Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుపాను హెచ్చరికలు వెలువడగానే ఎలాంటి ఉపద్రవం తలెత్తినా ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉన్నాం అన్నది సాధారణంగా ప్రభుత్వ యంత్రాంగం చెప్పే మాట. ఇప్పుడు ప్రపంచంలో మాంద్యం గురించి హెచ్చరికలతో పాటు అదేమాదిరి భరోసాలు కూడా వెలువడుతున్నాయి. మాంద్య హెచ్చరికల స్థాయి పెరగటంతో బుధ, గురువారాల్లో ప్రామాణిక బ్రెంట్ రకం ముడిచమురు పీపా ధర వందడాలర్ల కంటే తగ్గి ఒక డాలరు అటూ ఇటూగా ఉంది. తాజాగా ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా కూడా ప్రపంచ మాంద్యాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. గత ఆరునెలల కాలంలో మూడు సార్లు ప్రపంచ వృద్ధి రేటును సవరించిన ఈ సంస్థ మరోసారి కసరత్తు చేస్తున్నది. ఏప్రిల్ నుంచి ప్రపంచ ఆర్ధికరంగం మరింత అంధకారంలోకి పోయిందని క్రిస్టాలినా చెప్పారు. 2021లో 6.1శాతం ఉన్న ప్రపంచ వృద్ధి రేటు 2022లో 3.6శాతం ఉంటుందని గతంలో చెప్పిన దాన్ని సవరించనున్నారు. ప్రస్తుతం అస్థిరపరిస్థితిలో ఉన్నామని ఈ ఏడాది ఎంతో కష్టతరంగా ఉండగా 2023 మరింత కఠినంగా ఉంటుందని, మాంద్యం ముప్పు పెరిగిందన్నారు. మంగళ, బుధవారాల్లో అమెరికా ప్రభుత్వ బాండ్ల వడ్డీ ధరల కదలిక మాంద్యానికి చిహ్నంగా భావిస్తున్నారు.
మాంద్య పరిస్థితి నుంచి రెండవ ఆర్థిక శక్తి చైనా బయట పడుతున్నప్పటికీ తిరిగి మందగమనంలోకి పోవచ్చని ద్రవ్య సేవల జపాన్ సంస్థ నోమురా చెప్పింది. వచ్చే పన్నెండు నెలల కాలంలో ప్రధాన ఆర్ధిక వ్యవస్థలన్నీ మాంద్యంలోకి జారతాయని హెచ్చరించింది. అమెరికాతో పాటు ఐరోపా సమాఖ్య, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా వచ్చే ఏడాది మాంద్యానికి గురవుతాయని నోమురా ప్రధాన ఆర్థికవేత్త రోబ్ సుబ్బరామన్ చెప్పాడు. అమెరికాలో తీవ్రమైనది కానప్పటికీ ఈ ఏడాది చివరి మూడు నెలల్లో ప్రారంభం కానున్న మాంద్యం వరుసగా పదిహేను నెలలు ఉంటుందని అన్నాడు. చైనాలో ఇటీవల కరోనా లాక్డౌన్ల కారణంగా ఆర్థిక రంగం కొంత మందగించి ఎత్తివేసిన తరువాత తిరిగి పుంజుకుంటున్నది.
వడ్డీ రేట్ల పెరుగుదల ఒక వైపు, ఆర్థిక వ్యవస్థ మందగించటం వలన కంపెనీలు తీసుకున్న రుణాలను తీరుస్తాయా లేదా అన్న చర్చ మరోవైపు అమెరికాలో జరుగుతోంది. ముఖ్యంగా ప్రయివేటు మార్కెట్కు ముప్పు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నందున కంపెనీలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాయి. ఇప్పుడు వాటిని తీర్చాలంటే తిరిగి తీసుకొనే అప్పులకు వడ్డీ తడిచి మోపెడు అవుతోంది. వచ్చిన లాభాలు వాటికి పోతుండగా, వస్తు ఉత్పత్తి ఖర్చు పెరిగింది, కొన్ని కంపెనీల్లో సరకుల నిల్వలూ పెరుగుతున్నాయి. 2007-09లో వచ్చిన మాంద్య సమయంలో గృహరుణాలు గుట్టలుగా పేరుకు పోగా ఇప్పుడు కార్పొరేట్ల రుణాలు పెరిగాయి. ప్రస్తుతం కంపెనీల రుణాలు 12.5లక్షల కోట్ల డాలర్లకు చేరాయి, వాటిలో 6.7లక్షల కోట్ల డాలర్లు బాండ్ల రూపంలో ఉన్నాయి. నిర్ణీత వడ్డీతో బాండ్లను జారీ చేసిన కంపెనీలకు తాత్కాలికంగా ఇబ్బంది లేకున్నా ఇతర రుణాలు తీసుకున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మన దేశం కూడా ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలను ఎదుర్కొంటోంది. అమెరికాలో వడ్డీరేట్ల పెంపుదల కారణంగా మన స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థలు వెనక్కు వెళ్లిపోతుండటంతో మన విదేశీమారకద్రవ్య నిల్వలు తగ్గుతున్నాయి. మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ కావటంతో వాణిజ్యలోటు పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తోంది. గత తొమ్మిది నెలల్లో స్టాక్ మార్కెట్ల నుంచి వెనక్కు వెళ్లిన విదేశీ పెట్టుబడుల మొత్తం రూ.2.55 లక్షల కోట్లు కాగా ఆ స్థానంలో మన స్థానిక మదుపుదార్లు రూ.2.98 లక్షల కోట్ల మేరకు వాటాలను కొనటంతో స్టాక్ మార్కెట్లో పెద్దగా మార్పు లేదు.
ఉక్రెయిన్ సంక్షోభం ఐరోపాలో ఒక ప్రాంతానికే పరిమితం అవుతుందనుకున్నది కాస్తా ఇప్పుడు ఎలా మారిందో చూస్తున్నాం. ప్రతి వైఫల్యానికి పాలకులు దాని పేరే చెబుతున్నారు. మన దేశంలో కొనుగోలు శక్తి పడిపోయి సమస్యలు తలెత్తుతున్నాయి. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా ప్రపంచ ధనిక దేశాల్లో తలెత్తే మాంద్యం అక్కడికే పరిమితం కాదు. ప్రపంచీకరణలో మనమూ భాగం కనుక దాని ప్రభావం నుంచి తప్పించుకోజాలం. మన వస్తువుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భద్రమైన చేతుల్లో దేశం ఉందని చెబుతున్నవారు ఇప్పుడు అంతా మన చేతుల్లో లేదనే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అసలైన పరీక్ష ముందుంది.