Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులను పెంచేందుకు ఎంతకైనా తెగిస్తున్నది. ఒకవైపు ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకుంటూనే మరోవైపు ఆదాయం పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నది. రాష్ట్ర విభజనకు ముందే కొన్ని ఏండ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదాయం కోసం మద్యం అమ్మకాలను ఆశ్రయించటం ఆనవాయితీగా మారింది. రాష్ట్రాన్ని ఏ పార్టీ పరిపాలిస్తున్న దన్న దానితో నిమిత్తం లేదు. ఆదాయమే పరమావధిగా మద్యం అమ్మకాలు ప్రోత్సహించిన విషయం తెలిసిందే. తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్న టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఆదాయం కోసం మద్యం అమ్మకాలకు కక్కుర్తి పడుతున్నది. బంగారు తెలంగాణ సంగతేమోకానీ మందుబాబుల తెలంగాణగా మాత్రం వేగంగా మారుతున్నది. తెలుగుదేశం, కాంగ్రెసు బాటలోనే టీఆర్ఎస్ పాలకులు కూడా నడుస్తున్నారు. అందులో భాగంగానే సీసాలో పీసా చట్టాన్ని కూడా బంధించేందుకు వెనుకాడలేదు. ఇప్పటికే మద్యం షాపులు ఇందుగలడందులేడని సందేహము వలదన్నట్టుగా విస్తరించాయి. పాఠశాలలు, వైద్యశాలలు, దేవాలయాలన్న తేడా లేదు. మందు సర్వాంతర్యామిగా మారింది. ఇప్పుడు గిరిజన ప్రాంతాలనూ వదలలేదు. గిరిజన ప్రాంతాలలో మద్యం షాపులకు అవసరమైన డిపాజిట్ కట్టగలవారు దొరకరు. మద్యం షాపుల లైసెన్సులు కూడా గిరిజనులకే ఇవ్వాలన్న చట్టపరమైన ఆంక్షలే ఇందుకు కారణం. కానీ కాంట్రాక్టర్ల ఎత్తులు తక్కువేమీ కాదు కదా! కాంట్రాక్టర్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధమంటున్న తెలంగాణ పాలకులు కూడా ఇందుకు తోడయ్యారు. పైగా మద్యం అమ్మకాలు ఎంత పెరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఆదాయమని రాష్ట్ర పాలకులు ఆవురావురుమని ఎదురుచూస్తున్నారాయే! ఇంకేముంది. గిరిజనులను ముందుపెట్టి, కాంట్రాక్టర్లు డిపాజిట్టు కట్టి, బినామీలుగా రాజ్యమేలుతున్నారు. మద్యం షాపులు కైవసం చేసుకుంటున్నారు. సాగునీటి సంగతేమోగానీ... మందు పారించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను కూడా వదలలేదు.
ఇప్పటికే ఉమ్మడి రాష్ట్ర చివరి బడ్జెట్లో వేసిన అంచనాకన్నా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఆశించిన ఎక్సైజ్ ఆదాయం చాలా ఎక్కువ. ఉమ్మడి రాష్ట్ర చివరి బడ్జెట్లో రూ.7500 కోట్ల ఎక్సైజ్ ఆదాయం వస్తుందని అంచనా వేయగా ఇప్పుడు 2017-18 తెలంగాణ బడ్జెట్లో రూ.9వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. దీనిని ఇప్పుడు రూ.15వేల కోట్లకు పెంచాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఎక్సైజ్ ఆదాయం కన్నా రెట్టింపు చేయాలనే ప్రయత్నం. అంటే తెలంగాణ ధనిక రాష్ట్రంగా వెలుగొందాలంటే జనం మద్యం మత్తులో తూగుతూ ఉండాలన్నమాట! ఇంతకన్నా బాధ్యతా రాహిత్యం మరొకటి ఉండదు.
పేద జనాన్ని మద్యం మత్తులో ముంచి, వారి పరిమిత ఆదాయాన్ని కాజేస్తున్నదీ ప్రభుత్వం. అసలే పౌష్టికాహార లోపంతో ఉన్న పేదలు, మద్యపానానికి బానిసలు కావటంతో ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. అకాల మరణాలు పెరుగుతున్నాయి. ఒంటరి మహిళల సంఖ్య పెరుగుతున్నది. మరోవైపు సంక్షేమ పథకాల పేరుతో పేదలను మభ్యపెట్టి ఓట్లు దండుకుంటున్నది. పేదల ఆరోగ్యాలను ఫణంగాపెట్టి పోగేస్తున్న ఆదాయంతోనే పేదల సంక్షేమం పేరుతో పథకాలు ప్రకటిస్తున్నది. ఈ పేరుతో కేటాయిస్తున్న నిధులకు కూడా ఆచరణలో కోత పెడుతున్నది. 2015-16 బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే సాంఘిక సంక్షేమం కేటాయింపులలో సగం నిధులు దారి మళ్ళించారు. వైద్య ఆరోగ్యశాఖ కేటాయింపులలో మూడోవంతు నిధులు ఖర్చు చేయలేదు. ఇక 2016-17 బడ్జెట్ కేటాయింపులు ఏ మేరకు ఖర్చు చేసారో తెలియాలంటే రానున్న బడ్జెట్ లెక్కలు చూడవల్సిందే. రాష్ట్ర పాలకులకు ఆదాయం పెంచుకోవటం మీద ఉన్న దృష్టి ప్రజల ఆరోగ్యం మీద, సంక్షేమం మీద లేదు. ఇప్పుడు మందుబాబులకు మద్యం షాపులు రాత్రి 11 గంటల వరకూ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ షాపింగ్ మాల్స్లలో కూడా మద్యం అమ్మకాలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. అంటే.. ఎవరైనా... ఎప్పుడైనా... ఎలాంటి బెరుకూ లేకుండా మద్యం కొనుగోలు చేయవచ్చునన్న మాట. జనాభా ప్రాతిపదికన మంచినీళ్ళు, పాలు దొరుకుతాయో లేదో గానీ మందుషాపులు మాత్రం అందుబాటులో ఉంచారు.
అభివృద్ధి పేరుతో ఇప్పటికే క్లబ్బులూ, పబ్బుల సంస్కృతి విస్తరిస్తున్నది. యువత మీద దీని ప్రభావం పెరుగుతున్నది. ఇది మద్యం దగ్గర ఆగటం లేదు. గంజాయి, డ్రగ్స్ సంస్కృతి విచ్చలవిడిగా విస్తరిస్తున్నది. గంజాయి, డ్రగ్స్ ప్రభావానికి బానిసలయ్యే యువతకు మద్యం తొలిమెట్టు. ఇక్కడే తగిన నియంత్రణ చేయగల్గితే యువత శక్తి నిర్వీర్యం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ ఆదాయం మత్తులో ఉన్న పాలకులకు యువత భవితవ్యం పట్టదు. ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది. ప్రజలు ఈ విషయాన్ని గమనించినప్పుడే... పాలకులను ప్రశ్నించగల్గినప్పుడే... సామాజిక భద్రత సాధ్యం.