Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మన్ కీ బాత్'' అంటూ చెప్పడమే తప్ప జనం ఘోష వినే అలవాటు మన మోడీ సార్కు మొదటి నుంచీ లేదు. వారి అడుగులకు మడుగులు ఒత్తే వారి సహచరులది అదే ధోరణి. ఇక మన ఆర్థిక మంత్రిది మరో బాట ఎందుకు అవుతుంది. సాదారణంగా బడ్జెట్ రూపొందించడానికి ముందు వివిధ వర్గాలవారితో సంప్రదింపులు జరపడం ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. దానిని అపహాస్యం చేస్తూ మొక్కుబడిగా కార్మిక సంఘాలతో ఆన్లైన్ సమావేశాన్ని నిర్వహించ తలపెట్టారు నిర్మలమ్మ. కానీ, సమయమే ఇవ్వని సమావేశాన్ని కార్మిక సంఘాలన్ని ఏకోన్ముకంగా సోమవారం బహిష్కరించాయి.
వాస్తకానికి 25నే కార్మిక సంఘాలకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం అందినందుకు కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కానీ, అంతర్జాల సమావేశానికి కేటాయించిన 75నిమిషాలు సమయం సరిపోదని అప్పుడే స్పష్టం చేశాయి. ఇందులో వివాదమేముంది కార్మిక సంఘాలు హాజరై తమ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచవచ్చు కదా అన్న సందేహం కలగడం సహజం. కానీ, ఆర్థిక మంత్రి తన బడ్జెట్ రూపొందించడానికి ముందే కార్మిక సంఘాలకు సమయాన్ని కేటాయించడంలో చతురత చూపించారు. మొత్తం కేటాయించిన సమయంలో ఆమె తొలిపలుకులకే సగం సమయం గడిచిపోతుంది. ఒక్కో కార్మికసంఘానికి మూడు నుంచి అయిదు నిమిషాలకన్నా ఎక్కువ సమయం దొరకదు. అంటే బడ్జెట్ రూపకల్పనకు ముందు జరగవలసిన ఈ సమావేశాన్ని యాంత్రికంగా మార్చేయాలని ముందే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని కార్మికసంఘాలు ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో స్పష్టంగానే చెప్పాయి. రైతాంగ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో కరోనాను సైతం లెక్క చేయకుండా రైతు నేతలతో ప్రత్యక్ష చర్చలు ఒకటికి పదిసార్లు జరిపారు. మరిప్పుడు కరోనా విపత్కర పరిస్థితులేమి లేవు. మరి ఇప్పుడు ఈ వర్చువల్ సమావేశం ఏర్పాటు చేయవలసిన అగత్యం ఏమిటని నిలదీశాయి. అయినా సర్కార్ స్పందించలేదు.
ఈ సమావేశాన్ని సీఐటీయూ, ఏఐటీయూసీ వంటి సంఘాలు బహిష్కరించక తప్పని పరిస్థితి. ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఫ్ుతో మాత్రమే విత్త మంత్రి చర్చలు జరిపారు. జాతీయ నైపుణ్యాభివద్ధి సంస్థ ప్రధాన కార్యనిర్వాహక అధికారికి, వ్యాపారవర్గాలకు ప్రాతినిధ్యం వహించే భారత వాణిజ్య, పారిశ్రామిక మండలి (ఫిక్కీ), భారత పరిశ్రమల మహాసమాఖ్య(సిఐఐ) ప్రతినిధులతో చర్చలకు మాత్రం ఆర్ధికమంత్రి తగినంత సమయమే కేటా యించారు. మోడీ ప్రభుత్వం సంపద సష్టించే కార్మిక వర్గాన్ని ఖాతరు చేయకూడదని గట్టిగానే నిర్ణయించు కున్నట్టు ఉంది. నాలుగు కార్మిక నిబంధనలను ఎలాగైనా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిని కార్మికసంఘాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. పార్లమెంటులో కూడా ప్రతిపక్షాలు, ముఖ్యంగా వామపక్షపార్టీలు ఈ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఏమైనా సరే శ్రమజీవుల మాట చెవినపెట్టకుండా కార్పొరేట్ల అనుకూల విధానాలను కొనసాగించడానికే మోడీ సర్కారు కంకణం కట్టుకుంది. కార్మిక వ్యవహారాలు చర్చించడానికి భారత కార్మికసంస్థ(ఐఎల్సి) సమావేశాలను 2015 నుంచి నిర్వహించిన దాఖలాలే లేవంటే ఈ సర్కారుకు కార్మిక సమస్యల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది.
పారిశ్రామిక సంబంధాలపై ప్రభావం చూపే ఏ అంశాన్ని మోడీ సర్కారు పరిగణించడమే లేదు. బ్యాంకులు, బీమా కంపెనీలవంటి ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రయివేటు పరం చేయడాన్ని కార్మికవర్గం వ్యతిరేకిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకోసం దేశవ్యాప్త సమ్మెలు జరిగినా, ఈ సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదు. ఒక్కో కార్మికసంఘానికి మూడు నిమిషాల సమయం మాత్రమే కేటాయించి సమావేశం ఏర్పాటు చేయడంవల్ల పెద్దప్రయోజనం ఏమీలేదని, అర్థవంతమైన చర్చ ఏమీ జరగదని కేంద్ర ప్రభుత్వానికి తెలియక కాదు. ఇటీవల కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపినా ఏ అంశంపైనా ఏకాభిప్రాయం కుదరనేలేదు. వ్యాపార, వాణిజ్య వర్గాలకు, బడా పెట్టుబడిదార్లకు శ్రామికులు సృష్టించిన సంపదను దోచి పెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యం కనక ఫలితం ఆశించడం కూడా దండగే. విద్యుత్ (సవరణ) బిల్లును ఉపసంహ రించాలన్న వాదన చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగానే తయారైంది. ఈ సమస్యలన్నింటినీ కార్మిక సంఘాలు లేవనెత్తుతాయని ఆర్థికమంత్రి కార్మిక సంఘాలతో సమావేశాన్ని తూతూ మంత్రంగా మార్చేశారు.