Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె వద్ద పాస్పోర్టు ఉంది...
వీసా ఉంది...
ఫ్లైట్ టికెట్టూ ఉంది...
కానీ, న్యూయార్క్ వెళ్లకుండా ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆపేశారు..! అవసరమైన పత్రాలన్నీ సక్రమంగానే ఉన్నప్పటికీ ''సనా ఇర్షాద్'' ప్రయాణానికి అనుమతి నిరాకరించారు..! ఆమేమీ ఉగ్రవాది కాదు. వేల కోట్ల ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకుని విదేశాలకు పారిపోతున్న ''ఘనాపాటి'' అంతకంటే కాదు. అయినప్పటికీ మన ఘనతవహించిన కేంద్ర సర్కారు ఆమెను నిలిపివేసింది..! ఎందుకు? అంటే షరామామూలుగా ఇది ఓ సమాధానం లేని ప్రశ్నే..! ఆమె ఈ విషయం ట్వీట్ చేస్తే తప్ప ఈ వార్త కూడా ప్రపంచానికి తెలియదు. ఆ తరువాత వెల్లువెత్తిన ప్రశ్నలకు ఏలినవారి సమాధానం ''ఆమె పేరు ఫ్లై లిస్టులో లేదు. నో ఫ్లై లిస్టులో ఉంది'' అని. ''ఫ్లై లిస్టులో ఎందుకు లేదు?'' అనడిగితే తిరిగి ఇది కూడా సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది..!
''సనా ఇర్షాద్ మట్టూ'' కాశ్మీరుకు చెందిన ఓ ఫొటో జర్నలిస్టు. ఆమె చిత్రించిన ఫొటోలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ''పులిట్జర్'' ఆవార్డును ఆమె గెలుచుకుంది. మేలో ప్రకటించిన ఈ అవార్డును అందుకోవడానికి అమెరికాకు బయలుదేరిన ఆమెను భారత ప్రభుత్వం అడ్డుకుంది. ఒక భారతీయ పాత్రికేయురాలికి ఓ ప్రఖ్యాత అంతర్జాతీయ అవార్డు రావడం ఆమెకే కాదు, దేశానికీ గౌరవం, గర్వకారణం. కానీ, సొంత ప్రభుత్వమే అందుకు మోకాలడ్డటం ఎంత అప్రతిష్ట!? ఇది ఏలినవారికి తెలియదనుకోలేం. మరి తెలిసీ ఇంతకు ఎందుకు దిగజారినట్టు, ఆమెను ఎందుకు అడ్డుకున్నట్టు అంటే మరి అడ్డుకోరా? ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దీపాలు పెట్టి, చప్పట్లు కొట్టి, మంత్రాలు చదివి తాము కరోనాను కనీవినీ ఎరుగని రీతిలో కట్టడి చేశామని గొప్పలు చెప్పుకుంటుంటే... ఆమె తీసిన చిత్రాలేమో గుట్టలుగా పోగుబడ్డ శవాలను, ఆక్సిజన్ అందక విలవిలలాడుతున్న ప్రాణాలనూ ఎత్తిచూపుతుంటే వారి పరువేంగావాలీ..?! అందుకే ఆమెను నిలువరించారన్న భావనలు నేడు దేశమంతటా వ్యక్తమవుతున్నాయి.
తమకు భిన్నమైన అభిప్రాయాలు ఏ రూపంలో వ్యక్తమైనా ఒప్పుకోని వీరి అసహన ధోరణులకు ఇది మరో నిదర్శనం. ఈ అసహనానికి కళ్లుండవు. ఆలోచన అంతకంటే ఉండదు. అంధవిశ్వాసం నుంచి, అహంకారం నుంచి పుట్టుకొచ్చే ఒక వికారపు భావాజాలానికి ఒకానొక రూపం ఇది. అంతెందుకు, ఇదే ప్రైజ్ విన్నర్లలో ఒకరైన మనదేశపు మరో పాత్రికేయుడు డానిష్ సిద్దికీ, ఇటీవల అఫ్ఘనిస్తాన్లో కవరేజీకి వెళ్లి కాల్పుల్లో మరణిస్తే కనీసం సంతాపం ప్రకటించలేని సంస్కారం మన సర్కారుది. డానిష్ సిద్ధికీ గానీ, సనా ఇర్షాద్గానీ కోవిడ్ కాలంలో భారతీయుల జీవనానికి చిత్రికపట్టడమే నేరమైపోయింది. నిజానికి వారికి ఏ రాజకీయ ఉద్దేశాలూలేవు. వారు చిత్రించిన ఫొటోలలో ప్రభుత్వం చేపట్టిన చర్యలూ, కృషికీ సంబంధించినవి కూడా ఉన్నాయి. వారు చేసిందల్లా పరిస్థితులను ఉన్నవి ఉన్నట్టుగా చిత్రించడం మాత్రమే. వాస్తవాలకు అద్దం పట్టడం మాత్రమే. కానీ వాస్తవాలను సహించగలిగే నేతల కాలమా ఇది..?!
ఓ ప్రజాకవి చెప్పినట్టుగా ''అడుగు తెలియని జీవితంలో నిజం అనేది ఎంత ఎక్కువగా తవ్వితే అంత అమితంగా దొరికే విలువైన ఖనిజం''. కానీ నిజాలను సహించలేని పాలకుల కాలం కదా ఇది. సమస్యలను వెలికితీయడం, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపటం జర్నలిస్టుల బాధ్యత. వాటిని గుర్తించి సరిదిద్దు కోవటం ప్రభుత్వాల విజ్ఞత. కానీ ఇక్కడ ఆ విజ్ఞత మరిచిన ప్రభుత్వాలు పాత్రికేయుల బాధ్యతలను నియంత్రి స్తున్నాయి. ఎందుకంటే ఇది ఈ దేశం మున్నెన్నడూ ఎరుగని ''దేశభక్తుల'' పాలన కదా... ఇప్పుడు ఇదే రాజనీతి...! అందుకే లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి పారిపోయిన విజరు మాల్యాలనూ, నీరవ్ మోడీలనూ ఏ నిబంధనలూ నిలువరించలేకపోయాయి. కానీ విధి నిర్వహణలో నిబద్ధతను ప్రదర్శించి, వృత్తిధర్మాన్ని పాటించి న సనా ఇర్షాద్ను మాత్రం అన్యాయంగా అడ్డుకున్నాయి. ఇక్కడ అడ్డుకున్నది కేవలం ఒక వ్యక్తిని కాదు, పత్రికా రంగంలో ఈ దేశానికి దక్కవలిసిన ఓ అరుదైన గౌరవాన్ని. అందుకే పత్రికా స్వేచ్ఛలో ఈ దేశం అట్టడుగు స్థానంలో నిలిచివుంది. గతేడాది 142వ స్థానంలో ఉన్న దేశం ఈ యాడాదికి 150వ స్థానానికి దిగజారింది. కేవలం ఒక ఛాయాచిత్రానికే ఈ ప్రభుత్వం ఇంత భయపడి వణికిపోయిందంటే దాని రూపం ఎంత వికారమైనదై ఉండాలీ..!