Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు ప్రజలకు మోడీ ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపింది. నాలుగేండ్లుగా ఎదురుచూస్తున్న ఉక్కు ఫ్యాక్టరీల నిర్మాణం ఇక సాధ్యం కాదని చేతులెత్తేసింది. తెలంగాణలో బయ్యారం, ఆంధ్రప్రదేశ్లో కడప ఉక్కుఫ్యాక్టరీల నిర్మాణం సాధ్యం కాదని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో కాంగ్రెస్ పాలనలో మోసపోయామనీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా బయ్యారం ఉక్కు కర్మాగారం ఆశ నెరవేరుతుందనీ తెలంగాణ ప్రజలు ఎదురుచూశారు. విభజన సందర్భంగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టంలో ఇందుకు అవకాశం కల్పించడంతో తెలుగు ప్రజలకు ఆశలు చిగురించాయి. నిజానికి చట్టం రూపొందించినప్పుడే ఇక్కడ బయ్యారంలోనూ, అక్కడ కడపలోనూ ఉక్కు కర్మాగారాలను నిర్మిస్తామని సూటిగా పొందుపరిచి ఉండాల్సింది. చట్టం రూపొందించిన నాటి కాంగ్రెస్ పాలకులు గానీ, ఆమోదించిన బీజేపీ, టీఆర్ఎస్ నేతలు గానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పితీరాలి. ఏపీలో నాలుగేండ్లపాటు బీజేపీతో అధికారం పంచుకున్న టీడీపీ కూడా బాధ్యత వహించాల్సిందే.
కేంద్ర ఉక్కుగనులశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో మంగళవారంనాడు ఢిల్లీలో టాస్క్ఫోర్సు సమావేశం జరిగింది. బయ్యారం, బ్రాహ్మణీ ఉక్కు ఫ్యాక్టరీల వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెస్తారని ప్రజలు భావించారు. తాను కొత్తగా బాధ్యతలు స్వీకరించినందువల్ల స్టీల్ఫ్లాంట్కు చెందిన సమగ్ర సమాచారం కోసమే సమావేశం నిర్వహించానని కేంద్ర గనులశాఖ సంయుక్త కార్యదర్శి చెప్పడంతో అధికారులు నివ్వెరపోయారు. ఈ సమావేశంలో సంయుక్త కార్యదర్శి చెప్పిన మాటకూ కోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్కు పొంతన లేదు. అప్పటికే సాధ్యం కాదనే నిర్ణయానికి కేంద్రప్రభుత్వం వచ్చేసింది. కానీ టాస్క్ఫోర్సు కమిటీలో ఉభయ రాష్ట్రాల అధికారులకు మాత్రం ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టింది.
ఉక్కు కర్మాగారాల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఆరుమాసాలలో నిర్ణయం తీసుకోవాలని విభజన చట్టంలో చెప్పారు. నాలుగేండ్లు గడిచినా ఎటూ తేల్చలేదు. చివరకు సుప్రీం కోర్టుకు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో తెలుగు ప్రజలకు మొండిచేయి చూపుతూ తమ నిర్ణయాన్ని వెల్లడించారు. వాస్తవానికి మెకాన్కమిటీ నివేదికలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి అవకాశం ఉన్నదని చెప్పినట్టు తెలుస్తున్నది. ఆ కమిటీ నివేదిక పరిశీలిస్తున్నామని గురువారంనాడు కేంద్ర మంత్రి చౌదరి బీరేందర్సింగ్ ప్రకటించారు. స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు టాస్క్ఫోర్సు కమిటీ రోడ్మ్యాప్ సిద్ధం చేయనున్నట్టు మంత్రి ప్రకటనలో చెప్పారు. ఇదే నిజమైతే సుప్రీంకోర్టుకు అందజేసిన అఫిడవిట్లో కూడా అదే విషయం చెప్పి ఉండవచ్చు. మెకాన్కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది నిజమైతే ఉక్కు కర్మాగారాల నిర్మాణం సాధ్యం కాదని కోర్టుకు తేల్చి చెప్పవలసిన అవసరం లేదు. పరిశీలిస్తున్నామనే చెప్పవచ్చు. సాధ్యం కాదని కోర్టుకు చెప్పిన పాలకులు తెలుగు ప్రజల ఆగ్రహం గమనించిన తరువాత మభ్యపెట్టేందుకు మాట మార్చారు. ఇది ప్రజలను మోసం చేయటం తప్ప మరొకటి కాదు.
ఉక్కుకర్మాగారం విషయమే కాదు, విభజన చట్టంలోని అనేక విషయాలు కేంద్రం నిర్లక్ష్యం చేసింది. బాధ్యతా రహితంగా వ్యవహరించింది. నిర్దిష్ట కాలపరిమితిలో విభజన పూర్తి కానప్పుడు కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కరించి ఉండవల్సింది. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చింది కేంద్ర సర్కార్. ప్రతీ విషయంలోనూ 'నాకేంటి' అనే ధోరణి ప్రదర్శించింది. విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ శాసనసభా స్థానాలు పెంచాలి. హైకోర్టును విభజించాలి. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తిచేయాలి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలి. 9వ 10వ షెడ్యూళ్లలోని సంస్థల విభజన ప్రక్రియను పూర్తిచేయాలి. నాలుగేండ్లు గడిచినా ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. హైకోర్టు విభజన వివాదం తారాస్థాయికి చేరింది. దేశ చరిత్రలోనే మొదటిసారి న్యాయాధికారులు సైతం సమ్మెలోకి పోయారు. అయినా కేంద్ర పాలకులకు చీమకుట్టినట్టుగా కూడా లేదు.
దక్షిణాది రాష్ట్రాలపైనా రాజకీయంగా ఆశలు వదులుకున్న బీజేపీ నాయకత్వం తెలుగు ప్రజల సమస్యలు పట్టించుకునేందుకు సిద్ధంగా లేదు. అందుకే విభజన హామీలను నెరవేర్చవలసిన బాధ్యతను విస్మరిస్తున్నది. విభజన చట్టంలోని హామీలను అమలుచేస్తే తనకు ప్రయోజనం ఏమిటన్న దృష్టితోనే తప్ప ప్రజా ప్రయోజనాలను బీజేపీ పట్టించుకునే స్థితిలో లేదు. చేయవల్సిందంతా చేసి ఇప్పుడు మళ్లీ ఉక్కుకర్మాగారాల నిర్మాణం కోసం రోడ్డు మ్యాప్ గురించి నమ్మబలుకుతున్నది. ఇది ప్రజల చెవిలో పువ్వుపెట్టడమే. ఇప్పుడు తేల్చుకోవాల్సింది తెలుగు ప్రజలే. కేంద్రంతో పోరాడకుండా న్యాయం జరగదు. జరిగిన నష్టంలో తన బాధ్యతలేదని తెలుగుదేశం పార్టీ చెప్పజాలదు. తెలంగాణలో సైతం టీఆర్ఎస్ నాయకత్వం కేంద్రంతో లాలూచీ కుస్తీ మానుకోవాలి. కేంద్రం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించటంలో చిత్తశుద్ధి ప్రదర్శించాలి.