Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ బృందమంతా హైదరాబాద్లో మూడ్రోజులు విడిది చేయడం చిన్నవార్త కాదు. చిన్న విషయమూ కాదు. ఊరకరారు ఇందరు మహాత్ములు! 'స్పాట్' పెట్టే వచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బహిరంగంగానే అనేక మంది నేతలుచెపుతున్నారు. ఇక్కడ 'షిండే' లెందరున్నారో లెక్కలేస్తున్నారట! రచ్చగెలిచి ఇంట గెలవాలనేది మోడీ పాలసీ. 'సూర్యారావు'గారి స్థాయిలో కాకున్నా జపాన్ నుండి నేపాల్, అరబ్బు దేశాలపై నుండి హిట్లర్గారి స్వంత దేశం వరకు భూగోళానికి దాదాపు ఒక ప్రదక్షిణ పూర్తిచేశాడు మోడీ సాబ్. ప్రస్తుతానికి బిడారమంతా మన రాజధాని నుండి లంగరెత్తేసుకుని కదిలింది.
దక్షిణాదిన బలపడటం, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేసి గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేయడం, 2024లో హ్యాట్రిక్ కొట్టడం తమ లక్ష్యాలుగా రాజకీయ తీర్మానంలో రాశారు. దేశంలోని ప్రతి బూత్పరిధిలో 200మంది కార్యకర్తలను సంపాదించడం, ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాలపై కేంద్రీకరించాలని కూడా తీర్మానించారు. ఇన్ని మేథలు రెండు రోజుల పాటు మథనం చేస్తే మన రాష్ట్రానికి ఏమి ముంచుకొస్తుందో!?
వాస్తవానికి ఇది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ ద్వంద్వ యుద్ధంలో మరో ''యోధకు'' మాత్రం తన చేతిలోనుండి పాలన జారిపోతుందనే భావన, దాని చుట్టూనే ఆయన ఆలోచన! శతాబ్దాల 'గంగా యమునా తెహజీబ్' (హిందూ-ముస్లిం ఐక్యత) నాశనమవుతుంది. భద్రాచలం శ్రీరామచంద్రుని వివాహానికి ప్రతిఏడాదీ నిజాం నవాబు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపేవాడన్న విషయం ఈ 'తెహజీబ్' సంస్కృతికి అతిపెద్ద నిదర్శనం. హిందువులు, ముస్లింలు అందరూ కలిసే మొహర్రమ్ నిర్వహిస్తారు. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. దర్గాల దగ్గర అందరూ కలిసే మన్నత్లు(మొక్కులు) చెల్లిస్తారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయంలోనే దర్గా ఉన్న సంగతి లోకవిదితం. అనేక జిల్లాల్లో హిందువులే మస్తానయ్య, మస్తానమ్మ అనే పేర్లు పెట్టుకునే ఆచారం ఉంది. సూఫీ తత్వాన్ని ప్రచారం చేసే ఫకీర్లు నేటికీ గ్రామాల్లో కనపడతారు. ''నీ పాడీ పంటా చల్లాగుండాలే! అల్లాకే నామ్పే! నీ గొడ్డూ గోదా చల్లాగుండాలే! అల్లాకే నామ్పే! నీ పిల్లా పాపా చల్లాగుండాలే! అల్లాకేనామ్ పే!'' అంటూ ఫకీర్లు లయబద్ధంగా పాడే పాట మన తెలుగు రాష్ట్రాల్లో అందరమూ విన్నదే. ఆ సంస్కృతిని ధ్వంసం చేయడానికి బీజేపీ కంకణం కట్టుకోనుంది. ప్రజల మధ్య అల్లుకున్న ఇటువంటి బంధాలు తెగిపోతే వారిరొట్టె విరిగి నేతిలో పడుతుంది. విషయం అక్కడతో ఆగదు. శతాబ్దాల సాంస్కృతిక వారసత్వం ధ్వంసం చేసేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోంది.
రాష్ట్రానికి రాజు కేసీఆర్ ఉంటాడా? మరో బీజేపీ నాయకుడుంటాడా? అన్నది కాదు ప్రశ్న. బీజేపీ పాలనలో ఇంకొక రాష్ట్రం అదనంగా కలిస్తే శివుడి జటాజూటాల్లో ఒక వెంట్రుక అదనంగా మొలవడమనుకుంటే పొరపాటు. కేంద్ర ప్రభుత్వాలు అవలంభించే ఆర్థిక విధానాలను మనసా, వాచా, కర్మణా వ్యతిరేకించే శక్తులు వివిధ రాష్ట్రాల్లో బలంగా ఉంటే ఆ విధానాలను పూర్తిగా వెనక్కి కొట్టలేకపోయినా, నిదానింప చేయవచ్చు.
ఎస్సీ వర్గాకరణపై ఇంకా ఎంత కాలం మోసం చేస్తారని మందకృష్ణ ప్రశ్న. సికిందరాబాద్లో అరెస్టయిన యువతకు బెయిల్ ఇవ్వాలని మరో శాసనసభ్యుడి ప్రశ్నలన్నీ నిజమైనవి. మోడీ సర్కార్ తేల్చి చెప్పాల్సినవే! రాష్ట్ర ముఖ్యమంత్రి సంధించిన పదిప్రశ్నలూ కీలకమైనవి. ఈ దేశ సామాన్యులంతా చాలా కాలంగా అడుగుతున్నవే. వీటికి మోడీ సమాధానం చెప్పకుండా తోక ముడిచారని రాష్ట్ర నేతలంటున్నారు. మూకహత్యలు దేశంలో యధేచ్ఛగా సాగిపోతున్నా, రైతు ఉద్యమంపై సన్ ఆఫ్ కేంద్ర మంత్రి కారుతో తొక్కించి చంపినా ఆయన మౌనమే. మోడీ మౌనం పూర్ణాంగీకారమా? శిష్య పరమాణువులు రెచ్చిపోండని గ్రీన్సిగలా?
ప్రస్తుతం జరుగుతున్న ''ఫ్లెక్సీ'' వార్ వన్సైడ్ది కాదు. 'అఫెన్సే బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్' అన్న నానుడిని కేసీఆర్ విజయవంతంగా ఉపయోగించి ఉండవచ్చు. కాని ఆయన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినవీ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల నుండి ఆర్టీసీ కార్మికులకు ప్రతినెలా 10-15 రోజులు ఆలస్యంగా వేతనాలిస్తున్నారు. దళిత బంధు, రైతు బంధు ప్రధానమైన స్కీమ్లకు డబ్బులెపుడేస్తారో తెలీనిస్థితి. ఆసరాతో సహా వివిధ రకాల పెన్షన్లు సకాలంలో అందక ముసలీ ముతకా నానా అవస్థలూ పడుతున్నారు. సంక్షేమ రాజ్యమని చెప్పుకుంటూ ఈ పరిస్థితేమిటని జనం గోస పడుతున్నారు. షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్ల జీఓలను ఈ ఎనిమిదేండ్లలో పునర్ నిర్ణయించిన స్థితి లేదు. ఆర్టీసీ, విద్యుత్ భారాలను విపరీతంగా ప్రజలపై మోపారు.
వీటి సంగతేంటి అమాత్యా?! యుద్ధం ఫ్లెక్సీలదే కాదు. ప్రజలపై భారాలు రాష్ట్ర ప్రభుత్వం మోపకుండా కేంద్రంపై పోరాడాలి. అందుకు మనసుంటే మార్గాలుండవా?