Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిరిసిల్ల జిల్లా లింగన్నపేట వాగులో కొట్టుకుపోయిన బస్సు, నిర్మల్లో వర్షానికి దెబ్బతిన్న అంతర్గత రహదారి, ఖమ్మం జిల్లా రాజుపేట వద్ద వంతెన మీదుగా ప్రవహిస్తున్న యేరు... నాలుగైదు రోజుల నుంచి పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలివి. చినుకు పడితే నరకమే, కుండపోత.. రహదారుల కోత, రోడ్లను ముంచెత్తుతున్న వరదనీరు, పలు జిల్లాల్లో రాకపోకలకు ఆటంకం... ఇవీ ఆయా వార్తలకు సంబంధించిన శీర్షికలు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వాతావారణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా అకాల వర్షాలు, వరదలు నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లను ముంచెత్తుతున్నాయి. వీటికి మన దేశం, రాష్ట్రం మినహాయింపేమీ కాదు.తెలంగాణలో గతేడాది అక్టోబరులో సంభవించిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు, ఫలితంగా ఇక్కడి ప్రజలు అనుభవించిన గోసను ఇంకా మనం మరవలేదు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోనూ అప్పుడూ, ఇప్పుడూ అదే పరిస్థితి పునరావృతమవుతున్నది. ఇంతటి బీభత్సం తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనలేదన్నది కాదనలేని నిజం. ఇటీవల వాగుల్లో కొట్టుకుపోయిన కార్లు, నోర్లు తెరిచిన మ్యాన్హోళ్లలో పడి ప్రాణాలు కోల్పోయిన అభాగ్యుల కథలే ఇందుకు ప్రబల సాక్షాలు.
వాస్తవానికి గతేడాది అనుభవాల తర్వాత టీఆర్ఎస్ సర్కారు మొదట్లో కొంతలో కొంత గుణపాఠాలు నేర్చినట్టు కనబడింది. ఈ క్రమంలో హైదరాబాద్లో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ), వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎన్ఆర్డీపీ) పథకాలను ప్రవేశపెడుతున్నామంటూ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వీటికి సమాన స్థాయిలో తెలంగాణలోని రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రోడ్లను కూడా త్వరితగతిన నిర్మిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. వీటితోపాటు వాగులు, వంకలపైన బ్రిడ్జీలు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణాన్ని కూడా చేపడతామంటూ స్పష్టం చేసింది. గ్రామీణ రహదారులకు సంబంధించి తాజాగా మొత్తం రూ.657 కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయించగా... ఇందులో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) కింద కేంద్రం రూ.386 కోట్లను కేటాయించింది. వీటికి తోడు రాష్ట్రం తన వాటాగా మరో రూ.271 కోట్లను విడుదల చేసింది. తద్వారా రాష్ట్రంలోని మొత్తం 1,119 కిలోమీటర్ల మేర 152 రహదారులను నిర్మించాలని నిర్ణయించారు. రోడ్లు సౌకర్యం లేని మారుమూల పల్లెటూళ్లు, గిరిజన ప్రాంతాలకే ఇందులో ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నొక్కి వక్కాణించాయి. ఒక్కో రహదారికి సగటున మూడు కోట్ల నుంచి పది కోట్ల వరకూ ఖర్చవుతుందంటూ అంచనా కూడా వేశారు. ఇది కాకుండా ఇప్పటికే వేసిన రోడ్ల నిర్వహణ, పాడైపోయిన వాటికి మరమ్మతుల కోసం మరో రూ.75 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జులైలో ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం. ఈ ప్రతిపాదనలన్నీ పూర్తయి రెండు నెలలు దాటినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. ఏలికలు వ్యూహాత్మక ప్రణాళికలంటూ ఎన్ని మాటలు చెప్పినా... హైదరాబాద్లో పోయినేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా డ్రైనేజీలు పొంగుతున్నాయి, కాలనీలన్నీ జలమయమవుతున్నాయి. ఫలితంగా బాధితుల గుండెలు చెరువవుతున్నాయి.
మరోవైపు ప్రభుత్వ పెద్దల అంచనాలు, ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమైతే... గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు మున్ముందు మరింత దారుణంగా తయారవటం ఖాయం. వరదలు పోటెత్తినప్పుడు గల్లంతైన వారి కుటుంబాలు, పశు.. పంట నష్టంతో కుదేలైన బాధితుల బాధ వర్ణనాతీతంగా మారతుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకమంటూ ఊదరగొట్టటంతోనే సరిపెట్టకుండా... అలాంటి వ్యూహాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. కేవలం కొద్ది మంది కాంట్రాక్టర్ల కోసమో.. లేదా కమిషన్ల కోసమో కాకుండా సరైన దృష్టి, సమగ్ర దృక్పథంతో రహదారులు, వంతెనల నిర్మాణాన్ని చేపట్టాలి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతసేపూ జాతీయ రహదారుల మీదే కాకుండా గ్రామీణ రహదారులనూ పట్టించుకోవాలి. అయితే రోడ్లు, వరద సాయాలకు సంబంధించి రాజకీయ కోణంలో మోడీ సర్కార్ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా నిధులను కేటాయిస్తున్నది. ఇది అత్యంత దుర్మార్గం. తనకు లొంగని రాష్ట్ర ప్రభుత్వాలను దారిలోకి తెచ్చుకునేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేయటం బీజేపీ సర్కారుకు పరిపాటిగా మారింది. 2020లో సంభవించిన వరదల వల్ల మన రాష్ట్రంలో దాదాపు ఐదు వేల కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకోసం రూ.210 కోట్లు, శాశ్వత పరిష్కారానికి రూ.637 కోట్లు అవసరమంటూ రోడ్లు, భవనాలశాఖ.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వీటిలో ఇప్పటి వరకూ ఒక్కపైసా విడుదల కాకపోవటం గమనార్హం. అందువల్ల కేంద్రం పీఎంజీఎస్వై కింది నిధులను కేటాయించి చేతులు దులుపుకుంటే సరిపోదు. వాటిని సంబంధిత రోడ్ల నిర్మాణానికి కచ్చితంగా ఖర్చు పెట్టాలి. భారీ వర్షాలు సంభవించి, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నప్పుడు కేంద్ర బృందాలు, 'వచ్చాం.. చూశార.. వెళ్లార...' అనే పద్ధతుల్లో కాకుండా సమగ్ర సర్వేను నిర్వహించాలి. క్షేత్రస్థాయిలోకి వెళ్లటం ద్వారా ఎక్కడెక్కడ రోడ్లకు ఎంతెంతమేర నష్టం వాటిల్లింది.. వాటికి తాత్కాలిక మరమ్మతుల కోసం ఎంత ఖర్చవుతుంది..? దీర్ఘకాలంలో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి..? అందుకు నిధులెన్ని కావాలనే స్పష్టమైన నివేదికలను తయారు చేసుకుని ఢిల్లీ విమానమెక్కాలి. ఈ ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వమూ డబ్బులు రాబట్టాలి. తద్వారా 'రహదారుల గోస'ను కొంతలో కొంతైనా తగ్గించేందుకు ప్రయత్నించాలి.