Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రధాని మోడీ 67వ జన్మదినోత్సవం దేశవ్యాపితంగా అత్యంత అట్టహాసంగా జరిగింది. దేశ దేశాల నుండి నేతలు వారి ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలందించారు. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం అభినందనల వర్షం కురిపించారు. కార్యకర్తలైతే ఎక్కడికక్కడ ఉత్సవాలే జరిపారు. కానీ ప్రధాని మాత్రం నలభై ఐదు వేల కుటుంబాల భవిష్యత్తును జల సమాధి చేసే ప్రక్రియను సంపూర్ణంగావిస్తూ ''సర్దార్ సరోవర్ ప్రాజెక్టును'' జాతికి అంకితం చేసారు. ఈ విధంగా ఆయన తన పుట్టినరోజు నిర్వాసితుల బతుకులను జలసమాధి చేసింది. గుజరాత్లోని వడోదర జిల్లా ధబోరులో ఆయన ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న సందర్భంలోనే ఈ డ్యామ్ ప్రారంభ వేదికకు కొద్ది మైళ్ల దూరంలోనే వేలాదిమంది ప్రజలు దీనిని నిరసిస్తూ జల సత్యాగ్రహాలకు పూనుకోవడం గమనార్హం.
నిజానికి ప్రాజెక్టులు అభివృద్ధికి ఆనవాళ్లు. మనదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చెప్పినట్టు ఆధునిక దేవాలయాలు. నర్మదా నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టుకు కూడా నెహ్రూనే శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల బహుళ ప్రయోజనాలున్న మాట కూడా వాస్తవం. గుజరాత్తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో వేల గ్రామాలకు తాగునీటి అవసరాలతో పాటు లక్షలాది ఎకరాలకు సాగునీరు లభిస్తుందనీ, ఇక్కడ నిర్మించిన రెండు విద్యుత్ కేంద్రాల ద్వారా 17 వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందనీ, పై నాలుగు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలతో పాటు విద్యుత్ కొరతను కూడా ఈ ప్రాజెక్టు తీరుస్తుందనీ ప్రభుత్వం చెపుతోంది. నిజంగా ఇలా జరిగితే మంచిదే. అప్పుడు ఇది నిస్సందేహంగా అభివృద్ధికి ఆలంబనే అవుతుంది. కాబట్టి ప్రజలందరూ ముక్తకంఠంతో దీనిని హర్షించాల్సిందే.. కానీ నిరసిస్తున్నారు ఎందుకు..!? అసలు ఈ అభివృద్ధి మాటున జరుగుతున్న విధ్వంసం మాటేమిటి? ఇవే జవాబు దొరకని ప్రశ్నలుగా మిగులుతున్నాయి..! ''ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురైనన్ని అడ్డంకులు, ఆందోళనలు ప్రపంచంలో మరే ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురుకాలేదు'' అన్న ప్రధాని మాటల్లోనే ఈ ప్రాజెక్టు పట్ల ఎంత పెద్ద నిరసన ఉందో తెలిసిపోతున్నది.
1961 ఏప్రిల్ 5న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు 56 ఏండ్ల తర్వాత పూర్తయి నేటి ప్రధాని మోడీ చేతిలో ప్రారంభానికి నోచుకుందంటే దీని చుట్టూ ఎన్ని వివాదాలు, ఎంత నిరసన, ఎంత పోరాటం ఉందో అర్థం చేసుకోవచ్చు. నీరు, విద్యుత్ పంపకాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య వచ్చిన విభేదాలు మొదలు సామాజిక కార్యకర్త మేథాపాట్కర్ నేతృత్వంలోని నర్మదా బచావో ఆందోళన (ఎన్బీఏ) పోరాటాల వరకు కోర్టుల ''స్టే''లు, అనుమతులు, ట్రిబ్యునల్స్ ఏర్పాట్లు వాటి తీర్పుల మధ్య ఎట్టకేలకు 1980లో ప్రారంభమైన ప్రాజెక్టు నిర్మాణం నేటికి పూర్తయింది. ఇంతటి సుదీర్ఘ ప్రహసనంలో కూడా ప్రజల నిరసనకు పరిష్కారం లభించకపోవడమే ఇక్కడ విషాదం.
ఏ అభివృద్ధి అయినా ప్రజల జీవనోపాధిని దెబ్బతీయకుండా జరగాలి. అనివార్యమైనప్పుడు తక్కువ నష్టంతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా చూడాలి. పునరావాసం - పరిహారం అనేవి కోల్పోయిన జీవితాన్ని తిరిగిచ్చేలా ఉండాలి. ఇందుకోసం ఉన్న చట్టాలన్నీ అమలు చేయాలి... కానీ జరుగుతున్నదేమిటి..? నిజానికి ప్రజల జీవికకు ఏ లెక్కన వెల నిర్ణయిస్తారు..? భూమికో, ఇంటికో ఇస్తారు పరిహారం. (ఈ ప్రాజెక్టులో అది కూడా ఇప్పటికీ ఇవ్వలేదు). మరి భవిష్యత్తు జీవికకు హామీ ఎలా ఇవ్వగలరు. జీవనాధారమైన కొండ, అడవి, ఆరుగాలపు చేత, పశువుల మేత, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు..? పుట్టిన ఊరిలో తనదైన సంస్కృతితో గౌరవంగా బతికే మనిషి ఇప్పుడు ఆ జీవితంలో నుండే లేపేస్తే ఎక్కడ బతకాలి..! ఎట్లా బతకాలి..? దీనికి ఏ జీవోలు సమాధానం చెప్పగలవు..? ఏ చట్టాలు పరిష్కారం చూపగలవు..?
అభివృద్ధి చావుకు నమూనా కావద్దన్నదే ఇక్కడ ప్రజల అభిమతం. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన ఆదివాసీ కుటుంబాలు చేసిన త్యాగానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపి చేతులు దులుపుకున్నారు. దేశాభివృద్ధికి వారు చేసిన త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ మరచిపోదని స్వాంతన పలికారు. కానీ, వారి పునరావాసం గురించీ, పరిహారం గురించిన ప్రస్తావనే ఆయన ప్రసంగంలో రాలేదు. మరి వారి జీవితాలేం కావాలి..? అభివృద్ధి ప్రజలకు ఉరిలా మారకూడదు కదా..! అభివృద్ధికి నిర్వాసితుల జీవితాలను బలి తీసుకోకూడదు కదా.. ఏ ప్రాజెక్టులయినా, ఏ అభివృద్ధి అయినా ప్రజా ప్రయోజనాల కోసమే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం కాకూడదు. నిర్వాసితులూ ప్రజలే... ముందు వారికి తిరిగి జీవితాన్నివ్వడంతో అభివృద్ధి మొదలు కావాలి. అభివృద్ధి మానవీయ ముఖంతో సాగాలి. ఇది మరిచి ''నా వన్నీ పెద్ద పెద్ద స్వప్నాలే'' అంటూ అభివృద్ధిని గురించి ఆయన ఎంత పెద్ద కలలు కన్నా ఆ కలలు సాకారమయ్యే నాటికి అక్కడన్నీ అంతులేని కన్నీటి జాడలే ఉంటాయని ప్రధాని గుర్తించాలి. లేదంటే నిరసన పోరాటరూపం తీసుకుంటుంది. ఎందుకంటే బతుకు చితి మీదకు నెట్టివేయబడు తున్నప్పుడు, ఏ మనిషీ సజీవదహనానికి సిద్ధపడడు. ప్రతిఘటిస్తాడు.