ్ఛిన్నం చేసే ఈ ఉన్మాదపు రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ రకమైన భావోద్వేగాలు వాస్తవమైన సమస్యలు చర్చలోకి రాకుండా చేస్తాయి. దేశంలో ప్రభుత్వరంగంలో ఉన్న సంస్థలు, ఉపాధికి, ఉద్యోగ భద్రతకు వెన్నుదన్నుగా నిలుస్తున్న సంస్థలు, విశాఖ ఉక్కు మొదలైన వాటిని ప్రయి'వేటు'కు తెగనమ్ముతూ ప్రజల బతుకు ఛిద్రం చేస్తున్న విధానాలను వెలుగబెడుతున్న వాళ్ళే ఇలాంటి కుయుక్తులకు వొడిగడుతున్నారు. వీటికి వ్యతిరేకంగా నికరంగా నిలబడేవాళ్ళు ఎవరనేది ఎంపికకు కొలమానం కావాలి.
ఇప్పటివరకు ఎన్నికయి తిరిగి నిలబడుతున్న అభ్యర్థులు వారికాలంలో ఏమేమి చేశారు? ఎవరివైపు నిలబడ్డారు అనేది పట్టభద్రులు గ్రహించి ఎవరు ప్రజల పక్షం వహించగలరో తెలుసుకుని సరైన పెద్దను శాసనమండలికి పంపించాలి.