Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోదావరి నాసిక్లో చిన్నధారగా మొదలవుతుంది. అనేక వాగులు, వంకలు, నదులను తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతుంది. మహారాష్ట్ర రైతాంగ పాదయాత్ర కూడా గోదావరి పుట్టిన దగ్గరే అంకురించింది. 25వేల మందితో ప్రారంభమైంది. 180 కిలోమీటర్లు 'లాంగ్ మార్చ్'గా సాగింది. మధ్యలో అనేకమంది అన్నదాతలను కలుపుకున్నది. ప్రవాహంగా పరుగులు తీసింది. ఆరు రోజులు కొనసాగిన ఉద్యమం ఉప్పెనలా మారింది. ఎర్ర సముద్రమై ముంబయి నగరాన్ని ఆవహించింది. అరుణ కిరణాలు కెరటాల్లా ఎగిసి పడ్డాయి. లాంగ్మార్చ్ దేశాన్ని ఆకర్షించింది. చరిత్ర సృష్టించింది. కర్షకులు రాత్రి మాత్రమే కలిసి ఉంటారు. పగలంతా భూమితో పెనవేసుకుని ఉంటారు. సంపద సృష్టిస్తారు. ఆ భూ సంబంధమే రాత్రింబవళ్లూ రైతులను కలిసి ఉండేలా చేసింది. భానుడి భగభగలు బుసలు కొడుతున్నా, ఎండలు మండుతున్నా, కాళ్లకింద భూమి సలసల కాలుతున్నా, పట్టుదల వీడలేదు. సంకల్పం సడలలేదు. కాలినడక మానలేదు, లక్ష్యం ముందు ఎలాంటి ఆటంకాలు నిలువలేదు. రైతుల పట్టుదల ముందు అన్నీ దిగదుడుపే. వృద్ధులూ మహిళలూ వయస్సు పరిమితులను సైతం లెక్కచేయకుండా పాల్గొన్నారు. అభినందనలు, అభివందనాలు, లాంగ్ మార్చ్కి జేజేలు.
అన్నదాతల అభిలాషలు పాలకుల వాగ్దానాలు ఎండమావులైనాయి. నిహారికలై కరిగిపోతుంటే కర్షకునికి కన్నీళ్లే మిగిలాయి. ఇలా ఎన్నేండ్లు? చింతిస్తున్న సమయంలో కదనానికి కదలాలని పిలుపునిచ్చింది అఖిలభారత కిసాన్సభ (ఏఐకెఎస్). సమరానికి సన్నద్ధం కావాలనీ మేల్కొల్పింది. జాగరూకులైన జనం నెత్తిన టోపీ, చేతిలో జెండా, సంకలో సంచితో స్రవంతిలా సాగారు. అకాల వర్షాలతో వడగండ్ల వానకు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అన్నదాతలు కడగండ్ల పాలయ్యారు. 19 జిల్లాల్లో రబీపంట తుడిచిపెట్టుకుపోయింది. రుణమాఫీకి ప్రకటనలు చేసిన పాలకులు పట్టించుకోలేదు. నదుల అనుసంధానంలో నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతల కుటుంబాలను ఆదరించలేదు. ఆటంకాలను అధిగమించి పంట పండించిన రైతుకు మార్కెట్లో గిట్టుబాటు ధర ఒట్టిమాటే అయింది. మార్కెట్ మాయ నియంత్రణలో పాలకులు విఫలమయ్యారు. వ్యవసాయరంగం సంక్షోభంలో పడింది. రైతులు అగాథంలో పడ్డారు. గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్థమైంది. అంతర్జాతీయ ధరల హెచ్చుతగ్గుల ప్రభావం భారతీయ రైతాంగం మీద పడింది. ఏండ్లకు ఏండ్లుగా రైతులు అటవీ భూములను దున్నుకుంటున్నారు. అలాంటి పోడు చేసుకుంటున్న సాగుదారులకు పట్టాలివ్వలేదు. బీజేపీ పార్లమెంటు సభ్యురాలు లాంగ్మార్చ్ని అవహేళన చేయాలని చూసారు. మహారాష్ట్ర ప్రభుత్వం లాంగ్మార్చ్ని ముందు నిరోధించాలని చూసింది. కానీ సాధ్యం కాలేదు. పాదయాత్ర రాజకీయ లబ్దికోసం కాదు, రైతుల కోసం. ఇది రైతులందరి ఉద్యమం అని ప్రకటించటం గమనార్హం. అన్నదాతల ఆక్రందనా, ఆగ్రహాన్నీ ఆచరణలో చూసిన ప్రభుత్వం రైతుల అన్ని కోరికలూ నెరవేర్చటానికి దిగొచ్చింది. నాయకులతో చర్చలు జరిపింది. రాతపూర్వక ఒప్పందం చేసుకుంది. స్వాతంత్య్ర భారతంలో గానీ, స్వాతంత్య్ర పోరాటంలో గాని ఇలాంటి ఉద్యమం జరగలేదు. లాంగ్మార్చ్ చరిత్రలో మైలురాయిగా మిగిలిపోతుంది. పోరాటాలకు స్ఫూర్తి నిస్తుంది. ఇచ్చిన మాటకూ చేసుకున్న ఒప్పందాలకూ పాలకులు కట్టుబడి ఉండాలి.
కర్షకులు కదలటం పాలకులు సమస్యల్ని పరిష్కారిస్తామనడం ఒక ఎత్తు అయితే, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నడవడం, క్రమశిక్షణ పాటించడం మరోఎత్తు. రోజుకు 30 కి.మీ. నడుస్తూ రోడ్డుపక్కనే పడుకోవటం అత్యంత ప్రత్యేకతగా నిలిచింది. మొదట ముంబయి వాసులు కలవరపడ్డారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న సమయం... లాంగ్మార్చ్ సాగడంతో సందిగ్ధంలో పడ్డారు. పిల్లల పరీక్షలు రైతుసంఘం దృష్టిలో పెట్టుకున్నది. పాదయాత్రలో మార్పులు చేసుకుంది. ఉదయం 11 గంటలకు ప్రదర్శన ప్రారంభమవుతుందని ప్రకటించింది. ప్రజల అవసరాలనూ గుర్తించింది. ప్రజలలో ఇది మంచి ప్రభావాన్ని కలిగించింది. సంఘీభావం వెల్లివిరిసింది. ముంబయి వాసులు అన్నదాతలకు అందించిన ఆదరణ అంతా ఇంతా కాదు. కర్షకులను అక్కున చేర్చుకున్నారు. గుండెలకు హత్తుకున్నారు. అర్థరాత్రి వరకు ముంబయి చేరుకుంటున్న రైతులకు నీళ్ల బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, ఇతర ఆహార పదార్థాలు అందించారు. పండ్లు పంచిపెట్టారు. చెప్పులు అందజేశారు. నడకలో గాయాలైన వారికి డాక్టర్లు సేవలు చేశారు. దేశానికి అన్నం పెడుతున్న రైతు కష్టాల్లో ఉంటే చూడలేకపోయారు. రాజకీయ పార్టీలు కూడా రైతాంగ ఉద్యమానికి దూరంగా ఉండలేకపోయాయి. మద్దతు తెలపకపోతే ఒంటరి పాలవుతామని భావించాయి. వరుసకట్టి సంఘీభావం తెలిపారు. రైతాంగ ఉద్యమాల సెగ పాలకులకు తాకడం మొదలైంది. లాంగ్మార్చ్ విజయం సాధించింది. జైత్రయాత్రగా నిలిచింది. రైతాంగ సమస్యలు విస్మరిస్తే కర్షకులు కదనరంగంలోకి వచ్చి పాలకుల పనిపడతారని గమనించాలి. పాలకులు లాంగ్మార్చ్ని ఒక హెచ్చరికగా భావించాలి.