Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చట్ట సభల సభ్యులపై నమోదైన కేసుల దర్యాప్తులో మితిమీరిన జాప్యం, అత్యధిక వ్యాజ్యాల్లో ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలు కనీసం ఛార్జ్షీట్లయినా దాఖలు చేయకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం వ్యక్తం చేసినది ధర్మాగ్రహమే! అభియోగ పత్రాలు దాఖలు చేయకపోవడానికి గల కారణాలు కూడా చెప్పని ఇడి, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థల తీరును తప్పుబట్టడం సమంజసమే. ఛార్జ్షీట్లు లేకుండా కేవలం ఆస్తులు జప్తు చేస్తే ఏం ప్రయోజనమన్న వ్యాఖ్య సబబైనదే. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి ఎంపిలు, ఎంఎల్సి, ఎమ్మెల్యేలపై కేసులను త్వరగా విచారించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై బుధవారం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అమికస్ క్యూరీ హన్సారియా, సొలిసిటర్ జనరల్ (ఎస్జి) మెహతా సమర్పించిన నివేదికలను పరిశీలించి ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు సిబిఐ, ఇడి పని తీరును, కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పార్టీ నాయకులను కేసుల నుంచి తప్పించడానికి చేస్తున్న యత్నాలను కండ్లకు కట్టినట్టున్నాయి. చాలా కేసుల దర్యాప్తులో హైకోర్టులు స్టే ఇవ్వడంవల్ల ఆలస్యమవుతోందని ఎస్జి నివేదించగా అది సరి కాదని, కేవలం ఎనిమిది కేసుల్లోనే స్టే ఉన్నట్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎస్జి కోర్టుకు సమర్పించిన నివేదిక 'అసంపూర్తిగా ఉందని' ధర్మాసనం సున్నితంగా వ్యాఖ్యానించినా కేంద్ర ప్రభుత్వ తీరును తలంటినట్టే భావించాల్సి వుంటుంది.
దేశవ్యాప్తంగా ఎంపీలపై 51, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై 71 మొత్తం 122 కేసులు ఇడి నమోదు చేసింది. అందులో 76 కేసుల్లో దర్యాప్తు పెండింగ్లో ఉంది. సిబిఐ 121 కేసులు నమోదు చేయగా వాటిలో 37 పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసుల్లోని నిందితుల్లో కొందరు మరణించారు కానీ ఆ వ్యాజ్యాలు మాత్రం పరిష్కరించబడలేదు. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రత్యేక కోర్టుల్లో ఎంపి, ఎమ్మెల్యేలపై 138 కేసులు పెండింగ్లో ఉన్నాయని, కొన్ని కేసుల విచారణలో అసాధారణ జాప్యం జరుగుతోందని నివేదిక పేర్కొంది. తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి 147 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రత్యేక కోర్టు పరిధిలో 14 కేసులను ఉపసంహరించుకున్నారు. ఇది ఇటీవల సుప్రీంకోర్టుకు హైకోర్టు రిజిస్టార్ జనరల్ సమర్పించిన నివేదిక. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలైతే తమ వారిని ఆయా కేసుల నుండి తప్పించడానికి అడ్డగోలుగా ఉపసంహరణలకు పాల్పడిన వివరాలూ నివేదికలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ మత ఘర్షణలకు సంబంధించి 2013లో 510 కేసులు నమోదు కాగా 77 కేసులను ఎటువంటి కారణం చూపకుండానే యోగి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 170 కేసులు రద్దు చేశారని నివేదిక తెలిపింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టి, విధ్వంసం సృష్టించిన బీజేపీ అధికారంలోకి రాగానే ఆ కేసుల రద్దుకు లేదా ఉపసంహరణలకు పాల్పడడం దారుణం.
కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసినా న్యాయమూర్తుల కొరత కారణంగా వాటిని అమలు చేయడం అంత సులభం కాదని సుప్రీంకోర్టు పేర్కొనడం వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ''మేము ఏజెన్సీల గురించి ఏమీ చెప్పదలచుకోలేదు. ఎందుకంటే మేము వాటి నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలనుకోవటం లేదు. న్యాయమూర్తుల లాగా వారికీ అధిక భారం ఉంది. కాబట్టే సంయమనం పాటిస్తున్నాం'' అన్న ధర్మాసనం వ్యాఖ్యలూ అలాంటివే! అయితే, ఈ రెండు వ్యవస్థల్లో ఖాళీల భర్తీ లేదా అవసరమైన అదనపు సిబ్బందిని సమకూర్చవలసినది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే కదా! అందునా సిబిఐ, ఇడిలలో నియామకాలన్నీ కేంద్రం పరిధి లోనివే. కాబట్టి దర్యాప్తు, విచారణలో జాప్యానికి ప్రభుత్వాలే పరోక్షంగా బాధ్యత వహించాలి. వెంటనే అన్ని స్థాయిల్లో న్యాయమూర్తుల నియామకాలు, దర్యాప్తు సంస్థల్లో ఖాళీల భర్తీ చేపట్టాలి. ''ఏ న్యాయస్థానంలోనైనా విచారణ 6 నెలల పరిమితిలో దర్యాప్తు ముగించాలని, లేదా ఆయా కేసుల్లో విచారణ పూర్తి చేయడానికి నిర్దిష్ట సమయాన్ని నిర్థారించాలన్న'' సొలిసిటర్ జనరల్ సూచన సరైనదే. సర్వోన్నత న్యాయస్థానం ఇందుకు మార్గదర్శకాలను నిర్దేశించడం అవసరం. అలాగే చట్టసభల సభ్యులపై నమోదైన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడంపైనా తొందరగా నిర్ణయం తీసుకోవాలి.