Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరివారం సాగిస్తున్న ఆర్థిక అరాచకం ఎంతోమంది ఆర్థిక నిపుణులను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలతో యిమడలేక ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్నారు. భారతీయ రిజర్వుబ్యాంక్ గవర్నర్ పదవి నుండి రఘరామ్ రాజన్ తప్పుకోగా, గడువు ఉండగానే నిటి ఆయోగ్ వైస్చైర్మెన్ పదవికి అరవింద్ పనగారియా రాజీనామా చేసారు. తాజాగా పదవీకాలం ముగియడానికి ఇంకా పదినెలల గడువుండగానే అరవింద్ సుబ్రమణియన్ (సీఈఎ) ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఈ ముగ్గురూ తిరిగి తమ పాత స్థానాలకు వెళ్లడమంటే సర్కార్కు షాక్ ఇవ్వడమే. ఇలా అర్ధాంతరంగా ఈ ముగ్గురూ బయటకు వెళ్లడం ఆర్థికవర్గాల్లోనే కాక రాజకీయంగానూ షాకివ్వడమే. దీనంతటికీ ముఖ్యకారణం ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్న విధానాలే. వెళ్లినవారంతా సాధారణ వ్యక్తులేమీ కాదు. ఈ ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ లాంటి అనుబంధ హిందూత్వ శక్తులకు విధేయులుగా ఉన్నవారే. మనుగడ సాగించగలరనీ, లేకుంటే తప్పుకోవడం శ్రేయస్కరమనే అభిప్రాయానికి వారు వచ్చినట్టు తెలుస్తోంది. అధికారంలోకి మోడీ వచ్చాక ఆర్థిక వ్యవస్థను చక్కపెడతారనీ, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తారనీ బీజేపీ హామీ ఇచ్చింది. అవేవీ ఆశించిన ఫలితాలనివ్వలేదు. పెద్ద నోట్లరద్దుతో యావత్తు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. నోట్లరద్దు ఎవరికి లబ్ది చేకూరుతున్నదీ తెలుస్తూనే ఉంది. కుబేరుల నల్లధనం తెల్లధనంగా మారింది తప్ప నల్లధనం బయటకు రాలేదు. జీఎస్టీ శ్లాబులతో వ్యవస్థే దెబ్బతిన్నది. తిమ్మిని బమ్మిని చేస్తూ ఆర్థిక గణాంకాలను తారుమారు చేసి లేని వృద్ధిని ఉన్నట్టుగా చూపే ప్రయత్నం ఎలా జరిగిందో చూస్తున్నాం. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని లెక్కించే పద్ధతిని మార్పు చేసి వృద్ధిని ఎక్కువగా చూపినా ఆ తర్వాత నిజమేంటో బయటపడింది. ఇప్పుడు వృద్ధిరేటును రెండంకెలకు తీసుకెళ్ల గలమని బీరాలు పలుకుతోంది. ప్రభుత్వ విధానాలకు విధేయులు కాదంటూ ముఖ్య ఆర్థిక సలహాదారులను పరోక్షంగా తప్పిస్తూ పోతుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి.
2014 అక్టోబర్ 16న సుబ్రమణియన్ మూడేండ్ల కాలానికి సీఈఎగా నియమితులయ్యారు. 2017లో ఆయన పదవీ కాలాన్ని కేంద్రప్రభుత్వం పొడిగించింది. దాదాపు నాలుగేండ్లపాటు సీఈఎ పదవిలో కొనసాగిన సుబ్రమణియన్ వ్యక్తిగత కారణాలరీత్యా తప్పుకుంటున్నట్టు రెండురోజులక్రితం ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్బుక్ ద్వారా ధృవీకరించారు. కుటుంబ కారణాలు అని చెప్పినా 2014కు ముందు అమెరికాలో తాను సీనియర్ రీసెర్చ్ పర్సన్గా పనిచేసిన పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లోనూ, వాషింగ్టన్లోని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ సంస్థలోనూ చేరి ఆర్థిక వ్యవహారాల అధ్యయనం, పుస్తక రచన కొనసాగిస్తానని అరవింద్ చెప్పారు. ఇది మోడీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బే. ఆయన అర్థాంతరంగా తప్పుకోవడం ప్రభుత్వంలోని కొంతమంది ఒత్తిళ్లే కారణం. 2019 సార్వత్రిక ఎన్నికల వరకు పదవీకాలం ఉన్నా, వచ్చే ఏడాది రిజర్వుబ్యాంకు చైర్మెన్ పదవి ఖాళీ అవుతుందని తెలిసినా అరవింద్ తప్పుకోవడానికి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆయన సూచనలను మోడీ సర్కార్ పట్టించుకోకపోవడమే ప్రధాన కారణం. అరవింద్ ఆ పదవిలో కొనసాగడానికి ముందు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘరామ్ రాజన్ పనిచేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని రాజన్ స్వేచ్ఛగా తప్పుపట్టగలిగారు. అరవింద్ మాత్రం అటువంటి పలు నిర్ణయాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పకపోయినా ''ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్నది. విదేశీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, రెండంకెల వృద్ధిరేటు సాధించటం సమీప భవిష్యత్లో కష్టం.'' అని కేంద్రానికి సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం.
జీఎస్టీ వ్యవస్థ రూపకల్పనలో కీలకపాత్ర పోషించినా ఆయన సూచించిన శ్లాబులను కేంద్రం పెడచెవిన పెట్టింది. అన్ని రంగాల బలోపేతానికి చర్యలు తీసుకుంటూ తక్కువ రేట్ల శ్లాబులతో ఇచ్చిన నివేదికను బుట్టదాఖలా చేసింది. పన్నురేట్లు కనిష్టంగా ఉంటూ ఎటువంటి అదనపు సెస్సులూ లేని వ్యవస్థ రూపొందాలన్న ఆయన కోరిక పూర్తిగా నెరవేరలేదన్న అభిప్రాయంలో ఉన్నారు. రాజన్, అరవింద్లను జాతి వ్యతిరేకులుగా సుబ్రమణ్యస్వామి పేర్కొంటూ తన పరువు తీసుకున్నారు. అరవింద్ వల్లే ఆర్థిక వ్యవస్థలో పలు మార్పులు తీసుకు వచ్చామని, అవసరమైతే ఆయన సూచనలను తీసుకుంటామని అరుణ్జైట్లీ చెబుతుంటే, అరవింద్కు దేశం పట్ల అవగాహన లేదనీ, ఇకపై అలాంటి పదవుల్లోకి భారతీయ భావజాలమున్నవారిని తీసుకోవాలనీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ కేంద్రానికి సూచించడం పరిస్థితిని తెలియజేస్తోంది. సమాజంలో హిందువులు, ముస్లింలు అంటూ విభజన తీసుకురావడం దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తోందంటూ 2016లో సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్కు రుచించలేదు. వృత్తి నిబద్ధత కంటే భావజాల అనుకూలతకే ప్రాధాన్యం ఇస్తూ పాలకులు తమ చుట్టూ వందిమాగధులను పెంచుకుంటూ పోతే ప్రజలు మరిన్ని అర్థంలేని ఆర్థిక దాడులు చవిచూడాల్సిన దుస్థితి దాపురించడం ఖాయం.