Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కసరత్తు మొదలు పెట్టింది. అది ప్రజల ఆశలను తీరుస్తుందా? పాలకుల ఆకాంక్షలను నెరవేరుస్తుందా! పాలకుల ప్రాధాన్యతలకు ప్రజల కోరికలకు సహజంగానే సాపత్యం కుదరదు. కాబట్టి ప్లాన్ వన్ ప్లాన్ టూ తయారు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్లాన్ వన్తో ఓటర్లను సంతృప్తి పరచాలి. బ్యాలెన్స్ చేసి బ్యాలెట్ పెట్టె దాకా తీసుకువెళ్లాలి. అది కుదరకపోతే, అసంతృప్తి హద్దులు దాటితే, ప్లాన్ టూ ప్రవేశపెడతారు. దానిపేరే విజన్ 2024. కలల బడ్జెట్, భారీ బడ్జెట్, బడుగుల బడ్జెట్, ఉపాధి బడ్జెట్ అని ఊదరగొట్టడం షురూ అయ్యింది. గతంలోకి తొంగిచూస్తే అసలు సంగతి అర్థమవుతుంది. బడ్జెట్ బండారం బయటపడుతుంది. గత నాలుగేండ్ల బడ్జెట్ అంచనాలు ఆకాశంవైపు చూస్తే అంకెలు నేలచూపు చూశాయి. పాలకులు సవరణలు చేసుకొని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్రం నుండి వస్తాయి అనుకున్న నిధులు రాలేదు. స్వంత వనరులు పెరుగుదలలో స్పష్టత రావాలి. సంజాయిషీలతో సరిపెట్టుకున్న పాలకులు ఈ బడ్జెట్లో ఏం చెబుతారు అనేది ప్రశ్నార్థకమే.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,49,646 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్వంత ఆదాయం ద్వారా రూ.69,220.37 కోట్లు వస్తాయని అంచనా వేసుకున్నారు. కానీ ఈ ఎనిమిది నెలల కాలంలో ఆశించినంత ఆదాయం రాలేదు. నెలకు సగటున ఐదువేల కోట్లకు పైచిలుకు ఆదాయం రావాల్సి ఉండగా, 3 వేల కోట్లు మాత్రమే వసూలు అవుతున్నది. అనేక పథకాలకు దండిగా కోతలు విధిస్తున్నారు. అత్యంత వెనుకబడిన తరగతులకు వెయ్యి కోట్లు కేటాయించారు. ఇంత వరకు ఒక్కపైసా ఖర్చు చేయలేదు. ఎస్సీ, ఎస్టీలకు సబ్ప్లాన్ బడ్జెట్ ఖర్చు కాకుంటే క్యారీ ఫార్వార్డ్ చేస్తామన్నారు. ఆచరణలో నిధులు పక్కదారులు పడుతున్నాయి. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని వైద్యం నిలిపివేయడం పాలకులకు అత్యంత అవమానకరం. బకాయిలు పేరుకుపోతున్నాయి. ధనిక రాష్ట్రంలో ధనానికి కొదవలేదు.. నిధులు దిక్కులేదు.. అన్నట్టుగా తయారైంది. ద్రవ్యలోటు ప్రతి ఏడాది పెంచుకుంటూ పోయారు. భూములు అమ్మాలనుకున్నారు. అంతగా ఆదరణ రాలేదు. ఎక్సైజ్ ఆదాయం పెంచుకునేందుకు పల్లెల్లో తండాల్లో గుడంబా వ్యాపారం బంద్ పెట్టించారు. మారినవారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామన్నారు. అది కూడా చూపలేదు. రాష్ట్ర రాబడి పెరగక అనుకున్న ఆదాయం రాక సవాళ్ల మధ్య సర్కారు పాలన సాగుతున్నది.
రాష్ట్రం విడిపోయే నాటికి మన అప్పులు సుమారు 60వేల కోట్లు. ఇప్పుడు వందకు వందశాతం అప్పుల్లో అభివృద్ధి సాధించాం. పాలకులు అప్పులు లేకుండా అభివృద్ధి సాధించడం అసంభవమంటున్నారు. బడ్జెట్లో మిషన్ భగీరథకు రూ మూడు వేల కోట్లు మాత్రమే కేటాయించారు. తెలంగాణ స్టేట్వాటర్ గ్రిడ్ కార్పొరేషన్గా పేరు మార్చారు. ఇప్పటికే ప్రయివేటు బ్యాంకుల ద్వారా రూ.35 వేల కోట్లకు పైగా అప్పులు తీసుకు వచ్చారు. డిసెంబర్ నాటికి ఇంటింటికి మంచినీరు ఇస్తామన్నారు. ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాపితంగా మంచినీటి కోసం మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో చేసిన అప్పులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఒప్పందం చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కార్పొరేషన్గా మార్చి రుణం తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి హడ్కో ద్వారా రూ.12,600 కోట్లు అప్పుకు ఒప్పందం చేసుకున్నారు. 2 లక్షల ఇండ్లు పూర్తి చేస్తామన్నారు. అరకొరగా పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం - ఐరన్ వ్యాపారులు చేసుకున్న ఒప్పందం గిట్టుబాటు లేదని వ్యాపారులు చేతులెత్తేశారు. కేంద్రం 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. నిబంధనల ప్రకారం 14 రోజులలో స్థానిక సంస్థలకు పంపిణీ చేయాలి. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటున్నది. భవిష్యత్లో అప్పులకు వడ్డీలు వాయిదాలు... కట్టడానికే అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తుంది.
ఈ ఏడాది ఎన్నికలు జరుగుతాయి అంటున్నారు. అదే నిజమైతే ఇదే చివరి బడ్జెట్. ఎన్నికల బడ్జెట్ అవుతుంది. కొత్త కొత్త పథకాలు, ప్రయోజనాలు, అవసరాలు పాలకుల ముందుకు వస్తాయి. రైతు సాగుకు ఎకరానికి రూ.4వేలు సహాయానికి నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్తో ఉద్యోగుల వేతన ఒప్పంద కాలం ముగుస్తుంది. పెరిగే వేతనాలకు బడ్జెట్ స్థానం కల్పించాల్సి ఉంటుంది. గతంలో తయారుచేసినట్టు ఈ బడ్జెట్ను తయారు చేయడం అంత సులభం కాదు. అందరినీ ఆదరించాలి. ఎన్నికల దాకా నడిపించాలంటే బడ్జెట్వల కలగలిపి అల్లాలి. బడ్జెట్పై భ్రమలు తొలగకుండా చర్చ జరగకుండా ప్లాన్ టూ పాలకులు తెరమీదకు తెచ్చే అవకాశం లేకపోలేదు. 2014 రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి 2024 వరకు విజన్ 2024 పేరుతో దశమ వార్షిక దర్శినికతలను తయారుచేస్తున్నట్టు తెలుస్తున్నది. పత్రం రూపొందించడానికి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. పత్రం తయారుచేసే పనిలో పాలనా యంత్రాంగం పరిశ్రమిస్తున్నది. 2024 వరకు రూ.4 లక్షల కోట్ల బడ్జెట్ చేరుకుంటుందని అంటున్నారు. విజన్ 2020 వెనుక ప్రపంచ బ్యాంకు ఉంది. మరి దీనివెనుక వున్న అదృశ్య శక్తి ఆలస్యంగానైనా బయటికి వస్తుంది. బడ్జెట్ మీద విస్తృత చర్చ జరపాలి. ప్రత్యామ్నాయ బడ్జెట్ కోసం ప్రజలు ఉపక్రమించాలి.