Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''చరిత్రలో మనం చాలా అబద్ధాలు చూశాం.. ఇకముందు అబద్ధాలే చరిత్ర కావడం చూస్తాం''... ఇది వర్తమాన రాజకీయాలనుద్దేశించి విమర్శకుల వ్యాఖ్యానం.. ఈవ్యాఖ్యానానికి నేపథ్యం ఏమైనప్పటికీ అవి ఏమాత్రం అతిశయోక్తులు కావు, అక్షరసత్యాలని నిరూపించే పనిలో ''విరామమెరుగక పరిశ్రమిస్తున్నారు'' మన ప్రధాని మోడీ!
''బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం నేను జైలుకు సైతం వెళ్లోచ్చాను'' అని సగర్వంగా సెలవిచ్చారాయన! ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా భారత ప్రధాని చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు దేశంలో, ప్రత్యేకించి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చనీయాంశమవు తోంది. ప్రధాని నిజంగానే ఆ పని చేసుంటే అది ఆయనకే కాదు, ఈ దేశ పౌరులుగా మనందరికీ గర్వకారణమే. కానీ అది అబద్ధమైతేనే దేశానికి అప్రదిష్ట. అసలు ఆ రోజుల్లో ఈ దేశంలో ఆ పరిస్థితులున్నాయా? అన్న సందేహం ఆయన మాటల్లోని విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ స్వాతంత్య్రోద్యమానికి ప్రభుత్వమూ ప్రజలూ అధికారపక్షమూ ప్రతిపక్షమూ అన్న తేడా లేకుండా యావద్భారతమూ ఏకోన్ముఖంగా సంఘీభావం ప్రదర్శించింది. అటువంటప్పుడు దేశంలో మోడీగారిని నిర్భంధించి జైల్లో పెట్టాల్సిన అవసరమూ అవకాశమూ ఎవరికుందన్నదే ఇప్పుడు ఎంతకూ సమాధానం దొరకని ప్రశ్న. ప్రధాని ఆ వివరాలు కూడా తెలియజేస్తే ఈ సందేహాలకు తావుండేది కాదేమో.
ఓ సాధారణ వ్యక్తిగా ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా ఎవరికీ ఏమంత పట్టింపు ఉండేది కాదు. కానీ, ఈ దేశ ప్రధానిగా, అదీ అధికారిక పర్యటనలో భాగంగా ఒక విదేశీ వేదికపై ఆయన మాట్లాడే ప్రతి మాట మన దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేదిగా ఉండాలే తప్ప అప్రతిష్ట పాలు చేయకూడదు కదా! ఈ ఎరుకలో లేకుండా, చరిత్ర పట్ల అవగాహన లేకుండా ఇలా అలవోకగా అసత్యాలూ అర్థసత్యాలూ వల్లించడం ప్రధాని స్థాయి వ్యక్తికి తగునా? అన్నది విజ్ఞుల మాట. కానీ ఇదే ఆయన 'విధానం' కావటం మన గ్రహపాటు! ఈ దేశంలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రాకముందే తాను ఈ మెయిల్స్ చేశానంటారు! డిజిటల్ కెమెరాలు వెలుగు చూడకముందే తాను డిజిటల్ కెమెరాను వాడానంటారు!! ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే కాదు, విద్యార్హతలు మొదలు విదేశీయానాల వరకూ అనేక సందర్భాల్లో ప్రధాని మాటల్లోని నిజానిజాలను ప్రశ్నించకుండా ఉండలేం!
ఇటీవల బెంగాల్ పత్రికల్లో భారీ ప్రకటనొకటి వెలువడింది. ఆ రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం ఇరవైనాలుగు లక్షలమంది లబ్దిదారులకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చిందనేది ఆ ప్రకటన సారాంశం. లబ్దిదారు అయిన ఒక మహిళ, ప్రధాని ఫొటోలను పక్కపక్కనే వేస్తూ ఆ ప్రకటన మొదటి పేజీలోనే అత్యంత ఆకర్షణీయంగా ప్రచురితమైంది. కానీ ఆ ఫొటోలోని మహిళను సంప్రదించిన పాత్రికేయులకు ఆ ప్రకటనే ఓ పచ్చి అబద్ధమని తెలియడంతో దేశం అవాక్కయింది. తనకు ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ ఎలాంటి ఇల్లూ ఇవ్వలేదనీ, తాను ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నానీ, ఆ ప్రకటనతోనూ అందులోని ఇంటితోనూ తనకు ఏ సంబంధమూ లేదని ఆమె కుండబద్దలు కొట్టడంతో ఆ ప్రకటన బండారం కాస్తా బట్టబయలయింది. ఇది ఎన్ని అబద్ధాలాడయినా ఎన్నికల్లో లబ్ది పొందాలన్న దుగ్దే తప్ప, ఆ రాష్ట్రంలో 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన' ఓ పచ్చి బూటకమని తేలిపోయింది.
పనిలో పనిగా బంగ్లాదేశ్ పర్యటనను కూడా బెంగాల్ ఎన్నికలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు ప్రధాని. మత్వా టెంపుల్తో పాటు ఓ శక్తి పీఠాన్ని కూడా ఆయన అక్కడ సందిర్శించారు. దీనిని ఎవరమూ తప్పు పట్టలేము కానీ, తద్వారా బెంగాల్ ఓటర్లను ప్రభావితం చేయాలనే కుయుక్తులే అనైతికం. అయినా అది నైతికమా అనైతికమా అన్న ఆలోచనే లేకుండా ప్రతి సందర్భాన్నీ తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించు కోవాలని చూసే ప్రధాని తత్వం అందరికీ తెలిసిందే. కాకపోతే ఓ ప్రభుత్వాధినేతగా తన అధికారిక పర్యటనలను కూడా పరోక్షంగా ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగించుకోజూడటం ఆక్షేపణీయం.
ఇంటా బయటా అన్న తేడా లేకుండా నిత్యం అబద్ధాలతో, ఇలాంటి జిమ్మిక్కులతో జనాన్ని మాయచేయడంలో మన ప్రధాని తరువాతే ఎవరైనా. ఆయన అబద్ధాల పట్ల ఇప్పటి వరకూ ఎదురైన ఏ ప్రశ్నకూ సమాధానం లేకపోవడం గమనార్హం. ఆయన మాట అబద్ధం, ఆయన వేషం అబద్ధం, ఆయన వాగ్దానాలూ అబద్దమే. తనకు అధికారమిస్తే ప్రతి పౌరుని ఖాతాలో పదిహేను లక్షల సొమ్ము జమచేస్తానన్నారు. చేశారా? ఏటా రెండు కోట్ల ఉద్యాగాలిస్తానన్నారు. ఇచ్చారా? నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తీస్తామన్నారు. తీశారా? దొంగనోట్లనూ ఉగ్రవాదాన్నీ అరికడతా మన్నారు. అరికట్టారా? అవినీతిని రూపుమాపుతామన్నారు. మాపారా? దేశ ప్రజల జీవితాల్నే మార్చేస్తామన్నారు. మార్చారా? ఇప్పటి వరకూ ప్రజల్ని ఏమార్చడమే తప్ప మార్చింది ఏమీ లేదు. ఇదేమిటి మహాప్రభో అంటే అదంతా ఓ 'జుమ్లా' అని ఆయన మంత్రివర్గ సహచరులే కొట్టిపడేస్తారు. మొత్తానికి ఈ ఏడేండ్ల పాలనలో ఏం చేసినా చేయకపోయినా అబద్ధాన్ని ఓ కళగా అభివృద్ది చేసిన ఘనత మాత్రం వీరిదే.