Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాశాన్ని కలుషితం చేయాలనే పన్నాగాలు...
పొద్దుపొడుపును హత్యచేయాలనే వికృత విన్యాసాలు...
ఇవి చివరికి సాధించిందేమిటి? చీకటిని శాశ్వతం చేయడమే కదా..!
ఇప్పుడీ దేశం ఎదుర్కొంటున్న ఈ పోకడలు చూస్తే ఆందోళన కలుగుతుంది. మనం జీవిస్తున్నది ఆధునిక కాలంలోనా? లేక మధ్యయుగాల్లోనా? అన్న సందేహం వెంటాడుతుంది. ఏలినవారి నోట ఎప్పుడూ ఒకటే పాట! ఫలితంగా పొద్దున లేస్తూనే మనం గుడులూ మసీదుల గురించే వినాల్సి వస్తోంది. విషాదమేమిటంటే, మనం మాట్లాడుకుంటున్నదీ వాటి గురించే! నిన్నటిదాకా అయోధ్య, బాబ్రీ మసీదు, రామమందిరం...! ఇప్పుడా వివాదం ముగిసిందో లేదో వారణాసి, జ్ఞానవాపి మసీదు, విశ్వేశ్వరాలయం...!! మన ప్రయాణం ఏవైపుకు సాగుతుందో తెలుసుకోడానికి ఇంతకంటే ఉదాహరణలేం కావాలి? అసలీ దేశంలో ఇవి తప్ప ఇంతకు మించిన సమస్యలే లేవా? అంతులేని అసమానతలు, అదుపులేని ధరలు, అంతకు మించిన ఆకలి - నిరుద్యోగంతో ప్రజాజీవితం అంతకంతకూ అగాథంలోకి జారుతుంటే, ఇవేవీ కనీస చర్చకు నోచుకోకపోవడం వైచిత్రి!
అవునులే... దేశంలో ''బుల్డోజర్ దేవుళ్లు'' వెలిశారు కదా..! వారికి ఇంతకంటే పెద్ద సమస్యలేముంటాయి? అందుకే కళ్లకు కాషాయం పులిమి సామరస్యాన్ని కూల్చేస్తున్నారు. మనుషుల్ని మతాలుగా చీల్చేస్తున్నారు. అయోధ్య రామాలయ వివాదంతో రక్తపుటేరులు పారించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న వీరికి, దేశాన్ని తిరిగి 1947కు మళ్లించడానికి ఎనిమిదేండ్లు పట్టింది. రెండుసార్లు అధికారం కావాల్సి వచ్చింది. మరి అక్కడి నుండి మధ్యయుగాలకు తీసుకెళ్లడానికి ఎన్నేండ్లు కావాలీ, ఎన్నిసార్లు అధికార పీఠమెక్కాలీ, ఇంకెన్ని వివాదాలు కావాలీ...!? అసలే 2024 సమీపిస్తోంది...! అందువల్ల ఇప్పుడీ వారణాసి జ్ఞనవాపి వివాదం తెరమీదికి రావడంలో ఆశ్చ్యమేముందీ..? ఇదిలా ఉండగానే కుతుబ్మినార్కూ స్పాట్ పెట్టి ట్వీట్ చేశాడో అమాత్యుడు..! ఇప్పటికే ఈ జాబితాలో తాజ్మహల్ ఉండనేవుంది..!! అయినా, ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడటం, వారి నెత్తుటి ధారలతో పీఠాలకు బాటలు వేసుకోవడం వీరికి కొత్తేమీకాదుగానీ, ఈ ఉన్మత్త రాజకీయాల పట్ల ఉదాసీనతే అవాంఛనీయం. న్యాయస్థానాలు కూడా ఇది గుర్తించకపోవడం ఆందోళనకరం.
తమ వివాదాలకు బాబ్రీ మసీదు తరువాతి సాధనంగా జ్ఞానవాపిని హిందూత్వ శక్తులు ఎప్పుడో చెప్పకనే చెప్పాయి. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అవి వారణాసి జ్ఞానవాపినీ, మధుర షాహి ఈద్గాలను ప్రస్తావించాయి. అందుకు తగ్గట్టుగానే జ్ఞానవాపి మసీదు గోడలపై దేవతామూర్తులున్నాయనీ, వాటి పూజలకు అనుమతించాలనీ కొందరు పిటీషన్ వేయడం, స్థానిక కోర్టు దానిని విచారణకు స్వీకరించి మసీదులో సర్వేకు ఆదేశించడం జరిగిపోయాయి. అయితే, ఈ పిటిషన్ను పరిగణనలోకి తీసుకోగలిగిన కోర్టు, 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని విస్మరించడం విడ్డూరం! 1947 ఆగస్టు 15నాటికి దేశంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలి తప్ప వాటిలో ఎలాంటి మార్పులకు, వివాదాలకు చోటివ్వరాదని నిర్దేశిస్తుందీ చట్టం. అప్పటికే వివాదంలో ఉన్నందున బాబ్రీ మసీదుకు మాత్రం మినహాయింపు నిచ్చింది.. కానీ ఇందుకు విరుద్ధంగా సదరు కోర్టు సర్వేకు ఆదేశించడం గమనార్హం. ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఆ పిటిషన్ విచారణలో ఉండగానే సర్వే పూర్తికావడం, శివలింగం దొరికిందని కోర్టుకు చెప్పడం, కోర్టు ఆ స్థలంలోకి ఎవరినీ అనుమతించకూడదని ఆదేశాలు ఇవ్వడం వేగంగా జరిగిపోయాయి! ఆ సర్వే నివేదిక కోర్టుకు చేరకముందే మసీదు ఆవరణలోని బావిలో దొరికిన రాయిని శివలింగంగా స్థానిక కోర్టు నిర్థారించడం, ఏ ఆధారాలతో ఆ నిర్ధారణకు రావడం జరిగిందో తేలకుండానే సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ధారణను కొనసాగించడం విచారకరం! ఏ కోర్టూ 1991 చట్టాన్ని ప్రాతిపదికగా తీసుకోకపోవడం విషాదంలో విషాదం!
ఒకప్పుడు నేటి బ్యాంకుల్లా సంపదకు కేంద్రాలు ఈ ఆలయాలు. కనుక శత్రురాజ్యాల దాడులకు ప్రధాన లక్ష్యాలుగా ఉందేవి. హిందూ రాజులే హిందూ దేవాలయాలను కొల్లగొట్టిన సందర్భాలు కూడా కోకొల్లలు. అందువల్ల ఈ దేశంలో దేవాలయాల విధ్వంసం ఓ కాదనలేని చారిత్రక సత్యం. ఇందుకు ఏ మతానికీ మినహాయింపు లేదు. అదే సమయంలో ఈ విధ్వంసాలు, మత విద్వేషాలు మధ్యయుగాల నాటి అజ్ఞానానికీ, అనాగరికానికీ, రాజ్యవిస్తరణ కాంక్షకూ ప్రతీకలు అనడం కూడా అంతే వాస్తవం. కానీ ఈ తరతరాల మూఢత్వాన్నీ మూర్ఖత్వాన్నీ ఛేదించుకుని శాంతీ, సహజీవనం, సామరస్యాలను సాధించింది పరిణామం. వీటిని కాపాడుకోవడం, మరింత ముందుకు తీసుకుపోవడం నేటి ఆధునిక సమాజ లక్ష్యాలు కావాలి తప్ప, వెనక్కి నవడం కాదు కదా..?! మధ్యయుగాల నాటి పరిణామాల్ని ఇప్పుడు సరిచేస్తామని చెప్పడం సరైందేనా? అలా చేయాల్సి వస్తే, ప్రముఖ పాత్రికేయులు ఎన్. వేణుగోపాల్ చెప్పినట్టు... ఈ దేశపు నేల సమస్తాన్నీ తవ్విపోయాలి. అందులో ఎన్ని కోట్ల శ్రమజీవుల కంకాళాలు! ఎన్ని జీవనదుల నెత్తురు! ఎన్ని సముద్రాల చెమట! ఎన్ని విశాల విశ్వాల శ్రమ! ఎంత శ్రమ ఫలితాల దొంగతనమో కదా...! మరి ఆ న్యాయమైన హక్కుదార్లకు వాళ్లది వాళ్లకు తిరిగిస్తారా ఎవరైనా?