Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ దేశంలో కులం ఒక రాచపుండని పదే పదే నిరూపితమవుతున్నది. సమాజం ఆధునికతను సంతరించుకునే కొద్దీ క్రమేణా కనుమరుగవ్వాల్సిన కులం కమలనాధుల ఏలుబడిలో వేయి తలల విషనాగై బుసలుకొడుతున్నది. మొన్న మహారాష్ట్రలో దళితులపై జరిగిన దాష్టీకం మరువక ముందే నిన్న గుజరాత్లో ఖాకీలు ఓ దళితునితో బూట్లు నాకించిన అమానవీయ సంఘటన బీజేపీ పాలనా తీరుకు అద్దం పడుతున్నది. ''ఓ కులమా నీవెంతటి కసాయివే..'' అంటారు డాక్టర్ అంబేద్కర్. ఎందుకంటే.. ఒకరికి అధికారమిచ్చి, సంపదలూ.. సౌభాగ్యమిచ్చి, సామాజిక హోదానిచ్చి అనేకులకు బానిస సంకెళ్లు వేసింది కులం. మనిషి నుండి మనిషిని చీల్చి ఒకనికి దైవత్వాన్నిచ్చి అనేకులకు మనిషి హోదానే నిషేధించింది కులం. కనుకనే ఈ కుల వ్యవస్థను కూకటివేళ్ళతో పెకరించాలన్నారు అంబేద్కర్. కుల మతాలకతీతమైన లౌకిక వ్యవస్థను కలగన్నాడు. కుల వ్యవస్థను పెంచి పోషించే మనుధర్మాన్ని మట్టుబెట్టాలన్నాడు. కానీ ఆ మనుధర్మానికే పట్టం కట్టే కుట్రలు జరుగుతున్నాయి నేడు. ఒక వైపు ఓట్ల కోసం అంబేద్కర్ జపం చేస్తూనే, ఆయన నిలువెత్తు విగ్రహాలు ఆవిష్కరిస్తూనే, సామాజిక సమానత్వంతోనే బలమైన జాతి నిర్మాణం చేయవచ్చన్న ఆయన ఆశయాలకు నిలువునా తూట్లు పొడుస్తోంది హిందూత్వ పరివారం. ఇది ఆయనను అంగీకరించినట్టు నటిస్తూనే నిర్మూలించే కుట్ర అని మోడీ హయాంలో దేశంలో జరుగుతున్న సంఘటనలనేకం నిరూపిస్తున్నాయి.
కేంద్రంలో తిరుగులేని ఆధిక్యంతో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నది మొదలు దేశవ్యాపితంగా ఈ హిందూత్వ శక్తుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మైనారిటీలపై దాడులు దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. మహారాష్ట్రలో దళితుల ఆత్మగౌరవ స్ఫూర్తికి ప్రతీకగా ప్రతిఏటా వేడుకగా జరుపుకునే శాంతియుత ప్రదర్శనపై సంఫ్ుపరివారం విరుచుకుడి వీరంగమాడిన ఘటన ఇంకా అట్టుడుకుతుండగానే ప్రధాని సొంతరాష్ట్రమైన గుజరాత్లో దళితుడైన హర్షద్ యాదవ్తో పోలీసులు బూట్లు నాకించిన ఘటన దేశాన్ని కలవరపెడుతున్నది. ఇద్దరి మధ్య గొడవను ఆపడానికి ప్రయత్నించడమే అతని నేరమైంది. పైగా అతడు దళితుడు కావడం అంతకంటే నేరమైంది. ఈ కాషాయ మూకల పైత్యం ఖాకీలకూ ఎక్కిందేమో.. అతనిచే వరుసగా స్టేషన్లో ఉన్న ఖాకీలందరి కాళ్లు మొక్కించడమే గాక బూట్లు నాకించారు. ఇదేమి న్యాయం..? ఇది ఏ చట్టంలో ఉంది..!? ఇంత జరిగినా... ఈ ఘటనల పట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నా బీజేపీ ప్రభుత్వాల్లో ఉలుకూ పలుకూ లేకపోవడం, ప్రత్యేకించి ప్రధాని యధాప్రకారం తన మౌనాన్నే ఆశ్రయించడం వారి ఉద్దేశాలను అర్థంగావిస్తోంది.
గత మూడున్నరేండ్లుగా ఒక వైపు దళితులు, మరోవైపు ముస్లిం మైనారిటీలపై ఈ దాడులు, దుర్మార్గాలు నిత్యకృత్యమయ్యాయి. జాతీయ నేరగణాంక సంస్థ నివేదికలు దీనిని రుజువుచేస్తున్నాయి. ఈ వరుస ఉదంతాలు ప్రజలను భ్రయబ్రాంతులకు గురిచేస్తుండగా, ఈ ఉదంతాలపై కేంద్రం ఏనాడు నోరు విప్పకపోవడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. కేంద్రం స్పందించక పోవడంలోని అంతరార్థమేమిటి..? ఈ దేశంలో దళితులుగా పుట్టడమే నేరమా..? సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి ప్రశ్నిస్తున్నట్టు దళితులు ఈ దేశంలో భాగం కాదా..? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులను భారతీయులుగా గుర్తించడం లేదా..!? అంబేద్కర్ చెప్పిన సమానత్వ స్ఫూర్తికి సంఫ్ు పరివార్ వ్యతరేకమా..? తిరిగి ఈ దేశాన్ని మధ్య యుగాలకు తీసుకెళతారా..? మనుధర్మాన్ని పునఃప్రతిష్టిస్తారా..? చారిత్రకంగా అణచివేయబడిన దళితుల్లో ఇప్పుడు పెరుగుతున్న చైతన్యం అందుకు ఆటంకం అని భావిస్తున్నారా..? అందుకే వ్యూహాత్మకంగా దళితులపై అణచివేత, వివక్ష ధోరణులను అవలంబిస్తున్నారా..? బీజేపీ ప్రభుత్వ తీరు ఈ అనుమానాలకు ఆస్కారమిస్తుండగా, జరుగుతున్న ఘటనలు వాటికి మరింత బలం చేకూరుస్తున్నాయి. తాజా ఘటనలో హర్షద్ కులం గురించి అడిగి మరీ తాను దళితుడనని చెప్పిన వెంటనే క్షమాపణలు చెప్పించుకోవడం, చట్టవిరుద్ధంగా కాళ్ళు మొక్కించుకోవడం, బూట్లు నాకించుకోవడం ఎంత అమానుషం..! ఇది ఎంతటి అమానుషమో, ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నా కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాల నుండి కనీస స్పందన లేకపోవడం అంతకంటే అమానుషం.
ఈ అమానుషాలను ప్రజలు గమనిస్తున్నారు. వీటినే కాదు, తమ అధికారం కొనసాగింపునకు ప్రజల హృదయాలను గెలవలేక విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రజల్లో వైషమ్యాలను సృష్టించడంపైనే ఆధారపడుతున్న అధికార పరివారం తీరుతెన్నులను అర్థం చేసుకుంటున్నారు. ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తి, నిరసనల్లో పాల్గొంటున్న తీరే ఇందుకు నిదర్శనం. ఇది ప్రజాగ్రహంగా మారకముందే ఏలికలు కండ్లు తెరవాలి. భారతీయ సమాజంలోని సమస్త శ్రేణులనూ సమానత్వంలోకి, సాధికారతలోకి తేవాలన్న బాధ్యతను మరిచి వ్యవహరిస్తున్న ప్రభుత్వం, ఇందుకోసం రెండువందల ఏండ్లుగా ఈ దేశంలో సాగుతున్న సాంఘిక, రాజకీయ ప్రయత్నాలను, ఉద్యమాలను గుర్తెరిగి నడుచుకోవాలి. అమానవీయ కుల వివక్షను ఇంకా సజీవంగా ఉంచాలన్న వ్యూహాలు ఎంత నిజమో, వాటికి ప్రజల ప్రతిఘటన కూడా అంతే నిజమని గుర్తించాలి. లేనట్టయితే ఆదరించి అధికారం ఇచ్చిన ప్రజలే అధఃపాతాళంలో పడేస్తారు...