Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''బ్రిటిష్ రాజ్యం నుండి బిలియనీర్ల రాజ్యం'' అంటూ భారతదేశాన్ని నిర్వచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. అంటే ప్రజల రాజ్యం ఇంకా సాధించాల్సిన కర్తవ్యంగానే మిగిలి ఉంది. ఇది ఏ కమ్యూనిస్టులో, సామాజికవేత్తలో చెపుతున్న మాటకాదు. ప్రముఖ ఆర్థికవేత్తలు థామస్ పికెట్టీ, లుకాస్ చాన్సెల్ల విశ్లేషణాత్మక అధ్యయనం చెపుతున్న కఠోర వాస్తవం. ''భారత్లో ఆదాయ అంతరాలు, 1922-2014'' పేరిట వీరిరువురు విడుదల చేసిన అధ్యయన పత్రం ఈ దేశంలో సామాన్యులకు సంపన్నులకు మధ్య రోజు రోజుకు పూడ్చలేని అగాథంగా మారుతున్న ఆర్థిక అంతరాలను కండ్ల ముందుంచుతుంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పుకుంటున్న ఈ దేశంలో ఆ అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కుతున్నాయన్నదే ప్రశ్న..! థామస్ పికెట్టీ, లుకాస్ చాన్సెల్లు లోతైన అధ్యయనం ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెపుతోంది. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందడం లేదనీ, అధికాదాయ సంపన్నులు, కుబేరుల బొక్కసాల్లోకే సంపదంతా చేరిపోతుందని తేటతెల్లం చేస్తోంది. ఈ క్రమం ఇలాగే కొనసాగితే ఈ దేశ భవిష్యత్తేమిటీ? ఇక్కడ దేశ భవిష్యత్తు అంటే 1శాతంగా ఉన్న సంపన్నుల భవిష్యత్తా, లేక 99శాతంగా ఉన్న సామాన్యుల భవిష్యత్తా అన్నది భారత సమాజం తేల్చుకోవాలి.
డెబ్భై వసంతాలు పూర్తిచేసుకున్న స్వతంత్ర భారత ప్రస్థానంలో మొదట నుండీ అంతరాలు కొనసాగుతున్నప్పటికీ 80వ దశకం తరువాత ఈ అంతరాల వృద్ధిరేటు క్రమంగా పెరుగుతూ వచ్చింది. 90వ దశకంలో సరళీకరణ విధానాలు అమల్లోకి వచ్చాక ఇది అమాంతం పెరిగిపోయింది. ప్రపంచంలో సరళీకరణ విధానాలను అవలంబిస్తున్న అన్ని దేశాల పరిస్థితీ ఇదే. కాగా, మన దేశంలో ఈ అంతరాల వృద్ధిరేటు రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. అంటే భారత ప్రభుత్వాలు పాలకవర్గాల ప్రయోజనాలకు అవసరమైన విధానాలను, చట్టాలను రూపొందించి అమలు పరచడం మినహా భారత ప్రజలకు బాధ్యత వహించే స్థితిని దాదాపు కోల్పోతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ప్రభుత్వాలు ఎన్ని మారినా పాలనా విధానాలు మాత్రం మారని స్థితి కూడా మనకు స్పష్టమవుతుంది.
ఈ విధానాల ఫలితంగా ప్రజల శారీరక, మేధో శ్రమలు ఉత్పత్తి చేస్తున్న సంపదతో పాటు మన జాతీయ సంపదలు కూడా కొల్లగొట్టబడుతున్న తీరు దోపిడీ తీవ్రతను తెలియజేస్తున్నది. అంటే ఇక్కడ కేవలం శ్రమ దోపిడే కాదు, వనరుల దోపిడీ కూడా యథేచ్ఛగా సాగుతోంది. అనంతమైన జాతి సంపదను, ప్రజలందరికీ చెందాల్సిన సహజ సంపదను కూడా ఈ అధికాదాయ వర్గాలే తమ పాదాక్రాంతం చేసుకుంటున్నారంటే అది ఈ సరళీకరణ విధానాల వల్లనే... ప్రభుత్వాలను చేతిలో పెట్టుకుని, ప్రజలను నిర్వాసితులను చేసి, అడ్డుపడితే అణచివేసి, అవసరమైతే హత్యలు చేసి సకల సంపదలను తమ కోశాగారాలకు తరలించుకుపోతున్న కార్పొరేట్ శక్తుల కాలాన్ని మనం చూస్తున్నామంటే, అది ఈ ప్రభుత్వాల వల్లనే... ఈ సంపదను చట్టబద్ధంగా, సమతుల్యంగా ప్రజలకు అందించగలిగితే ప్రతి పౌరుడు సంపన్నుడే అవుతాడు. ప్రజలందరూ తమ జీవితాలను గౌరవప్రదం చేసుకుంటారు. కూడు, గూడు, నీడ, విద్య, వైద్యం దేనికీ కొదువలేని మంచి జీవితం ప్రతి మనిషికీ అందుబాటులోకొస్తుంది. కానీ జరుగుతున్నదేమిటీ?
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా బట్టబయలైన పలు నివేదికలు విశ్వసంపదలో సగభాగం కేవలం ఎనిమిది కుటుంబాలు గుప్పిట పెట్టుకున్నాయని వెల్లడించాయి. దేశంలో మూలుగుతున్న నల్లడబ్బు, చెలామణీలో ఉన్న లక్షలాది కోట్ల హవాలా డబ్బు, దొంగ కరెన్సీ, అనేక విలువైన డాక్యుమెంట్ల ఉత్పత్తి, బ్యాంకు, షేర్ట్రేడ్ స్కామ్లు, మాఫియా సంపదలు, తెలివైన బ్యాంకు దోపిడీలు, ఆర్థిక నేరాలు, ఇంకా అనేక తప్పుడు మార్గాల ద్వారా పొందే సంపాదన ఇవన్నీ ఊహకైనా అందని మొత్తాలు. మన జీడీపీ పెరుగుదలకంటే ఈ అక్రమ సంపద పెరుగుదల పదిరెట్లు ఎక్కువుంటుందని ఆర్థిక నిపుణుల అంచనా..! ఈ సంపద ద్వారా సంక్రమించే బలం దుర్భేద్యమైనది. అది ప్రభుత్వాలనే శాసిస్తుంది, సాధిస్తుంది. ఈ ప్రభుత్వాలు ఈ దోపిడీ, పీడనలను ఆమోదయోగ్యం చేయడమే కాదు, సంపద పంపిణీలో అడుగడుగున అవినీతికి, అసమతుల్యతకు పాల్పడుతున్నాయి. అందుకే దేశ సంపద ఎంత పెరుగుతున్నా ఈ అంతరాలు మాత్రం సమసి పోవడం లేదు. పెరుగుతున్న సంపదలో సామాన్యుల వాటా పెరగడం లేదు.
ఈ అన్యాయాన్ని, అవినీతిని సహిస్తున్నంత కాలం ఈ అక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ అంతరాలు పెరుగుతూనే ఉంటాయి. సమస్త వనరులను తమ స్వార్థానికి సరుకులుగా మార్చి సంపదలు పోగేసుకుంటున్న ఈ దుర్నీతిని అడ్డుకోవాలి. దీనిని సహించడం కూడా ప్రోత్సహించడమే అవుతుందని గుర్తించాలి. మూలాలు కూలిపోతుంటే పట్టించుకోకుండా వాటి కింద పడి ఉన్న దేహాలను చూసి దుఃఖిస్తే ప్రయోజనం ఏమిటి..!? వినాశనం విషమించకముందే మేల్కొనడం నేడు మానవాళి ముందున్న కర్తవ్యం.