Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కల కానిది విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలలోన బలిచేయకు.. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే.. శోధించి సాధించాలి.. అదే ధీరగుణం'' అనే ఈ పాట వింటే మానసికంగా క్రుంగిపోయేవాళ్లకు, నిరాశా నిస్పృహకు లోనయ్యేవారికి బతుకుపైన చిన్న ఆశ మొలకెత్తుతుంది. ఆనాటి పాటలు, మాటలు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేవి. పై శ్రీశ్రీ పాటవిని ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ వ్యక్తి మనసు మార్చుకున్నాడని మా కాలంలో చెప్పుకునేవాళ్లం. అదొక భరోసాగీతం. జీవితం యొక్క విలువను, మనిషి చెయ్యాల్సిన, నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని బోధించే సినీగీతం అది. ఈ పాటెందుకు గుర్తుకొచ్చింది అంటే... మొన్నొకసారి మిత్రుడు దిన పత్రికలో ఒక పేజీ చూపెడుతూ వార్తలు చదవమన్నాడు. చదివితే అందులో ఆత్మహత్యలూ హత్యలే సగానికి పైగా పేజీ నిండివున్నాయి. అన్ని వార్తలూ కలచివేసేవే. ఇవి రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇంతకు ముందు లేవా అంటే... ఉన్నవి. కానీ నేడు విపరీతంగా పెరిగాయి.
మనుషులెందుకు ఇలా మారిపోతున్నారు? మనస్తత్వాలు - చిన్న చిన్న విషయాలనే తట్టుకోలేని విధంగా ఎందుకు మారుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటినీ వార్తలతో పాటు నాపై కుమ్మరించాడు మిత్రుడు. తప్పకుండా వేసుకోవాల్సిన ప్రశ్నలు. సమాధానాలు సరియైనవి తెలుసుకోలేకపోతే కూడా చాలా అనర్థాలు జరుగుతాయి. కలికాలం! ఈ కాలపు దౌర్భాగ్యమే ఇంత... ఏం చేస్తాం! అంటూ నిట్టూర్చే పెద్దలూ ఉంటారు. కర్మ సిద్ధాంతాన్ని వల్లించే వాళ్లు, వ్యక్తుల మానసిక అవస్థల విశ్లేషణ చేసేవాళ్లు, చాలా రకాలుగా సమాధానాలు సర్థిపోతారు. వాస్తవికతల ఆధారంగా పరిణామాలను అవగాహన చేసుకోగలిగితేనే కర్తవ్యం బోధపడుతుంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్లలో ఎక్కువ మంది యువకులే ఉంటున్నారు. ఆర్థిక విషయాలు ముఖ్యంగా ఉన్నవి కొన్నయితే, సామాజిక అసమానతలవి కొన్ని. ప్రపంచీకరణ, వస్తు వ్యామోహాలు, వినియోగదారితత్వం పెరగడం వల్ల జరిగేవి కొన్ని. ఇక అక్రమ సంబంధాలు, లైంగిక విచ్చలవిడితనానికి పాల్పడుతున్న కారణంగా హత్యలు ఆత్మహత్యలు ఇటీవల చాలా పెరిగాయి. జనగామ కోటగట్టు తండాలో రైతు గుగులోతు రవి (35) పంట దెబ్బతిని అప్పులు కట్టే మార్గంలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మొయినాబాద్లో అశోక్ (25) ట్రాక్టర్ అప్పు కట్టటం లేదని ఫైనాన్స్ వాళ్లు వేధిస్తుంటే ఉరేసుకుని చనిపోయాడు. లోన్యాప్ వాళ్ల వేధింపులకు వనపర్తిలో శేఖర్ ఉరి. ప్రేమంటూ కుటుంబం పరువు తీస్తోందని కన్నకూతురు గీత (16)ను పొడిచి చంపిన తండ్రి. భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నదని తెలుసుకుని తట్టుకోలేక రైలుక్రింద కుమారునితో సహా పడి ఆత్మహత్య. తమ్ముడిని చంపిన అన్న... ఇలా హత్యలూ ఆత్మహత్యలు ఎన్నయినా పేర్కొనవచ్చు.
ముఖ్యంగా ఆర్థిక పరమైన బాధలు ఎదురవ్వడం ప్రధాన సమస్య. రైతులు, పేదల సమస్య. మొత్తం సమాజ సమస్య. వైయక్తిమైన ఇబ్బందులున్నా అది మొత్తం సమాజ సమస్య. ప్రభుత్వాల విధానాల ఫలితంగా వచ్చిన సవాలు. ప్రయివేటు చేతుల్లోని ఫైనాన్స్ సంస్థలు చేస్తున్న ఆగడాలపై ఏ అదుపూ లేకపోవడం, ప్రభుత్వం ఆదుకోకపోవడం జరుగుతోంది. ధైర్యంగా పోరాటాలలో పాల్గొనడంలోనే స్థయిర్యాన్ని పొందగలుగుతారు. సామాజిక అంతరాలు మానవ సంబంధాలను నిలువునా ధ్వంసం చేస్తున్నాయి. అది కులం కావచ్చు. మతం కావచ్చు. వీటి అంతరాలకు వ్యతిరేకంగా నిత్యం పోరాడాల్సే ఉంది. ఇక వినియోగదారీతత్వం, విచ్చల విడితనం పెట్టుబడిదారీ విధానపు ఫలితం. ఇది నైతిక, మానవీయ సంస్కృతిని ధ్వంస మొనర్చి, ఏమి చేసైనా సరే లాభాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని పొందటమే లక్ష్యంగా ప్రేరేపిస్తుంది. అరాచకమై విజృంభిస్తుంది.
ఈ వ్యవస్థ మనిషిలో నిరంతర కొరతను, అసంతృప్తిని పెంచుతుంది. తన లేమికి, సామర్థ్యలేమికి, ఓటమికి వ్యక్తిని బాధ్యున్ని చేస్తుంది. అందుకే అతడు నిరాశలోకి వెళ్లిపోతాడు. బాధల్ని, దుఃఖాల్ని పంచుకునే వారెవరూ లేరనే ఒంటరితనంలో, నిలబడే బలం లేక నిష్క్రమిస్తాడు. నిస్పృహ ఎంతగా నింపుతుందో, కసినీ ద్వేషాన్నీ పెంచుతోంది నేటి సామాజిక గమనం. అనేక అనర్థాలకు, దురాలోచనలకు కారణమైన వ్యవస్థను అర్థం చేసుకుని భిన్నమైన చూపును కలిగి ముందుకు పోగలగాలి. జీవితం సమరమైతే అందులో ఓటమి, గెలుపు భాగమని గ్రహించాలి. వ్యవస్థ విసిరే సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొనేందుకు సామూహికతత్వాన్ని అలవర్చుకోవాలి. జీవితం విలువైనది. దాన్ని నిలుపుకొని, ఉన్నతంగా తీర్చుకోవటం లక్ష్యంగా సాగాలి.