Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ 'పుణ్యమా' అని కార్మికోద్యమంలో ఎవరేంటో తెలీని దశ గడిచిపోతోంది. ఇప్పటివరకు కొన్ని సంఘాలు ప్రయివేటీకరణ విధానాలను పేరుకు వ్యతిరేకించేవారు. తీరా సమయమొచ్చేసరికి చల్లగా జారుకునేవారు. పాలేవో, నీళ్లేవో కార్మికులకు స్పష్టంగా అర్థం కావడానికి సమయం పట్టేది. ''నేను యుద్ధంలోకి దూకి ఉంటే కౌరవ సైన్యాన్ని నుశిచేసి, మసిచేసి పారేసేవాడ్ని'' అంటూ అంతఃపుర కాంతలకు లేతసొరకాయ కోతలు కోసిన ఉత్తర కుమారుడిలా బీఎంఎస్ 'సమ్మె'ట దెబ్బ కొట్టాల్సివచ్చే సరికి తోక ముడుస్తున్న తీరు 2015 నుండి చూస్తూనేవున్నారు దేశ కార్మికులు. శత్రువు సమీపించగానే కాళ్ళూ, తల చిప్పలోకి ముడుచుకునే కూర్మావతారం కళ్ళముందు సాక్షాత్కరిస్తూనే ఉంది. పెట్టుబడి పూర్తిస్థాయి దాడికి ఎగబడుతోంది. 'డూ ఆర్ డై' పరిస్థితి కార్మికులది. అది విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కార్మికులైనా, పుదుచ్చేరి విద్యుత్ కార్మికులైనా గోడకి నెట్టివేయబడ్డ పిల్లికూనలై తిరగబడుతున్నారు. నేటి వాస్తవమిది. నిన్న విజయవంతమైన పుదుచ్చేరి విద్యుత్ సమ్మె రుజువుచేసే సత్యమదే!
ముఖ్యమంత్రి ఇంటికి, గవర్నర్ బంగ్లాకు కరెంట్ కట్ చేయడం అసాధారణ విషయం. పాండిచేరి విద్యుత్ సమ్మెలో జరిగిందిదే! ''ఈ ఘాతుకానికి వొడిగట్టడానికి ఎన్నిగుండెల్రా మీకు'' అని అధికారం గాండ్రిస్తోంది. చతురంగ బలాలు దిగుతున్నాయి. పవర్ గ్రిడ్ అధికారులు దిగారు. ఎస్మాని వొరలో నుండి బయటికి తీస్తున్నారు. కార్మికుల్ని నయానా, భయానా లొంగదీసుకునే ప్రయత్నాలు ప్రారంభమైనాయి. ''ప్రయివేటు సేవలుండా''లి అని నయా ఉదారవాద సిద్ధాంతం తలకెక్కిన నడమంత్రపు ఆలోచనా పరులు ఉండనే ఉంటారు. సమస్యేమిటో, అసలా సమ్మె ఎందుకు జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయని మందమతులు వాళ్ళు. వాడికి ఉక్కపోస్తే ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి. ఒక యూనిట్ రూ.20లకు అమ్మినా కొనుగోలు చేయగల జీతమేకాదు, 'గీతం' కూడా ఉన్న ధనాడ్యులు వీరు. ''కరెంట్ వాళ్లు జీతాలెక్కువై కొట్టుకుంటున్నారు. ఇలాంటి వారి వీపులు వాయగొట్టాలంటే మోడీ లాంటివాడు ఉండాల్సిందే'' నంటూ అసందర్భ ప్రేలాపనలు పేలుతూంటారు.
ప్రభుత్వాలేమో విధానపరమైన నిర్ణయాల్లో మీరెలా జోక్యం చేసుకుంటారని కార్మికుల్ని ప్రశ్నిస్తూంటాయి. ప్రయివేటీకరిస్తే ఉద్యోగులకేమీకాదని భరోసా ఇస్తూంటాయి. పుదిచ్చేరిలో ఇచ్చాయి కూడా! అంటే కార్మికులు, ఉద్యోగులు కేవలం తమ పొట్టవైపు మాత్రమే చూసుకునే స్వార్థపరులా? విద్యుత్ ప్రయివేటువారి చేతిలోకెళ్తే వ్యవసాయం, చిన్న పరిశ్రమలూ సర్వనాశనం కావా? దేశంలో అత్యధిక మందికి ఉపాధి చూపించేవి ఈ రెండే. ఈ రెండూ నాశనం అవుతున్నాయి కాబట్టే మోడీ సాబ్ ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలన్న వాగ్దానం అటకెక్కింది. నిరుద్యోగ సైన్యం పెరుగుతూంటే ఉన్న కార్మికుల జీతాలు తగ్గడానికి ఏరకంగా దోహదపడతుందో మార్క్స్ నుండి ప్రభాత్ పట్నాయక్ వరకు అర్థశాస్త్రవేత్తలు నిరూపిస్తూనే ఉన్నారు.
దేశంలోని విద్యుత్రంగం 1948 నుండి 1992 వరకు దాదాపు అర్థశతాబ్దం పవర్కట్ల సమస్య మినహా ఇరత సమస్యలేవీ లేకుండా నడిచింది. ఎన్రాన్తో కొన్ని సమస్యలు, ఎ.ఇ.ఎస్. కార్పొరేషన్తో మరికొన్ని, డిస్కాంలు ఏర్పడ్డాక కూడా పోని ఆర్థిక సమస్యలు, 'ఉదరు'తో అన్ని సమస్యలూ పోతాయంటే అదీ పోలేదు. 'ఆదిత్య'తో పోతాయంటున్నారు. ఇక ఈ డొంకతిరుగుడు ఎందుకని ప్రత్యక్షంగా ప్రయివేటీకరణకు పూనుకోవాలనుకున్నారు. అప్పటి వరకూ ఉన్న చట్టాలన్నింటినీ తుంగలో తొక్కి 2003లో 'విద్యుత్ చట్టం' తెచ్చారు. అప్పనంగా ప్రజల సొమ్మును ఆరగించేందుకు కార్పొరేట్ల ప్రయత్నం. అదీ సంతృప్తినివ్వలేదు. విద్యుత్ చట్ట సవరణ 2014 చేశారు. 2019, 2021, చివరికి 2022లో సవరణ బిల్లు చట్టం అయింది. దానికీ ప్రతిఘటన ఎదురుగావడంతో 2022లో పార్లమెంట్లో ప్రవేశపెట్టి చివరికి సెలెక్ట్ కమిటీకి నివేదించారు. ఈలోగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో నుండి నరుక్కురావాలనే ప్రయత్నం మొదలైంది. జమ్ముకాశ్మీర్లో చేసిన ప్రయత్నం అధికార్ల, ఉద్యోగుల ప్రతిఘటనతో తాత్కాలికంగానైనా వెనక్కిపోయింది. ఛండీఘర్లో చేసిన ప్రయత్నాన్నీ కార్మికులు అడ్డుకున్నారు. హైకోర్టు తీర్పు వారికి అండగా నిలిచింది. ఇప్పుడు పుదుచేరిలో పుష్త్రూ చేయాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. బలమైన ఉద్యమమున్న పొరుగు రాష్ట్రాల నాయకత్వం సహకారంతో పుదుచేరి ఉద్యోగులు మిలిటెంట్గా పోరాడి ప్రభుత్వాన్ని ఒకడుగు వెనక్కినెట్టారు. మోడీ సర్కార్కు ఇంత ఆత్రమెందుకు? అస్మదీయుల సేవకేనా? అనేక రాష్ట్రాల్లో డిస్కాంలు అంబానీ, అదానీ, టాటాల చేతిలో కెళ్ళడం చూస్తే ''దొరుకునా ఇటువంటి సేవా?'' అనే త్యాగరాయ కీర్తన మోడీకి సరిగ్గా సూట్ అవుతుందేమో! ఈ దశలో విద్యుత్రంగాన్ని కాపాడుకోవల్సింది కార్మికులు, అధికార్లు, ఇంజనీర్లే. వాస్తవానికి కాపాడుతున్నది కూడా వారే!