Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశ న్యాయవ్యవస్థ మీద ప్రజలకు అపారమైన నమ్మకం. తమను నేతలు దగా చేసినపుడో, ప్రభుత్వాధికారులు పీడించినపుడో, పోలీసుల వలనో, అసాంఘిక శక్తులనుంచో.. ఇలా సమస్త వ్యవస్థల నుంచీ తమకు అన్యాయం జరిగినపుడో న్యాయం కోసం సామాన్య జనం న్యాయ వ్యవస్థవైపు ఆశగా చూస్తారు. ఎంతో నమ్మికతో కోర్టు గడప తొక్కుతారు. కానీ, ఆ న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం కోల్పోయే ప్రమాదమిప్పుడు రోజురోజుకు పెరుగుతోంది. గోహత్యలను అడ్డుకుంటే ప్రపంచంలోని సమస్యలన్నీ పరిష్కారమవుతాయని గోవుల అక్రమ రవాణా కేసు విచారణ సందర్భంగా.. గుజరాత్లోని తాపీ జిల్లా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో జీవిత ఖైదుతో పాటు రూ.5లక్షల జరిమానా విధించింది. జడ్జి తన తీర్పును వెలువరిస్తూ ఆవు కేవలం జంతువు మాత్రమే కాదు, 68కోట్ల పవిత్ర స్థలాలకు, 33కోట్ల దేవత లకు నిలయమని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగలేదు ఆ న్యాయమూర్తి గోవధ చట్టాలను సమర్థించడం, ఆవుపేడతో రేడియేషన్ సమస్య రాదని సైన్స్ రుజువుచేసిందని, గోమూత్రం సర్వరోగ నివారిణి అని స్వయంగా 'శ్లోకాలు' పఠించారు. రాజ్యాంగాన్ని, చట్టాలను అనుసరించి చెప్పాల్సిన తీర్పులను పురాణాలు, కట్టుకథల ఆధారంగా చెప్పడం విస్తుగోల్పుతోంది. న్యాయ వ్యవస్థలోనూ తమ విభజన రాజకీయాలను జొప్పించి తాము వ్యతిరేకిస్తున్న సమూహాన్ని కాషా యానుకూల తీర్పులతో అకారణంగా, అన్యాయంగా బలిచేస్తున్నా రనడానికి ఇంతకంటే ఉదాహరణలేమి కావాలి?
దేశమంతటా అసహన మేఘాలు అలుముకుని ఉన్న కాలమిది. ఆ 'పరివారాని'కి నచ్చనిది తిన్నా, కట్టుకున్నా సహించలేని పరిస్థితులు మెడమీద కత్తిలా వేలాడుతున్న సమయమిది. కానీ, వాస్తవమేంటే గతం కంటే వీరికాలం లోనే 'గో' మాంసం ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయి. ఆ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నదీ వీరి సహచరులే. ఈ ప్రభుత్వాలు చేసే చట్టాలు కేవలం ఒకే వర్గానికే తప్ప, వారికి వర్తించవు. అయినా తరతరాలుగా ఈ దేశంలోని ఆహారపు అలవాట్లను వ్యతరేకించి చిచ్చు రేపడమే సంఫ్ు పరివార్ రాజకీయ దురుద్దేశం. ఈ విధంగా కుల, మత దురహంకార మంటలు రేపుతుంటే... అక్కడి ప్రభుత్వాలు ఆ మంటలార్పకుండా చోద్యం చూస్తు న్నాయి. 'కసాయి'మూకలు వాటితో చలి కాచుకోవడం ఆందోళనకరం. సైద్ధాంతికంగా తమకు వ్యతిరేక నేపథ్యం ఉన్న న్యాయమూర్తులను ఆ న్యాయవ్యవస్థచేతే వెంటాడి, వేధించే పాలకుల దుస్సాహసాలు ఢిల్లీ మూకదాడులపై విచారణకు ఆదేశించిన న్యాయమూర్తి ఉదంతంలో మనం చూశాం.
మనుషుల్ని, వారి ఆహారపు అలవాట్లని, సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించలేని సరికొత్త జాతీయవాదం మన ముందుకొచ్చింది. అసంఖ్యాకులైన భారతీయు లందరూ ఆంక్షలతో బతకాల్సిందే. దేశభక్తికి సరికొత్త నిర్వచనం ఇచ్చేసిన తరుణంలో ఏమి తింటే, ఏమి అంటే ఏమవుతుందోనన్న దిగులు సర్వత్రా నెలకొంది. దేశంలో ఎన్నికల వాతావరణం మొదలైన నేపథ్యంలో ఇంకెంత ఉన్మాదం చెలరేగుతుందో..! ఇంకెలాంటి ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందో? పౌర సమాజమంతా ఒక్కటిగా నిలబడి పోరాడితే తప్ప ఈ విష సంస్కృతిని అరికట్టలేం. 'న్యాయమో... రామచంద్రా' అని దేశం ఎదురుచూస్తున్నది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ గోరక్షణ పేరుతో గ్రామాల్లో ముఠాలుగా ఏర్పడి ముస్లింలు, దళితులపై పాశవిక దాడులకు పాల్పడి కొట్టి చంపుతున్నారు. బీజేపీ ఏలుబడిలోని హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనే మతోన్మాదుల దురాగతాలు అత్యధికంగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన గోమూకల హింసా ఘటనల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటంతో గోమూకలు మరింత విజృంభిస్తున్నాయి. ఇలాంటి తీర్పులు ఆ మూకలకు కొత్త శక్తిని అందిస్తాయి. మూకలు పాల్పడే వివిధ నేరాలకు విధించగలిగే శిక్షల గురించి భారతీయ శిక్షాస్మృతి చెబుతున్నది. కానీ, మూకదాడులకు ప్రత్యేకంగా ఉద్దేశించిన చట్టమేమీ లేకపోవడమే వారికి మరింత బలాన్ని ఇస్తోంది. ఇంతవరకు అలాంటి చట్టాలు లేకపోయినా ఇప్పుడు ఆ చట్టాల అవసరమూ చాలా ఉన్నదన్న విషయం ఈ తాజా తీర్పు స్పష్టం చేస్తోంది. దేశంలో మూకదాడులు ఒక కొత్త నియమంగా మారిపోయాయి. ఈ వాతావరణాన్ని ఎంతటి కఠినమైన చట్ట మైనా బద్దలు కొట్టగలదా అన్న అనుమానం కలగక తప్పదు. దాడులకు పాల్పడుతున్న వారిని ప్రశంసిస్తూ స్వయంగా కేంద్రమంత్రులే కార్యకర్తలను రెచ్చగొడు తుండటం, పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమైన నేపథ్యంలో చట్టాలు మాత్రమే సమస్యను పరిష్కరించగలవన్నది సందేహమే. సమాజంలో సర్వత్రా అలుముకున్న ఈ భయానక ధోరణిని నిర్మూలించడానికి ఇప్పుడు ప్రధానంగా కావల్సింది రాజకీయ చిత్తశుద్ధి మాత్రమే.