Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు ''రాజ్యాంగ దినోత్సవం''. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సారథ్యంలో రూపొందించబడిన ''భారత రాజ్యాంగం'' ఈ దేశ సమస్త ప్రజల సర్వోన్నత శాసనంగా ఆమోదించబడిన రోజు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల సమన్వయంగా నేటికి 73ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భమిది. అదే సమయంలో ఆ సర్వోన్నత శాసనం అత్యంత ప్రమాద ఘంటికలను ఎదుర్కొంటున్న సందర్భం కూడా ఇదే..! ఏ ప్రభుత్వమైతే 2015లో ఈ ''నంబర్ 26''ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిందో, ఆ ప్రభుత్వమే ఇప్పుడా ఘనమైన స్ఫూర్తికి గోతులు తవ్వుతోంది. ఫలితంగా రాజ్యాంగబద్దమైన స్వతంత్ర వ్యవస్థలన్నీ అధికారంలో ఉన్నవారి జేబు సంస్థలుగా మారిపోగా, ''ఎన్నికల సంఘం'' సైతం అందుకు మినహాయింపు కాకపోవడం మన ప్రజాస్వామ్య స్ఫూర్తినే వెక్కిరిస్తోంది! ప్రస్తుతం ఈ దేశ అత్యున్నత న్యాయ స్థానం ఈ ప్రభుత్వానికి సంధిస్తున్న ప్రశ్నలే ఇందుకు తార్కాణం.
''ఎన్నికలసంఘం కమిషనర్గా కేంద్రం అరుణ్గోయల్ను మెరుపు వేగంతో నియమించడం వెనుక మతలబేమిటి?''... ''ఒకవైపు ఈ నియామకాలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే, మరోవైపు ఆగమేఘాల మీద ఈ నిర్ణయం తీసుకోవడంలోని ఔచిత్యమేమటి?''... ''కేవలం 24గంటల్లోనే అసాధారణ రీతిలో ఈ నియామకం పూర్తిచేయడానికి మీరు అనుసరించిన విధానమేమిటి?''... ఈ ప్రశ్నలు న్యాయమూర్తుల ఆగ్రహానికే కాదు, అసంఖ్యాకులైన భారత ప్రజల అంతరంగానికీ ప్రతీకలు.
భారత రాజ్యాంగం ప్రకారం ''ఎన్నికల సంఘం'' ఓ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దేశంలో ప్రజాస్వామ్యానికి కీలకమైన ఎన్నికలు నిర్వహించే వ్యవస్థ. ఎలాంటి ప్రలోభాలకూ, అనైతిక ప్రభావాలకూ, అక్రమాలకూ అవకాశమివ్వకుండా... అత్యంత పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడం ఈ సంస్థ బాధ్యత. కానీ అవాంఛనీయమైన రాజకీయ జోక్యాల వల్ల ఎన్నికల సంఘం డూడూ బసవన్నలతో నిండిపోతోంది. చివరికి ఎన్నికల్లో ఆ స్వేచ్ఛా, పారదర్శకతలే కొడిగట్టిన దీపాలవుతున్నాయి. ఈ ఎనిమిదేండ్ల మోడీ పాలనలో అది మరింత తీవ్రమై ఎన్నికల సంఘ మంటే ఏలినవారి వ్యూవహాలకు తలాడించే తోలుబొమ్మగా మారింది. ఎలక్షన్ కమిషనర్లుగా తమకు నచ్చినవారినే ఎంపిక చేసుకోవడం ఓ తంతుగా మారింది. ఇందుకు అరుణ్గోయల్ ఎంపిక ఓ తాజా ఉదాహరణ మాత్రమే. న్యాయశాఖ కొన్ని పేర్లు ఎంపిక చేసి ప్రధాని పరిశీలనకు పంపించడం, అంతిమంగా ప్రధాని ఆమోదం ద్వారా నియామకం జరిగే విధానమే ఇలాంటి అహేతుకమైన ఎంపికలకు వీలుకల్పిస్తోంది.
అందుకే ఈ విధానాన్ని సవాలు చేస్తూ, రాజకీయ జోక్యాలకూ, ప్రభుత్వాల అభీష్టాలకూ ఏ మాత్రం అవకాశమివ్వని, ఒక చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా ఈ నియామకాలు జరగాలని కోరుతూ కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై గతవారం రోజులుగా న్యాయస్థానం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో భాగంగా... ఒక కొలీజియం తరహా వ్యవస్థలో, ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి భాగస్వామ్యంతో ఈ నియామకాలు జరగాలన్న ప్రతిపాదనలూ, ప్రధానమంత్రిని సైతం ప్రశ్నించే శక్తిగా ఎలక్షన్కమిషన్ ఉండాలన్న అభిప్రాయాలూ న్యాయస్థానం నుండి అత్యంత బలంగా వెలువడుతుండగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మోడీ సర్కారు బరితెగింపునకు నిదర్శనం.
ఓ కీలకమైన అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉండగానే దానిపై నిర్ణయం తీసుకోవడం నైతికత కాదన్న ఇంగితమే లేకుండా పోయిందీ ఏలికలకు. నైతికవిలువలు, నీతినియమాలకంటే తమ రాజకీయ అవసారాలే వారికి ముఖ్యమైపోయాయి. అందుకే న్యాయస్థానం వెల్లడిస్తున్న అభిప్రాయాలను ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా, గంటల వ్యవధిలోనే అరుణ్గోయల్ను ఎన్నికల సంఘం గద్దెపై ప్రతిష్టించారు. ''ఒక ప్రభుత్వ అధికారి వీఆర్ఎస్ అభ్యర్థనను ఆమోదించడానికే కనీసం మూడు నెలలు పడుతుంది కదా..!'' అంటూ జస్టిస్ జోసెఫ్ ఆశ్చర్యం వ్యక్తం చేయడం ఇక్కడ గమనార్హం. అంతేకాదు, ''కేవలం 24గంటల్లోనే ఈ మొత్తం నియామక ప్రక్రియను ఎలా పూర్తి చేశారంటూ'' సుప్రీం ధర్మాసనమే విస్తుపోయింది. ఏలినవారి నీతిమాలిన తనానికీ, భారత రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల వీరి గౌరవం ఏపాటిదో గ్రహించడానికీ ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలీ..?! కాబట్టి విలువల్ని గాలికొదిలి, అధికారమే పరమావధిగా సాగుతున్న ఏలికల వ్యూహాలు ఉధృతమవుతున్న ఈ సమయంలో ప్రజలు జాగరూకతతో ఉండాలి. ఇప్పుడు నిబద్దతగల రాజకీయ చైతన్యం, బలమైన ప్రజా ఉద్యమాలు మాత్రమే మన రాజ్యాంగాన్నీ, దేశాన్నీ రక్షించగలవు.