Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరిగ్గా వారం రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాన్ని భారీగా పెంచారు. దిగుమతి సుంకం ఉక్కు మీద 25శాతం, అల్యూమినియం మీద 10శాతం పెరిగింది. అయితే ఆ సుంకం జాతీయ భద్రతా కారణాల మూలంగా వేయటం జరిగిందనే ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. సాధారణంగా ఇటువంటి ప్రకటన యుద్ధ సమయంలోను లేక జాతీయ విపత్తుల కాలంలోను ఇవ్వటం జరుగుతుంది. ఇందుకు ప్రతిగా అమెరికా మిత్ర దేశాలైన కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియాలతోపాటు చైనా అనేక చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.
దిగుమతి సుంకాలపై అంతిమంగా ఈ వారాంతంలో ట్రంప్ సంతకం చేయబోతున్నారు. అమెరికా మిత్రదేశాలు ఈ సుంకాలలో రాయితీలు ఇవ్వాలని వత్తిడి చేస్తున్నాయి. అయితే ప్రత్యేక వ్యాపారాలకు తప్ప దేశాలకు రాయితీలు ఇవ్వటం జరగదని అమెరికా వాణిజ్య, పారిశ్రామిక విధానానికి చెందిన విభాగం అధినేత పీటర్ నవర్రో అన్నారు. ఇందుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు జరిగినా దిగుమతులపై సుంకాలను విధించాలనే విధాన ప్రకటన ఒక చారిత్రక మలుపు అని చెప్పక తప్పదు. ఎందుకంటే అమెరికా వాణిజ్య విధానంలో నూతన వాణిజ్య సుంకాలకు జాతీయ భద్రత ఆధారమని ప్రకటించి ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ పరిమితులను దాటాడని ఫైనాన్షియల్ టైమ్స్ వ్యాఖ్యానించింది.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పెట్టుబడిదారీ వ్యవస్థ భవితకే ప్రశ్నార్థకమైన అంతర్జాతీయ ఘర్షణలను నివారించటానికి అమెరికా చొరవతోనే ఏర్పడిన ఆర్థిక సంబంధాల వ్యవస్థ పతనం ట్రంప్ ప్రతిపాదిత వాణిజ్య యుద్ధ చర్యతో మొదలవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో జాతి రాజ్య ఆర్థిక చట్రాలు రాజీలేని శత్రు వైరుధ్యంలో ఉండటమే దీనికి కారణం. వివిధ దేశాల ఉత్పత్తుల మధ్య వ్యవస్థీకృత సహకారం నెలకొల్పటానికి బదులుగా యుద్ధంలో విజేతలయి ప్రపంచంపై ఆధిపత్యం చెలాయిస్తున్న దేశాలకు చెందిన పెట్టుబడిదారులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చెందిన వనరులను దోపిడీ చేయటంలోనే ఈ వైరుధ్యం ఉన్నది.
పెట్టుబడిదారీ మూలాలు గల పరస్పరం కలహించుకునే జాతి రాజ్యాలకు మధ్యగల వైరుధ్యం మరింత తీవ్రమై యుద్ధాలకు దారి తీస్తుంది. 1929లో వచ్చిన మహా మాంద్యం కాలంలో ఇలానే జరిగి రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత కేవలం 20ఏండ్లకు రెండవ ప్రపంచ యుద్ధం మొదలయింది. అలా ప్రపంచ యుద్ధాలు జరగకుండా ఉండాలంటే ప్రపంచ స్థాయిలో ఒక స్థిరమైన ద్రవ్య వ్యవస్థ ఉండాలి. 1944లో అలా మొదలైందే బ్రెట్టాన్ వుడ్స్ అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ. దీనితోపాటు 1947లో జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్(గాట్)ను స్థాపించారు. ఈ రెండు సంస్థల ఏర్పాటుకు అమెరికా చొరవ చూపింది.
అయితే ఈ ద్రవ్య వ్యవస్థ 1930వ దశకంలో చెలరేగిన సామ్రాజ్యవాద దేశాల శతృ సంబంధాలను తిరిగి ఆవిర్భవించకుండా చేయగలిగింది. గానీ ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలోని మౌలిక వైరుధ్యాలను అధిగమించలేక పోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అత్యంత ప్రాబల్య ఆర్థికశక్తిగా ఎదిగిన అమెరికా ఆధిపత్యంపై అంతర్జాతీయ క్రమం (ఇంటర్నేషనల్ ఆర్డర్) ఆధారపడింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధానంతరం విస్తృతమైన ఆర్థికాభివృద్ధి జరగటంవల్ల జర్మనీ, జపాన్ దేశాలు బాగా పుంజుకుని అమెరికా ఆధిపత్యానికి గండికొట్టాయి. 1960వ దశకానికల్లా ఈ వైరుధ్యాలు అమెరికా విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల ప్రతికూల శేషంలోను, అమెరికా వాణిజ్య లోటులోను కనపడటం మొదలయింది. ఈ పరిస్థితి 1971లో అప్పటి అధ్యక్షుడు నిక్సన్ అమెరికా డాలరుకు బంగారం దన్నుగా ఉండే పద్ధతి తొలగించాడు. 1944లో నెలకొల్పబడిన అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థకు డాలరుకు బంగారం దన్నుగా ఉండటమే పునాది.
ఆ తరువాత కాలంలో పరస్పర సంబంధంలో వున్న రెండు ప్రక్రియలు కొనసాగాయి. మొదటిది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి ప్రక్రియలన్నీ ప్రపంచీకరణ ద్వారా ఐక్యమయ్యాయి. రెండవది, అమెరికా తన చారిత్రక విరోధులతోను, నూతన విరోధులు ముఖ్యంగా చైనాతో పోల్చినప్పుడు అమెరికా ప్రాబల్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో దిగుమతులపై సుంకాలను విధించటం ద్వారా ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. మహామాంద్యం తరువాత ఇటువంటి వాణిజ్య యుద్ధ వాతావరణాన్ని చూడలేదని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది.
ఈ వాణిజ్య యుద్ధ పర్యవసానం ఏమైనప్పటికీ ఇది కొనసాగుతుంది. ఎందుకంటే దీని మూలాలు అమెరికా అధ్యక్షుడి మానసిక ధోరణిలో లేవు. అవి పరిష్కారంలేని పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోని వైరుధ్యాలలో ఉన్నాయి. ఇలా పరిష్కరింపజాలని వైరుధ్యాలుగల పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని అధిగమించే శక్తులు ఆవిర్భవించేదాకా ఈ అరాచకం కొనసాగుతూనే ఉంటుంది.