Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర దర్యాప్తు సంస్థలు సహకరించడం లేదని దేశ సర్వోన్నత న్యాయాధిపతి వాపోవడం కన్నా వైపరీత్యం ఇంకేముంటుంది? న్యాయమూర్తులపై భౌతిక దాడులు, మానసిక వేధింపులు, దుర్భాషలు పెచ్చరిల్లుతున్నా కట్టడి చేసే నాథుడు కొరవడ్డాడని స్వయంగా సీజేఐ ఆవేదనతో స్పందించాల్సిన దుస్థితి దాపురిస్తే ఇక సామాన్య పౌరులకు దిక్కేమిటి? ఒక జడ్జి ప్రాణాల్ని హరించిన పాశవిక దాడితోపాటు దేశవ్యాప్తంగా న్యాయాధికారులు ఎదుర్కొంటున్న బెదిరింపులపై విచారణలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ఆలోచనాపరులను పట్టి కుదిపాయి. మరో పక్క ''మానవ హక్కులు, మర్యాద అన్నవి సర్వోన్నతమైనవి. అయితే వాటికి పోలీసు స్టేషన్లలోనే అత్యధిక ముప్పు ఏర్పడుతోంది'' అంటూ పోలీసు వ్యవస్థ గురించి సైతం సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు.
పది రోజులక్రితం జార్ఖండ్లోని ధన్బాద్లో జాగింగ్ చేస్తున్న న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ను కడతేర్చిన కిరాతక ఘటన దేశమంతటా ప్రకంపనలు పుట్టించింది. ఎందరినో తీవ్రంగా కలచివేసింది. ఆ అమానుష హత్యాకాండ లోతుపాతులు వెలికితీసేందుకంటూ జార్ఖండ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒకదాన్ని నెలకొల్పింది. దానిపై ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రాజీవ్రంజన్ వివరణ ప్రకారం- ప్రభుత్వ సిఫార్సు మేరకు కేసు విచారణను సీబీఐ చేపట్టింది. 'అంతటితో జార్ఖండ్ ప్రభుత్వం చేతులు దులిపేసుకుందన్న మాట!' అన్న సీజేఐ వ్యాఖ్యల్లో సీబీఐ పనితనం పట్ల అపనమ్మకం ప్రస్ఫుటం కావడంలో వింతేమీ లేదు. ఏ కేసులోనైనా అనుకూల ఉత్తర్వులు వెలువడకపోతే న్యాయమూర్తులపై బురదజల్లే కొత్త పోకడలు దేశంలో పుట్టుకొస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు, సందేశాలు, వాట్సాప్లో బెదిరింపులు సైతం హౌరెత్తుతున్నాయి. ఒకటి రెండు సందర్భాల్లో సీబీఐ దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశించి ఏడాది దాటినా ఎక్కడా కదలికే లేదన్న గౌరవ న్యాయమూర్తి సూటి ఆక్షేపణ సీబీఐ పని పోకడలకు నిలువెత్తు నిదర్శనం.
వాస్తవానికి సీబీఐ, ఈడీ, ఐబీలు కేంద్ర పాలక పక్షం పంజరంలో చిలుకల్లా మారిపోయాయని పాతికేండ్ల కిందే ఒక కేసులో సుప్రీంకోర్టు గట్టిగా తలంటేసింది. రాజకీయ జోక్యానికి తావన్నదే లేని పటిష్ట దర్యాప్తు సంస్థలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు నిలదొక్కుకోవాలన్న 'సుప్రీం' స్ఫూర్తికి ఇన్నేండ్లుగా తూట్లు పడుతూనే ఉన్నాయి. 'సీబీఐ నడతలో మార్పు రాలేదు... ఏమీ చేయడంలేదు' అన్న సీజేఐ ఘాటు వ్యాఖ్యల అంతరార్థమదే కదా! అత్యున్నత స్థాయి రాజకీయ ఒత్తిళ్లు దర్యాప్తు సంస్థల వ్యవహారశైలిని ప్రభావితం చేసిన ఉదంతాలెన్నో లోగడ వెలుగుచూశాయి. ఆ వరస, ఒరవడి మారనే లేదని అడపాదడపా రుజువవుతూనే ఉంది. దర్యాప్తులో ఎవరి ఒత్తిళ్లకూ లొంగవద్దని, ఏ పరిస్థితిలోనైనా విధిద్రోహానికి పాల్పడవద్దని సుప్రీంకోర్టే నేరుగా ఆయా సంచాలకులకు ఉద్బోధించిన సందర్భాలున్నాయి. ఆ హితవాక్యాలు అరణ్యరోదనే అయ్యాయి. కేంద్రంలో చక్రం తిప్పుతున్నవారి పెంపుడు జాగిలంగా భ్రష్టుపట్టిన సీబీఐ, న్యాయమూర్తులపై దాడుల అంశాన్ని కొన్నాళ్లుగా పెడచెవిన పెట్టడంలోని అంతరార్థమేమిటి? మన్ను తిన్న పాములా అదిలిస్తే తప్ప కదలని మందకొడితనమే స్వాభావిక లక్షణంగా మారితే 'ప్రతిష్టాత్మక సంస్థ' అందించే న్యాయం అందని ద్రాక్షానే అవుతుంది.
వెన్నెముకే లేనంతటి అపార స్వామిభక్తి పరాయణత్వానికి పెట్టింది పేరుగా మసకబారుతున్న దర్యాప్తు సంస్థలు తమ వ్యవస్థాపక లక్ష్యాన్ని ఏనాడో గాలికి వదిలేసాయి. ఉన్నతాధికార స్థానాల్లో అవినీతి చీడపురుగుల ఏరివేత కోసం ఏర్పడిన సీబీఐ.. ఇప్పుడదే అవినీతి మకిలంటించుకోవడం అసలైన విషాదం. మూడేండ్ల వ్యవధిలో 36మంది సీబీఐ అధికారులపై అవినీతి కేసులు నమోదైనట్లు ఆమధ్య కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటుకు వెల్లడించింది. అంతర్గత రగడ జాతీయ నేర పరిశోధక సంస్థ ప్రతిష్టను పాతాళపు లోతులకు ఈడ్చుకుపోయింది. వీధులకెక్కి కాట్లాడుకున్న కారణంగా ఆ సంస్థ సంచాలకుణ్ని, ప్రత్యేక సంచాలకుణ్ని అర్థాంతరంగా విధుల నుంచి తప్పించాల్సి వచ్చినట్లు అప్పట్లో కేంద్రమే సర్వోన్నత న్యాయస్థానానికి ప్రమాణపత్రం సమర్పించింది. ఆ ఇద్దరిలో రాకేశ్ అస్థానా ఒకరు. సీబీఐని, అందులోని అధికారుల్ని రాజకీయాస్త్రాలుగా ప్రయోగించిన సందర్భాలు ఒకటా రెండా? అనేకం. ఎవరి ఒత్తిళ్లకూ లోనుకాకుండా స్వతంత్ర సంస్థగా కార్యనిర్వాహక స్వయం ప్రతిపత్తితో దర్యాప్తు సంస్థలు పనిచేయగల వాతావరణం ఇప్పటికీ నెలకొనలేదనడానికి ఇంకెన్ని దష్టాంతాలు కావాలి? ఐటీ, సీబీఐ, ఐబీ, ఈడీ వంటివి నిలవాలంటే సంకుచిత రాజకీయ శృంఖలాలను చేదించుకొని రాజ్యాంగ పరిధి పనిచేయాలి. అప్పుడే దాని లక్ష్యాలు నిరవేరుతాయి.