Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదపుటంచుకు చేరి నగరం గ్యాస్ ఛాంబర్గా మారడానికి వాతావరణ పరిస్థితులకంటే పాలకుల చిత్తశుద్ధి లోపమే ప్రధాన కారణం. రెండేండ్ల క్రితం వాతావరణం విషతుల్యమైనప్పుడు ఢిల్లీ వాసులు ఆగ్రహావేశాలతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడతామని ఢిల్లీ ప్రభుత్వంతోపాటు కేంద్రమూ హామీ ఇచ్చింది. ఆ పూటతోనే సదరు ప్రకటనలకు కాలం చెల్లింది. గత వారం రోజుల నుంచీ పొగమంచు, వ్యర్ధాలు కాల్చిన పొగ, కాలుష్యం రాజధానిపై ముప్పెట దాడి చేయడంతో వాతావరణంలో విషం పరాకాష్టకు చేరుకుంది. ఒకటి రెండు రోజుల్లో మరింత ప్రమాదభరితంగా మారుతుందన్న హెచ్చరికలు వెలువడు తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాయు నాణ్యతా సూచి ప్రకారం 500 పాయింట్లు గరిష్ట స్థాయి కాగా ఇప్పటికే 487 పాయింట్లకు కాలుష్యం చేరింది. అదే జరిగితే కార్ల సరి-బేసి సంఖ్యల విధానం, నగర పరిధిలో కొత్త నిర్మాణాలపై నిషేధం అమల్లోకొస్తాయి. కాలుష్యం ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. రాజధాని ప్రాంతం మొత్తం వ్యాపించింది. చుట్టుపక్కనున్న హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని ప్రాంతాలకూ వ్యాపించింది. పెరుగుతున్న కాలుష్యంపై సోమవారం సుప్రీం కోర్టు ఢిల్లీ, యూపీ, పంజాబ్, హర్యానా, రాష్ట్రాలకు నోటీసులిచ్చింది. కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. పాలకులు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం. నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, గుర్గావ్ తదితర ప్రదేశాలు కాలుష్యం ధాటికి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కాలుష్యం ప్రమాదస్థాయికి చేరినందునే కేజ్రీవాల్ సర్కారు వారం రోజులపాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రజలు ఆరుబయట తిరగవద్దంటూ హెచ్చరిస్తోంది. పొగమంచు, కాలుష్యంతో ఢిల్లీలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. శ్వాసకోస, హృద్రోగులు అనుభవిస్తున్న నరక యాతన మాటల్లో చెప్పలేం.
హెల్త్ ఎమర్జెన్సీ స్టేట్గా ఢిల్లీ మారిన నేపథ్యంలోనూ కేంద్రం రాజకీయాలకు పోవడం దుర్మార్గం. అంతా కేజ్రీవాల్ ప్రభుత్వానిదే బాధ్యత అంటోంది. అధికారాల విషయానికొచ్చేసరికి తన చేతిలోని లెఫ్ట్నెంట్ గవర్నర్ను ఉసిగొల్పి వివాదం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారం దగ్గరకొచ్చేసరికి తన పని కాదని తప్పుకోవడం మోడీ సర్కారుకు తగని పని. కేజ్రీవాల్ సర్కారు సైతం రాజకీయ కోణంలో కాకుండా ప్రజల సంక్షేమం, రక్షణపై దృష్టి నిలపాలి. ఏటా శీతాకాలంలో ఢిల్లీ వాసులకు వాతావరణ సమస్యలు ఎదురవుతాయి. ఢిల్లీ కాలుష్య కబంధ హస్తాల్లో చిక్కుకుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), సుప్రీంకోర్టు, హైకోర్టు వంటివి తరచూ ప్రభుత్వాలకు మొట్టికాయలు వేస్తూనే ఉన్నాయి. కాలుష్య నియంత్రణ కోసం దీపావళి రోజున బాణసంచా కాల్చడంపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. ఈ విషయాన్నీ కొందరు బీజేపీ ప్రబుద్ధులు మతం కోణంలో చూపి వివాదం చేయాలని చూశారు. ఈ కాలంలో హర్యానా, పంజాబ్లో ఖరీఫ్ పంటల నూర్పిళ్లు పూర్తవుతాయి. పంట వ్యర్ధాలను రైతులు తగలబెడతారు. దాంతో పొగ ఢిల్లీని కమ్ముతోందని గుర్తించారు. గతంలో కూలీలు పంటలు కోసినప్పుడు వ్యర్ధాలు తగలబెట్టడం అంతగా లేదు. యాంత్రీకరణ వలన వ్యర్ధాలు అధిక పరిమాణంలో పోగుబడుతున్నాయి. వ్యర్ధాలను తగలబెట్టకుండా భూమిలో పాతిపెట్టాలని ఎన్జీటీ ఆదేశించినా అది రైతులకు అదనపు ఆర్థిక భారం అవుతోంది. ప్రభుత్వాలు వ్యర్ధాలను సేకరించి వేరేగా ఉపయోగించాలి. లేకపోతే రైతులకయ్యే ఖర్చును సర్కారే భరించాలి. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఢిల్లీ వాసులను రక్షించేందుకు కేంద్రం ఆయా రాష్ట్రాలతో చర్చలూ జరపట్లేదు.
కాలుష్యాన్ని అదుపు చేసేందుకు పొరుగునున్న చైనా ఉద్యమస్ఫూర్తితో శరవేగంగా కఠిన చర్యలు చేపట్టగా, మన పాలకులు న్యాయస్థానాలు, చట్టబద్ధ సంస్థలు ఆదేశించినా ఉలకట్లేదు. రోడ్లపై దుమ్ము, వాహనాలూ పరిశ్రమలూ ఢిల్లీ కాలుష్యానికి కారణమని పలు అధ్యయనాల్లో తేలింది. పరిష్కారాలూ ఉన్నాయి. వాటి అమల్లోనే చిత్తశుద్ధి లోపిస్తోంది. రోజురోజుకూ ఢిల్లీలో పెరుగుతున్న వాహనాలపై ఏ మాత్రం నియంత్రణ లేదు. వాటిని లాభాపేక్షతో విక్రయిస్తున్న కార్పొరేట్ కంపెనీల మనసు నొప్పించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. డీజిల్, పెట్రోల్ నుంచి సీఎన్జీకి వాహనాలను మార్పు చేయాలని ఎన్జీటీ ఆదేశించినా స్వల్ప ఫలితాలే వచ్చాయి. కాలుష్య పరిశ్రమలను మూసేయాలన్న సూచన బుట్టదాఖలే. పరిశ్రమలను దూర ప్రాంతాలకు తరలించాలన్న సూచన కూడా అంతే. చాలా ప్రాంతాల్లో తారు రోడ్ల నిర్మాణం రోడ్డు అంచుల వరకూ జరగదు. వ్యాక్యూమ్ క్లీనింగ్ చేయాలని, రోడ్లను తడిపి దుమ్మూ ధూళీ లేవకుండా చూడాలన్న సలహాలను ప్రభుత్వాలు బేఖాతరు చేస్తున్నాయి. ఢిల్లీ అంత తీవ్రంగా లేనప్పటికీ వాయుకాలుష్యం భారతదేశంలోని ఇతర నగరాల్లో కూడా తీవ్రంగానే ఉంది. ఏటా వేలాదిమంది ప్రాణాలను కబళిస్తున్న కాలుష్యంపై ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కదలాలి. ప్రజలను వాయు కాలుష్యం బారి నుంచి రక్షించాలి.