Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ప్రపంచంలో ఉన్న మానవ సంబంధాలన్నీ... ఆర్థిక సంబంధాలేనని ఉద్బోధించారు మార్క్స్ మహాశయుడు. అది వ్యక్తులైనా, వ్యవస్థలైనా ఈ సూత్రం పక్కాగా వర్తిస్తుంది. పాలకులు, ప్రభుత్వాలకు కూడా ఇది అనివార్యం. అయితే రాజ్యాంగంలో రాసుకున్న దాని ప్రకారం సమాఖ్య వ్యవస్థ అయిన మన దేశంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు సుహృద్భావ వాతావరణాన్ని, స్నేహపూర్వక స్థితిని కలిగుండాలి. అలా ఉండాలనే రాజ్యాంగం చెబుతున్నది. పరస్పర ఆధారితాలుగా, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఆనాటి పెద్దలు నొక్కిచెప్పారు. అందుకు భిన్నంగా నేటి పరిస్థితి కొనసాగుతుండటం ఆందోళనకరం. రాష్ట్రాలు కేంద్రానికి ఇస్తున్నది కొండంత... అక్కడి నుంచి రాష్ట్రాలకు వస్తున్నది గోరంత... అనే చందంగా వాస్తవా లున్నాయి.. ఉంటున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఇదే విషయాన్ని ఏకరువు పెట్టారు. బీజేపీని విమర్శించాలనే ఉద్దేశంతోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కాసేపు అనుకున్నా... వాటిని పక్కనబెట్టి వివిధ కేంద్ర సంస్థలు, సర్వే రిపోర్టులను పరిశీలిస్తే రాష్ట్రానికి, ముఖ్యంగా తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విదితమవుతున్నది. మోడీ ప్రభుత్వ హయాంలోని ఈ ఏడేండ్ల కాలంలో ఇదే ఒరవడి కొనసాగుతుండటం గమనార్హం. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అనేది యేడాదికేడాది తగ్గుతుండటమే దీనికి ప్రధాన కారణం. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసులతో ఈ వాటాలు మరింత తగ్గనున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం దాకా కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా 2.437శాతంగా ఉండేది. ఫైనాన్స్ కమిషన్ సిఫారసులతో అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.133శాతానికి తగ్గిపోయింది. ఈ క్రమంలో కేంద్ర పన్నుల్లో మన వాటా రూ.16 వేల కోట్ల నుంచి రూ.13వేలకోట్లకు పడిపోయిందనేది లెక్కలు చెబుతున్న వాస్తవం. మరోవైపు మార్చితో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరం నాటి గణాంకాలను పరిశీలిస్తే... అప్పటిదాకా తెలంగాణ నుంచి కేంద్రానికి వివిధ పన్నుల రూపంలో (ఆరేండ్ల కాలానికి) రూ.2,72,962 కోట్లు వెళ్లాయి. కానీ కేంద్రం నుంచి తిరిగి మనకొచ్చింది రూ.1,40,329 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో రాష్ట్ర పునర్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం విడుదల చేయాల్సిన రూ.900 కోట్లకు కేంద్రం గుండుసున్నా పెట్టింది. జీఎస్టీ పరిహారాల విషయంలో తీవ్ర జాప్యం కొనసాగుతున్నది. కేంద్రం వసూలు చేస్తున్న సెస్, సర్ఛార్జి మొత్తాలను రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాల్లో కలపకపోవటం ఆందోళనకరం. దీంతో అవి తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇదే నష్టాలు తెలంగాణను సైతం వెంటాడుతున్నాయి. అందువల్ల సెస్, సర్ఛార్జీలను రద్దు చేసి... వాటి స్థానంలో రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల రేట్లను పెంచాలన్న విజ్ఞప్తులను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవటం విస్మయపరిచే అంశం. ఇలా ఏ అంకెలు, సంఖ్యలు చూసినా.. ఎన్నిసార్లు లెక్కలేసుకున్నా... కేంద్రం రాష్ట్రానికి రిక్తహస్తాన్నే చూపుతున్నదనేది కాదనలేని సత్యం. ఒకవైపు రాష్ట్రాలు కరోనాతో కుదేలైన వేళ, వాటిని ఆదుకోవాల్సిన మోడీ సర్కారు... ఇలా నిధుల విషయంలో కొర్రీలు వేస్తుంటే అవి తిరిగి ఎలా నిలబడగలుగుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ యేడాది మేలో విధించిన లాక్డౌన్ వల్ల మన రాష్ట్రం ఏకంగా రూ.4,100 కోట్లు నష్టపోయిందనేది ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్న లెక్క. మరి ఇలాంటి లెక్కలన్నింటినీ సరి చేయాల్సిన కేంద్రం... దానికి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, రాజకీయంగా రంధ్రాన్వేషణలో మునిగి తేలుతున్నారే తప్ప ఇతమిద్ధంగా తెలంగాణకు ఎలా అండగా నిలబడతారో చెప్పటం లేదు. వారు చెప్పరు కూడా.. ఎందుకంటే అది వారి విధానపరమైన అంశం కాబట్టి. కానీ వారు తాము చేయాల్సిన పనిని చేయకుండా ఘనమైన ప్రచారాలు చేసుకుంటూ, గొప్పలు చెప్పుకుంటూ రాష్ట్రాన్ని తిప్పలు పెడుతున్నారు. ఇదే సమయంలో నిధుల విషయంలో నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా కేంద్రంతో కొట్లాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సైతం...'నేను కొట్టినట్టు నటిస్తా... నువ్వు ఏడ్చినట్టు నటించు...' అనే రీతిలో ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్ప చిత్తశుద్ధిని ప్రదర్శించటం లేదు. పార్లమెంటులో ఈ అంశాలను ప్రస్తావించటం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన టీఆర్ఎస్ ఎంపీలు సైతం అందుకు భిన్నంగా మిన్నకుండిపోవటం ఆశ్చర్యకరం. ప్రతీ పార్లమెంటు సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు లోక్సభ, రాజ్యసభ సభ్యులతో గులాబీ బాస్ భేటీ కావటం, ఆ సందర్భంగా కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామంటూ ప్రకటించటం ఆనవాయితీగా మారింది. కానీ ఆ తర్వాత అటు పార్లమెంటులోగానీ, ఇటు బయటగానీ అలాంటి కార్యాచరణ లేకపోవటం విస్మయపరిచే అంశం. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే మున్ముందు రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు.