Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కల్ కరై సో ఆజ్.. ఆజ్ కరై సో అబ్...' అన్నారు కబీర్ దాస్. అంటే రేపటి పని ఈరోజు చేయాలి, ఈ రోజు పని ఇప్పుడే చెయ్యాలని అర్థం. కబీరు చెప్పింది అక్షరాలా సత్యం. అందుకనుగుణంగానే విద్యాశాఖ బడులు తెరిచే దగ్గర్నుంచి వాటిని మూసేసి వేసవి సెలవులు ఇచ్చేంత వరకూ ఒక ప్రణాళిక వేసుకుని... అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేస్తుంది. అదే మాదిరిగా బ్యాంకులు వార్షిక రుణ ప్రణాళికను, వివిధ కంపెనీలు, సంస్థలు తమ లక్ష్యాలకు అనుగుణంగా ముందస్తు ప్లాన్లు వేసుకుని ముందుకు సాగుతుంటాయి. ఇదే కోవలో దేశానికి అన్నం పెట్టే రైతన్న కూడా తొలకరి చినుకులు పడ్డప్పుడు దుక్కి దున్నే దగ్గర్నుంచి పంట నూర్పిడి దాకా సాగుకు సంబంధించి రకరకాల ప్రణాళికలు వేసుకుని వ్యవసాయం చేస్తుంటాడు. కానీ అతడికి సరైన దిశా నిర్దేశనం, మార్గదర్శనం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రణాళికలు వేయకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరిస్తున్నది. పంటల మార్పిడి గురించి ప్రతీసారి పదే పదే ప్రస్తావించే ప్రభుత్వాధినేతలు ఆ మార్పిడి ఎలా ఉండాలో..? ఏయే ప్రాంతాల్లో ఉండాలో మాత్రం చెప్పటం లేదు. పైపెచ్చు తాము చెప్పినట్టు పంటలేయకపోతే రైతు బంధు ఇవ్వకుండా నిలిపేస్తాం... సాగుకు ఇచ్చే ఇతర సాయాలను ఆపేస్తామంటూ బెదిరింపులొకటి. దీంతో రైతు ప్రతీయేటా గందరగోళంలోనూ, అయోమయంలోనూ కొట్టుమిట్టాడుతున్నాడు. అంతకుమించి తీవ్ర నష్టాలపాలవుతున్నాడు.
ఈ నేపథ్యంలో పంటల ప్రణాళికపై పెద్ద ఎత్తున చర్చ జరగాలంటూ వ్యవసాయ నిపుణులు, విశ్లేషకులు, మేధావులు నొక్కి చెబుతున్నారు. దీన్ని కొంత లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే... ప్రపంచీకరణలో భాగంగా వ్యవసాయరంగాన్ని సైతం నూటికి నూరు శాతం మార్కెట్ వ్యవస్థలోకి తీసుకు రావాలన్నది పాలకుల ఎత్తుగడ. తద్వారా దాన్ని కార్పొరేట్ల గుప్పిట్లో పెట్టేందుకు వారు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో ప్రజావసరాల ప్రాతిపదికన స్వయం సమృద్ధితో కూడిన పంటల ప్రణాళిక అనేది నేడు పక్కకు పోయింది. దాని స్థానంలో మార్కెట్ నియంత్రిత వ్యవసాయ ఉత్పత్తిని ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయి. ఈ కుట్రతో తలెత్తిన సంక్షోభం వల్ల దేశంలో ఇప్పటి వరకూ దాదాపు నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం అత్యంత విషాదకర అంశం.
ఈ పరిస్థితిని నివారించేందుకు చట్టబద్ధమైన మద్దతు ధరల వ్యవస్థను ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు నెత్తీనోరు బాదుకుంటున్నాయి. దీంతోపాటు రాష్ట్ర వాతావరణ పరిస్థితులు, నేల రకాలు, నీటి వసతులను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతీయేటా ముందస్తు వాతావరణ సూచనలు, పంటల ధరలు, రాష్ట్ర ప్రజల అవసరాలకు, ఎగుమతికి సరిపోయే పంటలను సాగు చేయాలి. ఇలాంటి అంశాలన్నింటినీ మేళవించి సమగ్రమైన, స్పష్టమైన పంటల ప్రణాళికను ప్రభుత్వం రూపొందించాలి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన రైతు వేదికలను ఉపయోగించుకోవాలి. గ్రామ స్థాయిలో అగ్రికల్చర్ రిస్క్ మేనేజ్మెంట్ (ఏఆర్ఎమ్)లో భాగంగా గ్రామానికి ఇద్దరి చొప్పున ఎంపిక చేసి అన్ని విభాగాల్లో శిక్షణనిప్పించాలి. ఇలాంటి చర్యలను సర్కారు చేపట్టగలిగితే రైతులకు మేలు కలుగుతుంది.. వారు లాభాల బాటలో పయనిస్తారన్నది రైతు నేతలు చెబుతున్న మాట. ఏఆర్ఎమ్లో భాగంగా చీడ పీడలు, వాతావరణ మార్పులను తట్టుకోవటానికి వీలుగా పంటలకు అవసరమైన సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తే... అన్నదాత ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కోగలడన్నది నిర్వివాదాంశం.
ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సి ఉన్నది. కేవలం ముఖ్యమంత్రి మెదడులోంచి పుట్టుకొచ్చిన ఆలోచనలు, ఆయన వద్ద పనిచేసే అధికారగణం ఇచ్చే సూచనలు, సలహాలకే పరిమితం కాకుండా రైతుల్ని, రైతు నేతల్ని, వ్యవసాయ రంగ నిపుణుల్ని, వారి అభిప్రాయాన్ని స్వీకరించాలి. తద్వారా జిల్లాల వారీగా, ఇంకా చెప్పాలంటే మండలాల ప్రాతిపదికన పంటల ప్రణాళికను రూపొందించాలి. దాన్ని పక్కాగా అమలు చేయాలి. చీడ పీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి, కూలీలకు అయ్యే ఖర్చు తదితరాంశాలను పరిగణనలోకి తీసుకుని 'అగ్రికల్చర్ ప్లాన్...'ను రూపొందించాలి. అప్పుడే ఉభయ తారకంగా ఇటు రైతు బాగుపడతాడు... అటు రాష్ట్రం పురోభివృద్ధిని సాధిస్తుంది. అలాగాక అప్పటికప్పుడు, హడావుడిగా 'ఆ పంటలేయొద్దు... ఈ పంట లేయండి...' అంటూ సీజన్ల ముందు హుకూం జారీ చేయటం వల్ల అన్నదాత షరా మామూలుగా కడగండ్ల పాలవటం ఖాయం. ఇదే సమయంలో పంటల ప్రణాళికపై దృష్టి సారించకుండా సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్లాగా కేవలం 'రైతు బంధు, రైతు బీమా' అనే జపం చేస్తూ ఊరకుండిపోతే ఏ ప్రయోజనమూ చేకూరదు.