Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకు విశ్వాసాలు అనేకం. ఆధ్యాత్మికతలో, భక్తిలో ఉండేది విశ్వాసమే. చారిత్రక పరిణామ క్రమంలో కొన్ని విశ్వాసాలు మానవులకు ఆత్మికబలాన్ని సమకూర్చాయి. భక్తిలో, భజనలో, ఆరాధనలో, ఆధ్యాత్మికతలో ఓ మానసిక ఓదార్పును, సాంత్వనను, గుండెనిబ్బరాన్ని తరతరాలుగా జనులు పొందటాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. ఇందులో విద్వేషానికి, విధ్వంసానికి, వైరుధ్యాలకు తావేవుండదు. కానీ కాల ప్రవాహంలో ఆధిపత్య, రాజకీయశక్తులు తమ ప్రయోజనాల నిమిత్తం విశ్వాసాలను విద్వేషాలుగా మార్చి జనాన్ని విభజనకు గురిచేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. జన సమూహాలలో ఉన్న భక్తిభావానికి, మత పరమైన విద్వేష చర్యలకు ఎలాంటి సంబంధమూ లేదు. ఏ మతావలంబకులైనా మనుషులే కదా! మానవీయ హృదయ స్పందన లోన కొనసాగుతూనే ఉంటుంది. విధ్వంసక మూకలకు వినిపించవు ఇవన్నీ. ఉద్వేగాలను రెచ్చగొట్టి విద్వేషాల మంటల్ని విస్తరింపజేసున్న ఉన్మత్త ఆధిపత్య వర్గాలకు, నిజమైన ప్రజల జీవన విధానము ఏమిటో ఎలా తెలుస్తుంది! నిత్యం మతవైరుధ్యాలను పెంచేవారు భక్తి ఎలా ఉంటుందో చూడగలుగుతారా! లేదు. భక్తికీ వీరి మత విద్వేషానికీ ఏమాత్రం సంబంధం లేదు. అందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం.
చెన్నయికి చెందిన సుబీనాబాను, అబ్దుల్ ఘనీ దంపతులు మొన్ననే తిరుమల వెంకటేశ్వరస్వామి కోసం అక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కలిగించేందుకు, అన్న ప్రసాదాలకుగానూ రూ.1.02కోట్లు టీటీడీకి విరాళంగా అందజేశారు. అంతేకాదు, గత ముప్పయి సంవత్సరాలుగా వీరు తిరుమలకు విరాళాలు గోప్యంగానే అందిస్తున్నారని తెలిసింది. వీరి భక్తి, దాతృత్వ భావనకు మతం ఏమైనా అడ్డువచ్చిందా? ఇది కేవలం ఇటీవలి ఒక ఉదాహరణ మాత్రమే. తిరుపతి వెంకటేశ్వరస్వామి ముస్లిం అయిన బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకుని హిందూ ముస్లిం ఐక్యతను దేవుడే చాటాడని భక్తులు అర్థం చేసుకుంటారు. ముస్లింలు నాంచారమ్మను కూతురిగా, వేంకటేశ్వరుణ్ణి అల్లుడిగా భావిస్తారని టీటీడీ వైబ్సైట్లో ఉండటం గమనించాల్సిన విషయం. అందుకనే భారతదేశంలోని మతవ్యక్తీకరణలను పరిశీలిస్తే మతాలమధ్య వైరుధ్యాలు, కూల్చివేతలు, విధ్వంసాలు మాత్రమే చూడలేము, అందులో మతాలపట్ల పరస్పర గౌరవమూ, విశ్వాసమూ, భక్తిభావనతో పాటు వాటికి సంబంధించిన ఆచరణలు కూడా బలంగా ఉన్నాయి. కొందరు మూర్ఖ మతతత్వవాదులు తీవ్ర అసహనాలు ప్రదర్శించినా సామాన్య ప్రజలందరూ ఎంతో ఐక్యమత్యంతో అన్నదమ్ములవలె శాంతియుతంగానే సహజీవనం చేస్తున్నారు అని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా మనం ఎన్నయినా చెప్పుకోవచ్చు. కడపలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రతి ఉగాదిరోజున మొదట దేవుని దర్శించుకునేది ముస్లిం భక్తులేనని, ఇది కొన్ని తరాలుగా జరుగుతోందని, అరబ్ దేశాల నుండి కూడా కాబోయే దంపతులు వచ్చి ఇక్కడి స్వామిని వేడుకుంటారని గుడి పూజారులే చెబుతున్నారు. ఇకపోతే ముంబయిలోని హజీ అలీ దర్గాను వేలాది మంది హిందువులు సందర్శిస్తారు. అక్కడ తమకు ఎంతో సాంత్వన దొరుకుతుందని, ఆ ఆధ్యాత్మిక బలానికి, రూపం, మతం లేదని భక్తులు పేర్కొంటున్నారు. లక్నోలో ఉన్న ఖమ్మాన్ పీర్ బాబా దర్గాకు అనేక మంది హిందువులు వెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తారు. మహారాష్ట్రలోని బైరాగ్దార్ దర్గాలో వినాయక చతుర్ధినాడు గణపతి విగ్రహాన్ని పెట్టి హిందూ ముస్లింలు పూజలు చేస్తారు. తమిళనాడులోని వెలంకన్ని చర్చికి నిత్యం అన్ని మతాలవారు వెళతారు. ముఖ్యంగా హిందువులు వారి పద్ధతిలోనే పూజలు నిర్వహిస్తారు. పంజాబ్లో సిక్కులు తమ గురుద్వారాలో ముస్లింలు ప్రార్థనలు చేసుకోవటానికి మసీదులు లేనిచోట అవకాశాన్ని ఇచ్చి ఆధ్యాత్మికతా ఐక్యతను చాటుకుంటారు. అంటే నిజమైన భక్తి భావన గలవారిలో మూఢత్వాలు, విద్వేషాలు, మత దురహంకారాలు కనపడవు. ఇంకా అనేక సందర్భాలలో మందిరాల నిర్మాణానికి మతాల కతీతంగా పరస్పర సహాయ సహకారాలు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి.
కాబట్టి వాస్తవంగా తేలుతున్న అంశమేమంటే విశ్వాసాలను, భక్తిని, మతాన్ని ఆసరా చేసుకుని కొందరు ఆధిపత్య రాజకీయ ప్రయోజనాల కోసం వైరుధ్యాలను సృష్టించి, విద్వేషాలకు పాల్పడుతున్నారు. ఇది నేడు మనదేశంలో అత్యంత ప్రమాదస్థాయికి చేరుతున్నది. వీటి ఫలితాలు అత్యంత అమానవీయంగా ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతీయ సామాజిక విలువలను ధ్వంసం చేయపూనుకుంటున్నాయి. వైయక్తిక విశ్వాసాలను, భక్తిని రాజకీయాలలోకి తీసుకువచ్చి సమాజంలో ఉన్న ఐకమత్యాన్ని, సహనాన్ని విచ్ఛిన్నం చేయచూస్తున్న వారి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.