Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
అనురాగపు అంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం'' అంటారు మహాకవి శ్రీశ్రీ. ప్రతి మనిషీ అవధుల్లేని ఆనందంతోనే జీవించాలనుకుంటాడు. ఆ ఆనందం కూడా ఇప్పుడు కరువైంది. మనిషి ఎంత ఆనందంగా ఉన్నాడనేది కనీస జీవన ప్రమాణాలకు కొలమానం. కానీ, దేశంలో పెరుగుతున్న ధరలను చూస్తే... ఏం కొనేటట్టు లేదు, తినేటట్టు లేదు. కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ- ఏది కొనాలన్నా భయపడాల్సి వస్తోంది. ఇప్పుడు వీటి సరసన నీరు కూడా చేరింది. పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు ఆహార పదార్థాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ఐక్యరాజ్య సమితి రూపొందించిన 'సంతోష నివేదిక- 2022'లో 146 దేశాలకు గాను, భారత్ 136వ స్థానంలో ఉంది.
''పస్తులు లేని రోజే ఉండదు
పండుగ రోజైనా కడుపే నిండదు
ఇంతేలే నిరుపేదల బ్రతుకులు...
అవి ఏనాడూ బాగుపడని అతుకులు' అని సినారె ఏనాడో చెప్పాడుగానీ, ఈనాటికీ ఆ పరిస్థితిలో మార్పులేకపోవడం విచారకరం. భారీగా పెరిగిన జీవన వ్యయం బతుకుల్లో ఆనందాన్ని ఆవిరి చేస్తోందన్న వాస్తవాన్ని ఇది రుజువు చేస్తోంది.
పేదరికమనేది నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేస్తున్న సమస్య. ఇటీవల పేదరికం విస్తృతంగా పెరిగిన దేశం భారత్. ఏండ్లు గడుస్తున్నా, పేదల బతుకు చిత్రం మాత్రం మారటంలేదు. చాలీచాలని ఆదాయం, హద్దు ఆపూ లేకుండా పెరుగుతున్న ధరలతో పట్టణ ప్రజలు తమ జీవన వ్యయాన్ని తగ్గించుకొని జీవితాలను వెళ్లదీస్తుండగా, పల్లెల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. రోజుకు 2,250 కేలరీల ఆహారం తీసుకోలేని వారిని పేదలుగా ప్రభుత్వం గుర్తించింది. ఆ ప్రకారం చూస్తే... దేశంలో పౌష్టికాహారం అందని పేదలు కోట్లాది మంది ఉన్నట్లు నిర్థారించవచ్చు. దేశంలో నానాటికి పెరుగుతున్న అధిక ధరల నేపథ్యంలో ప్రజలు కొనుగోళ్లు చేయలేకపోతున్నారు. పట్టణ ప్రజలు గత ఆరు నెలలుగా వస్త్రాలు, ఇంధనం, బయట ఆహారంపై వ్యయాలను తగ్గించుకుంటున్నారని గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ 'యుగోవ్' తన సర్వేలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇక పౌష్టికాహారం అనే మాటకే తావు లేదు. దీనికితోడు ఆహార కొరత కారణంగా రానున్న కాలంలో ప్రపంచ దేశాలు తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐరాస హెచ్చరించింది. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, పెరుగుతున్న అసమానతలతో ఇప్పటికే కోట్ల మంది ప్రజలు ప్రభావితం అవుతున్నారు. 2022లో మరిన్ని కరువుకాటకాలు సంభవించే అవకాశం ఉందనీ, 2023లో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండొచ్చనీ గుటెర్రస్ చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, ఇంధన ధరలు పెరగడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది ఆహార లభ్యతలో ఏర్పడే సమస్యలు వచ్చే ఏడాది ప్రపంచ ఆహార కొరతకు దారితీయొచ్చని ఐరాస చెబుతోంది. ఇదే జరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారుతాయి.
'పేదరికాన్ని తొలగించడానికి ప్రయత్నించడం దాతృత్వం కాదు. అది అసలైన న్యాయం. ఇది ప్రాథమిక హక్కుల పరిరక్షణలో భాగం. అంతేకాదు... ఇది గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించే హక్కు' అంటారు నెల్సన్ మండేలా. ఈ రకమైన కనీస హక్కులను కాలరాస్తూ, ప్రజాసంక్షేమమే మా లక్ష్యం అనే మోసపు మాటలు ప్రభుత్వాలకు అలవాటుగా మారాయి. దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు ధనవంతుల్ని మరింత సంపన్నులుగా, పేదల్ని నిరుపేదలుగా మారుస్తున్నాయి. 'బలవంతుడు సంపద మింగి దరిద్రం పంచుతాడ'ని అంటాడు నగముని. ఆయన మాట అక్షరసత్యమని రుజువుచేస్తోంది బీజేపీ. దేశంలోని అత్యధిక సంపద అదానీ, అంబానీ వంటి కొద్దిమంది దగ్గర పోగుపడుతోంటే ప్రజలు బికారులవుతున్నారు. రైతులు కూలీలవుతున్నారు, కూలీలు బతుకుదెరువు దొరక్క వలసలతో ఆగమవుతున్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తోన్న నయా ఉదారవాద విధానాలు ఈ అంతరాలను మరింత పెంచుతున్నాయి. అసమానతలను రూపుమాపేందుకు ఆర్థిక విధానాల్లో సమూల మార్పు రావాలి. ప్రపంచమంతా పడగ విప్పిన కార్పొరేట్ల పక్షాన కాకుండా పేదల పక్షం వహించే ఆర్థిక విధానాలు రావాలి. ప్రకృతిని కొల్లగొడుతూ, వాతావరణ మార్పులకు కారణమవుతున్నవారిని నిరోధించాలి. అప్పుడు మాత్రమే పేదరికాన్ని, అసమానతలను తరిమికొట్టగలం. శ్రీశ్రీ చెప్పిన 'ఆనందపుటంచులు' చూడగలం.